Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్టీ ప్రజా ప్రతినిధులకు సీఎం సూచన
- ప్రతిపాదనలతో రావాలని విజ్ఞప్తి
- నేడు మరోసారి భేటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గిరిజన ప్రజా ప్రతినిధులకు సూచించారు. శనివారం నిర్వహించే సమావేశానికి రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలు, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? ఎస్టీల అభివృద్ధికి ఇంకా ఎలాంటి స్కీములు ప్రవేశపెడితే బాగుంటుందో అన్న ప్రతిపాదనలతో రావాలని కోరారు. గిరిజనుల సమస్యలపై శుక్రవారం ప్రగతి భవనలో ఎస్టీ ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా, ముఖ్య కార్యదర్శి మహేశ్దత్ ఎక్కా, శాంతకుమారి, ఎంపీలు సీతారామ్ నాయక్, నగేశ్, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, రవీంద్ర కుమార్, రేఖా నాయక్, కోవ లక్ష్మి, బాబురావు, మదన్లాల్, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, శంకర్ నాయక్, ఎమ్మెల్సీలు రాములు నాయక్, గిరిజన కార్పొరేషన్ చైర్మెన్ గాంధీనాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎస్టీల్లో పేదరికాన్ని తరిమికొట్టడానికి గిరిజన ప్రజా ప్రతినిధులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎస్టీలంతా ఐక్యంగా ఉండి ప్రభుత్వ పథకాలతో లబ్ది పొందాలని సూచించారు. రాష్ట్రంలో 30లక్షల మందికి పైగా ఉన్న ఎస్టీలో అధిక శాతం పేదరికంతో మగ్గుతున్నావారేనని చెప్పారు. ఎన్నో ఏండ్లుగా గిరిజనులు డిమాండ్ చేస్తున్న గ్రామ పంచాయితీల కోరికను నెరవేర్చబోతున్నామని చెప్పారు.
ఆర్ఓఎఫ్ఆర్లో సమస్యలు
ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను గుర్తించే విషయంలో సమస్యలున్నాయని, పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునే వారికి ప్రభుత్వం సాయం అందించడంలో చిక్కులు ఉన్నాయని తెలిపారు. దీనివల్ల పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునే వారికి ప్రభుత్వం సాయం అందే విషయంలో ఇబ్బందులు వస్తున్నాయని సీఎం చెప్పారు. 1/70 చట్టం అమలు విషయంలో కూడా కొన్ని చిక్కులు వస్తున్నాయన్నారు. ఎస్టీ ధృవీకరణ పత్రాల విషయంలోనూ సమస్యలు ఉండటం వల్ల స్వయం ఉపాధి పథకాలకు బ్యాంకుల నుంచి కాన్సెంట్ రావడం లేదని సీఎం చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులు కూడా కొన్ని చోట్ల చెల్లించాల్సి ఉందన్నారు. గిరిజన తండాలకు రోడ్లు, బస్సు, విద్యుత్తు సౌకర్యం కల్పించడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సీఎం అధికారులను ఆదేశించారు.