Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ తర్వాత జిల్లాల్లో పర్యటనలు
- తద్వారా పోటీ చేయబోయే నియోజకవర్గాల గుర్తింపు
- రేపు హైదరాబాద్లో లెఫ్ట్తోపాటు మరో 25 పార్టీల సన్నాహక సమావేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ విధానాలకు భిన్నంగా ప్రజల పక్షాన ఆలోచించే ప్రత్యామ్నాయం (రాజకీయ ఫ్రంట్) రాష్ట్రంలో పురుడు పోసుకోబోతున్నది. ఈ క్రమంలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా ఆదివారం నిర్వహించే సన్నాహక సమావేశంలో వామపక్షాలు, అభ్యుదయ, ప్రజాతంత్ర శక్తులు, మేధావులు సమావేశం కానున్నారు. దాదాపు 25 రాజకీయ పార్టీలు కూడా ఈ భేటీకి హాజరుకానున్నాయి. ఈ శక్తులన్నింటినీ కూడగట్టటంలో సీపీఐ (ఎం)తోపాటు ప్రజా యుద్ధనౌక గద్దర్, మేధావులు ప్రొఫెసర్ తిరుమలి, కంచ ఐలయ్య, పీఎల్ విశ్వేశ్వరరావు, మురళీ మనోహర్లాంటి వారందరూ చురుగ్గా పనిచేస్తున్నారు. రాబోయే కాలంలో జస్టిస్ (రిటైర్డ్) చంద్రకుమార్, కోదండరామ్, బీసీ సంఘాల నాయకులు కృష్ణయ్యలాంటి మేధావులను, ఎమ్మార్పీఎస్, మాల మహానాడుతోపాటు ఇతర సామాజిక సంఘాలను ఫ్రంట్లోకి రాబట్టేందుకు వారు కృషి చేస్తున్నారు. ఈ సమావేశం తర్వాత నాయకులు జిల్లాలన్నింటిలో పర్యటించబోతున్నట్టు సమాచారం. తద్వారా నియోజకవర్గాలను గుర్తించి, ఫ్రంట్ తరపున 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు యోచిస్తున్నట్టు తెలిసింది. జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో రాజకీయ ఫ్రంట్ను అధికారికంగా ప్రకటించే అవకాశముంది.
రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామంటూ టీఆర్ఎస్ చెబుతుంటే.. ఆ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనంటూ కాంగ్రెస్ ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నది. ఈ రెండు పార్టీలు తెలంగాణాకు ప్రత్యామ్నాయం కాదని ఫ్రంట్ను ఏర్పాటు చేయబోయే నాయకులు చెబుతున్నారు. టీఆర్ఎస్ మూడున్నరేండ్ల పాలనలో ప్రజల ఆశలు, ఆకాంక్షలన్నీ నీరుగారి పోయాయి, కేసీఆర్ సర్కారు అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలతో వాటి అమలు సాధ్యం కాదన్నది వారి అభిప్రాయం. మరోవైపు తెలంగాణ నాశనానికి కారణం కాంగ్రెస్సేనని వారు విమర్శిస్తున్నారు. రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించింది ఆ పార్టీయే.. అలాంటిది ఈ ప్రాంత వెనుకబాటుతనానికి, దరిద్రానికి కారణమైన ఆ పార్టీ.. రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానంటే అది నమ్మదగిన మాట కాదన్నది ఆయా నాయకుల నిశ్చితాభిప్రాయం. అందుకే టీఆర్ఎస్, కాంగ్రెస్ కాకుండా ప్రజల పక్షాన ఆలోచించే ప్రత్యామ్నాయానికి కృషి చేస్తున్నామని వారు తెలిపారు.
ఆధిపత్యానికి కొమ్ముకాస్తున్న ఆ రెండు పార్టీలు..
కేవలం ఆర్థిక విషయాలేగాక సామాజిక కోణంలోంచి పరిశీలిస్తే.. కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ అగ్రవర్ణాల, ఆయా కులాల ఆధిపత్యానికే కొమ్ముకాస్తున్నాయి. టీఆర్ఎస్ వెలమ, కమ్మ కాంబినేషన్కు ప్రాతినిధ్యం వహిస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ రెడ్డి కులస్తుల ఆధిపత్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది. రాజకీయాల్లో అగ్రకులాలు ఉండకూడదంటూ తాము చెప్పటం లేదని.. అదే సమయంలో అగ్రకులాల ఆధిపత్యం ఉండకూడదన్నది తమ అభిప్రాయమని ప్రత్యామ్నాయ వేదికకు సన్నాహాలు చేస్తున్న నాయకులు అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్లోను, కాంగ్రెస్లోనూ వెలమ్మ, కమ్మ, రెడ్డి నాయకులుంటే, వారు ఎక్కడో ఒక చోట ఎమ్మెల్యేనో, ఎంపీ అయితేనో తప్పేం కాదని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఈ సందర్భంగా అన్నారు. కానీ కమ్మ, వెలమ అగ్రవర్ణ ఆధిపత్యాన్ని ప్రజల మీద రుద్దటం సరికాదని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకూ అనేక ప్రాంతాల్లో కుల దురహంకార హత్యలు జరిగాయి. వాటిపై టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు నోరు మెదపలేదని ఈ సందర్భంగా కొందరు మేధావులు విమర్శించారు. యాదాద్రి జిల్లా పల్లెర్ల ఘటనను ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. అక్కడ ఒక చాకలి యువకుణ్ని రెడ్డి కులస్తుడు.. దారుణంగా హతమారిస్తే టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఇప్పటి వరకూ కనీసం ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదని వారు గుర్తుచేశారు. బాధితుల్ని ఒక్కసారి కూడా పరామర్శించలేదని, కుల దురహంకార హత్యలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ఒక్కసారి కూడా పాల్గొనలేదని విమర్శించారు.
సామాజిక న్యాయానికి చాలా ప్రాధాన్యత..
ఈ నేపథ్యంలో సామాజిక న్యాయమనే అంశానికి తెలంగాణ రాజకీయాల్లో చాలా ప్రాధాన్యత ఉందని వారు చెబుతున్నారు. అట్టడుగు కులాల ప్రాతినిధ్యం చట్టసభల్లో పెరగాలి. వారికి అవసరమైన ఆర్థిక, సంక్షేమ పథకాలు, చట్టాలు, బీసీలు, ఎంబీసీలు, ఎస్సీ, ఎస్టీలు, ఎంబీసీలు రక్షణకోసం అవసరమైన చర్యలు, వారు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు అవసరమైన ప్రోత్సాహకాలు, వాటిని అమలు చేసే విధానాలు కావాలని సూచిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ దగ్గరగాని, ప్రతిపక్ష కాంగ్రెస్ వద్దగానీ ఇలాంటి విధానాల్లేవని స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ఈ విధానాలతో, సామాజిక న్యాయం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి అనే అజెండాతో వామపక్షాలు, అభ్యుదయ శక్తులు, సంఘాలు, మేధావులు.. అందరూ ఏకమై ఒక రాజకీయ ఐక్య సంఘటనగా ఏర్పడాలని వారు కోరుకుంటున్నారు. ఈ కృషిలో సీపీఐ (ఎం) క్రియాశీలక పాత్రను పోషిస్తున్నది.
ఆకలేసే వాడికి కేకలేసే స్వేచ్ఛ ఉండాలి...
''ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ అన్నం పెట్టటం, వారిని సంతోషం పెట్టటం ఒక భాగమైతే.. ఆ సుఖం లేని వాడికి, సంతోషం లేనివాడికి, ఆకలైన వాడికి.. ఆకలేసినప్పుడు కనీసం కేకలేసే స్వేచ్ఛ అయినా ఉండాలి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ స్వేచ్ఛను కూడా పూర్తిగా హరించి వేస్తున్నది. కాబట్టి ఇదో ప్రాథమికమైన సమస్య. కనీసం ప్రదర్శనలు, హాల్ మీటింగులకు కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. ప్రశ్నించ టానికి వీల్లేకుండా ఉద్యమాలను అణచివేస్తున్నారు. అయితే అణచివేసినంత మాత్రాన ప్రజల అసంతృప్తి అణగదు. ఒక దారిలో అణచివేస్తే ఇంకోదారిలో అది బయటికొస్తుంది. ప్రజలు తప్పకుండా పోరాడతారు. అయితే విడివిడిగా ఉన్న ఈ పోరాటాలన్నిం టినీ సంఘటితం చేయాలన్నది మా ప్రయత్నం. అందుకు ఈ రాజకీయ ఫ్రంట్ ఉపయోగపడుతుంది. రాజకీయాలను అనుసరించే వారేగాక ప్రజాస్వామ్య ప్రియులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, నిరుద్యోగులు, బీసీలు, ఎంబీసీలు, మైనారిటీలు, దళితులు, గిరిజనులు అందరూ ఈ సంఘట నలోకి రావాలని మేం కోరుతున్నాం...''
- తమ్మినేని వీరభద్రం సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి