Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిజిటల్ పేమెంట్ ఆప్షన్లోకి వస్తోన్న వాట్సాప్
- ఇప్పటికే మెసేజింగ్ సర్వీసులను ప్రారంభించిన పేటీఎం
- రెండు సంస్థల సేవలు మొదటగా భారత్లోనే!
- యూజర్ బేస్ అత్యధికంగా ఉండటమే కారణం..?!
- పరోక్ష యుద్దాన్ని తలపిస్తున్న వాట్సాప్, పేటీఎం నయా ఫీచర్లు
మార్కెట్ పోకడను అర్ధం చేసుకుంటూ, వినియోగ దారుల సౌలభ్యం కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తూ వారి ఆదరాభిమానాలను చూరగొంటేనే ఏ కంపెనీ అయినా నాలుగు కాలాలు విపణిలో మనుగడను సాగించ గలదు. మూస పద్ధతిలో పయనించిన ఎంతగొప్ప కంపెనీ అయినా మూత పడకతప్పదని ఇప్పటికే ఎన్నో రుజువులు వాణిజ్యరంగంలో సాక్షాత్కరింపబడినవి. కాగా, మార్కెట్ పోటీ, కస్టమర్ గణాంకాలు, ప్రాఫిట్, వ్యాపార విస్త తి మొదలగు అంశాలే ప్రాతిపదికన భారతదేశమే వేదికగా రెండు బడా సంస్థల మధ్య చోటుచేసుకుంటున్న ఆసక్తికర పోటీ.. వ్యాపారవర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఆ నేపథ్యంపై 'నవతెలంగాణ' ప్రత్యేక కథనం..
* (జై)
ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా అని తేడాలేకుండా ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ప్రతీ ఒక్కరి ముఖాలు స్మార్ట్ ఫోన్లలో నిక్షిప్తం అయ్యేలా చేస్తోన్న సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్.. టీకొట్టును నడిపే చారు వాలా నుండి కోట్ల విలువచేసే జ్యువెల్లరీ షాప్ యజమాని వరకు ప్రతీ ఒక్క వర్తకుడు నోట్లరద్దు అనంతరం విరివిగా ఉపయోగిస్తోన్న దేశంలోనే అతిపెద్ద పేమెంట్ కంపెనీ పేటీఎంల మధ్య మొదలైన పరోక్ష కార్పొరేట్ పోటీతత్త్వం.. యుద్ధాన్ని తలపించేలా ఉంటూ ప్రతీఒక్కరిని ఆకర్షిస్తుండటం విశేషం.
నేను నీ దారిలో.. నువ్వు నా దారిలో :పేమెంట్ ఆప్షన్తో వస్తోన్న 'వాట్సాప్ పే' ! :
వినూత్న ఫీచర్లతో మెసేజింగ్ యాప్లలో నూతన ఒరవడిని సృష్టిస్తూ దూసుకుపోతున్న వాట్సాప్ యాప్ త్వరలోనే పేమెంట్ ఆప్షన్ను తీసుకురానున్నట్టు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే!
కాగా, చాలా రోజులుగా ఈ ఫీచర్పై పనిచేస్తున్న వాట్సాప్ బృందం రానున్న డిసెంబర్లో ఈ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నట్టు విశ్వసనీయ సమాచారం. కాగా, ఈ కొత్త ఆప్షన్కి 'వాట్సాప్పే'గా నామకరణం చేసే అవకాశమున్నది. యూపీఐ ఆధారిత పేమెంట్ ఫీచర్ కోసం వాట్సాప్ సంస్థ ఇప్పటికే దేశంలోని దిగ్గజ బ్యాంకులైన ఎస్బీఐ, ఐసీఐ సీఐ, హెచ్డీఎఫ్సీలతో చేతులు కలిపినట్టు తెలుస్తోంది. ఇక, ఈ నయా వాట్సాప్ పే ఫీచర్ ద్వారా యూజర్లు ఎమౌంట్, యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే చాలు.. ఎవరికైతే డబ్బులను పంపాలనుకుంటున్నారో సదరు వ్యక్తులకు సెకన్లలో ఫండ్స్ ట్రాన్స్ ఫర్ అవుతాయని సదరు సంస్థ ప్రతినిధులు తెలుపుతున్నారు.
మెసేజింగ్లోకి 'పేటీఎం ఇన్బాక్స్':
ఇప్పటివరకు డిజిటల్ లావాదేవీలకే పరిమితమైన దేశంలోనే అతిపెద్ద పేమెంట్ యాప్ పేటీఎం 'ఇన్బాక్స్' పేరిట మెసేజింగ్ సర్వీస్ను తన యూజర్లకు అందుబాటు లోకి తీసుకువచ్చినట్టు ప్రకటించింది. వినియోగదారులు, విక్రయదారుల మధ్య సమన్వయాన్ని మరింత పెంచుతూ ఏకకాలంలో చాటింగ్, లావాదేవీలు జరుపుకునేలా ఈ మెసేజింగ్ సేవను ప్రారంభించినట్టు పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ అబోట్ ఈ సందఠంగా తెలిపారు. కాగా, మెసేజ్లతో పాటు ఫొటోలు, వీడియోలు, లైవ్ లొకేషన్, క్యాప్చర్, షేర్ మూమెంట్లే కాకుండా నోటిఫికేషన్లు, ఆర్డర్లు, గేమ్స్ వంటి అదనపు ఫీచర్లతో తాజా ఇన్బాక్స్ సర్వీస్ రూపుదిద్దుకోవడం విశేషం.
భారతదేశమే ఎందుకు? :
సరికొత్త ఫీచర్లతో మెసేజింగ్ సర్వీసుల రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న వాట్సాప్ త్వరలోనే డిజిటల్ పేమెంట్ సర్వీసులను ఆరంభించే ఆలోచనలో ఉండగా.. దేశంలో అతిపెద్ద పేమెంట్ కంపెనీగా సేవలందిస్తోన్న పేటీఎం సంస్థ ఇప్పటికే ఇన్బాక్స్ పేరుతో మెసేజింగ్ సేవలకు శ్రీకారం చుట్టడం విశేషం. ఐతే, రెండు సంస్థలు ప్రాథమికంగా తమ లేటెస్ట్ ఫీచర్లను భారత్ వేదికగా ప్రారంభించడం గమనార్హం. దీనికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం వాట్సాప్కి ప్రపంచవ్యాప్తంగా సుమారు 130 కోట్ల మంది యూజర్లు ఉండగా.. వీరిలో దాదాపు పాతిక కోట్ల మంది మన దేశంవారే! అంతేనా, నోట్లరద్దు తర్వాత డిజిటల్ పేమెంట్లు అనివార్యమవ్వడం అప్పుడే పేటీఎం, మొబిక్విక్, పేయూమనీ వంటి పేమెంట్ సంస్థలకు ఆదరణ లభించ డాన్ని చూసిన తర్వాతే, వాట్సాప్ డిజిటల్ పేమెంట్స్ లోకి అరంగేట్రం చెయ్యడానికి నిశ్చయించుకున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డీమానటైజేషన్ తర్వాత ఏకంగా 20కోట్ల వినియోగదారులను చేజిక్కించుకొని డిజిటల్ పేమెంట్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన పేటీఎం సంస్థ మెసేజింగ్ సర్వీసులను ప్రారంభించడానికి భారత్ లో సంస్థకున్న అమోఘ యూజర్ బేస్ ఒక కారణం కాగా.. వాట్సాప్, వీచాట్ తదితర సంస్థల లాగా మెసేజింగ్ ఫీచర్ ను అందుబాటులోకి తెస్తే.. యూజర్, విక్రయదారుల మధ్య కో -- ఆర్డినేషన్ తో పాటు సంస్థకు మరింత ఆదరణ దక్కే అవకాశాముందని పేటీఎం భావించి ఉండొచ్చని బిజినెస్ పండితులు పేర్కొంటున్నారు. ఏదైతేనేమి, పోటీ మాట అటుంచితే, అంతిమంగా వినియోగదారుల నమ్మకాన్ని కాపాడుతూ వారికి సరికొత్త అనుభూతిని అందించే ఏ సంస్థ సేవలైనా ఆహ్వానించదగ్గవే నని ఒప్పుకోవాల్సిందే!
పేటీఎం వాట్సాప్ ప్రారంభించబడిన
సంవత్సరం 2010 2009
యూజర్లు (భారత్)
సుమారు 20కోట్లు సుమారు పాతిక కోట్లు
ఇప్పటివరకు అందిస్తున్న
సర్వీసులు డిజిటల్
పేమెంట్స్, ఆన్లైన్ షాపింగ్,
పేమెంట్ బ్యాంక్ మెసేజింగ్ సేవలు