Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.50 కోట్ల భూములు స్వాహా
- కబ్జాదారుల మధ్యే ఒకరికొకరు రిజిస్ట్రేషన్లు
- అక్రమంగా అమ్మకాలు.. అధికారుల చేతి'వాట'ం
కోట్ల విలువైన భూములను కొల్లగొట్టేందుకు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించారు భూబకాసురులు. సీలింగ్ రికార్డులని అనుమానం రాకుండా ముఠాలోని సభ్యులే ఒకరి పేరుపై మరొకరు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ 25 ఎకరాల భూమిని కాజేశారు. ఇప్పటికే కొంతభూమిని ఇతరులకు కట్టబెట్టేశారు. ఈ బాగోతమంతా అధికారుల చేతి'వాటాల' ప్రోద్భలంతోనే సైలెంట్గా సాగుతోంది
నవతెలంగాణ - కరీంనగర్ ప్రతినిధి
కరీంనగర్ నగర శివారులోని కొత్తపల్లి నూతనంగా ఏర్పడిన మండలం. నగర విస్తీర్ణంలో భాగంగా ఈ ప్రాంతంలోని భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గుంట స్థలం రూ.10 లక్షల మేరకు పలుకుతోంది. కొత్తపల్లి పరిధిలోని సర్వేనెంబరు 175, 197, 198లో 24 ఎకరాల 30 గుంటల సీలింగ్ భూమి ఉంది. కరీంనగరాన్ని రూపొందించిన అప్పటి రాజు వారసుడైన షేక్ సాలం భూమి అది. సీలింగ్ చట్టం వచ్చిన నేపథ్యంలో ఆ భూమిని 1974లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అప్పట్నుంచి భూమంతా పడావుగా ఉండటంతో ఓ భూస్వామ్య కుటుంబం కన్నుపడింది. సాగు చేసుకుంటున్నారు. 1991లో ఆ భూమిని కాజేసేందుకు పథకాన్ని రచించారు. ముందుగా ఏడెకరాల భూమిని షేక్ ఫరిదాతో హబీబ్ అలీ పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం ఆ మాఫియాలోని 8 మంది సభ్యులు కలిసి మళ్లీ షేక్ ఫరిదా పేర రిజిస్ట్రేషన్ చేశారు. 198 సర్వేనెంబరులో మూడెకరాల భూమిని సయ్యద్ గులాం అహ్మద్కు అమ్మారు. 175 సర్వేనెంబరులో నాలుగు ఎకరాలను నల్ల నారాయణకు విక్రయించారు. మొత్తంగా ఈ రిజిస్ట్రేషన్లు పలుమార్లు జరగడంతో ఈ మాఫియాకు సంబంధించిన ఫైలును గతంలో కొందరు సేకరించారు. ఈ కబ్జా పర్వమంతా సీలింగ్లో భాగంగా ఇచ్చిన అసలుదారు షేక్ సాలం మునిమ నవడు షేక్ అలీ దృష్టికి చేరింది. దీనిపై 2015లోనే ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వానికి అసమగ్ర నివేదిక
ఈ కబ్జా వ్యవహారంపై దర్యాప్తు చేయాల్సిందిగా, ఆ నివేదికను 15 రోజుల్లో ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా యంత్రాంగానికి 2015లోనే ఆదేశాలు అందాయి. దర్యాప్తు చేసిన అప్పటి తహసీల్దార్ రైల్వే లైను కోసం ఎకరా స్థలం పోగా నల్ల నారాయణ వద్ద మరో ఎకరాన్నర ఉందని నివేదికలో పొందుపరిచారు. ఎకరా 15 గుంటలు మాత్రం అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగినట్టు గుర్తించారు. 'కొండను తవ్వి ఎలుకను పట్టిన' చందంగా ఈ దర్యాప్తును తూతూమంత్రంగా ముగించారు. మిగతా భూమి గురించి పేర్కొనలేదు. ఈ అసమగ్ర సమాచారాన్నే ప్రభుత్వానికి నివేదించి చేతులు దులుపుకున్నట్టు స్పష్టమవుతోంది. పూర్తి వివరాలు నమోదు చేయకపోవడం పట్ల భారీ ఎత్తున డబ్బులు చేతులు మారాయేమోనని ఆరోపణలు వ్యక్తమౌతున్నాయి.
భూబకాసురుల గుప్పిట్లో ఉన్న ఆ భూమిలో ప్రస్తుతం వారే పత్తి సాగు చేశారు. సమగ్ర దర్యాప్తు చేసి కబ్జాదారులపై కేసు నమోదు చేయాలని, భూములను ప్రజావసరాలకు ఉపయోగించాలనే డిమాండ్ వ్యక్తమౌతోంది.
పేదలు బతుకుతారనుకున్నాం : షేక్ అలీ, కరీంనగర్
మా తాత దగ్గర్నుంచి ప్రభుత్వం భూమి స్వాధీనం చేసుకుంది. పేదలకు ఉపయోగిస్తారని అనుకున్నాం. పడావుగా ఉండటంతో కొందరు కబ్జా చేసి అమ్ముకుంటున్నారు. వెంటనే వాళ్ల దగ్గర్నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అందులో నిరుపేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు కట్టించాలి. లేకపోతే తిరిగి మాకు అప్పగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.