Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫీజు చెల్లించొచ్చు
- ఇంటర్ బోర్డు వెల్లడి
- నవతెలంగాణ కథనానికి స్పందన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2017-18 విద్యా సంవత్సరంలో వివిధ కారణాలతో ప్రవేశాల లాగిన్ పొందని ప్రయివేటు జూనియర్ కాలేజీల్లో చదివి ఫెయిలైన విద్యార్థులకు ఊరట లభించింది. ఆ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు అంగీకరించింది. 'ఆ విద్యార్థులు ఫీజు కట్టేదెలా?' అన్న శీర్షికన నవతెలంగాణలో శుక్రవారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనికి ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎ అశోక్ స్పందించి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో వివిధ కారణాలతో ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశాల లాగిన్ పొందని ప్రయివేటు జూనియర్ కాలేజీలు 447 లేవని, కేవలం 62 మాత్రమే ఉన్నాయని తెలిపారు. 62 కాలేజీల్లో చదివి ఫెయిలైన విద్యార్థులు 2018 మార్చిలో వార్షిక పరీక్షల ఫీజును ఆయా కాలేజీలకు దగ్గర్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చెల్లించొచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డీఐఈవో)లకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఫెయిలైన ఆ విద్యార్థులు డీఐఈవో, నోడల్ అధికారుల కార్యాలయాలను సంప్రదించాలని కోరారు. ఈ విద్యాసంవత్సరంలో 62 కాలేజీల్లో ప్రథమ సంవత్సరంలో సున్నా ప్రవేశాలు, ద్వితీయ సంవత్సరంలో 15 మందిలోపు విద్యార్థులున్నారని తెలిపారు. ఆ కాలేజీల్లో చదివి ఫెయిలైన విద్యార్థులు, ఇతర వివరాలను దగ్గర్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీకి పంపించామని తెలిపారు.