Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త జిల్లాలకు కేంద్రం గెజిట్ అవసరం లేదు: అసెంబ్లీలోకేసీఆర్
- 30జిల్లా పరిషత్లను ఏర్పాటు చేస్తామని ప్రకటన
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
రాష్ట్రంలో పాలనాసౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన చేశామని, ఇది పెద్ద సాహసోపేత నిర్ణయమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాయని తెలిపారు. హైదరాబాద్కున్న ప్రాధాన్యత రీత్యా, సభ్యుల కోరిక మేరకు హైదరాబాద్ను విభజించలేదని చెప్పారు. విభజన ప్రక్రియ ఇప్పటితో ముగియలేదనీ, అవసరమైన చోట్ల జిల్లా, డివిజన్, మండలాలు, గ్రామాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. శాసనసభలో శుక్రవారం 'పరిపాలన సంస్కరణలు-నూతన పాలనా వ్యవస్థ' అనే అంశంపై లఘుచర్చ జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన పలు అంశాలపై సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు సగటున 36లక్షల జనాభా, 11వేల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంతో ఉండేవనీ, దేశంలో జిల్లాసగటు 19లక్షల జనాభా, 4,332 చదరపు కిలోమీటర్లేనని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో విభజన అనంతరం జిల్లా సగటు 11.29లక్షల జనాభా, 3,615 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్నదని తెలిపారు. ప్రస్తుతం 2లక్షల లోపు కుటుంబాలున్న జిల్లాలు 14, మూడు లక్షలలోపు ఉన్న జిల్లాలు పది, నాలుగు లక్షలలోపు కుటుంబాలున్న జిల్లాలు నాలుగున్నాయని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల్లో మాత్రమే ఐదు లక్షల లోపు కుటుంబాలున్నాయని వివరించారు. మొదటగా 24 జిల్లాలకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చామనీ, కానీ ప్రజల కోరిక మేరకు 31 జిల్లాలను ఏర్పాటు చేశామని చెప్పారు. విస్తృత సమాలోచన తర్వాతే 21 కొత్త జిల్లాలు, 25కొత్త రెవెన్యూ డివిజన్లు, 125 కొత్త మండలాలను ఏర్పాటు చేశామని తెలిపారు. భువనగిరి లాంటి ఎంపీస్థానం ఐదు జిల్లాల పరిధిలో విస్తరించి ఉందనీ, ఎమ్మెల్యే స్థానాలూ రెండు, మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయనీ చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలం ఎంపీ స్థానం కూడా ఐదు జిల్లాల పరిధిలో ఉండేదని గుర్తుచేశారు. ఇది కేవలం తెలంగాణకే పరిమితం కాదనీ, దాదాపు 16రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఉందని తెలిపారు. జిల్లాల్లో పాలనకు అవసరమైన సిబ్బంది నియామకాలు జరుగుతున్నాయని, క్యాడర్ రివిజన్ కోసం కేంద్రానికి లేఖరాశామన్నారు. జిల్లాల విభజనతో చాలా మందికి ప్రమోషన్లు వచ్చాయన్నారు. 2024 నాటికి ఐదులక్షల కోట్ల వరకు రాష్ట్ర బడ్జెట్ ఉండే అవకాశముందని తెలిపారు.
కేంద్రం గెజిట్ అనవసరం
జిల్లాల విభజన పూర్తిగా రాష్ట్రాల హక్కు అని, కేంద్రం కేవలం విభజన తర్వాత జిల్లాలను గుర్తిస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ' జిల్లాల విభజనకు కేంద్రం గెజిట్ అవసరం లేదనే విషయాన్ని కేంద్ర హోంశాఖ తేల్చిచెప్పింది. కేంద్రం గెజిట్ ఉంటేనే నిధులు వస్తాయని కాంగ్రెస్ సభ్యులు మాట్లాడటం సరికాదు..'' అని అన్నారు. కేంద్రం వెబ్సైట్లోనూ తెలంగాణలో 31 జిల్లాలున్నట్టు పేర్కొన్నారనీ, కొత్త జిల్లాల ప్రకారమే కేంద్రం నిధులు విడుదల చేస్తున్నదని తెలిపారు.
పది నెలల్లో కొత్త భవనాలు..
చత్తీస్ఘడ్, జార్ఘండ్ రాష్ట్రాల్లో ఇప్పటికీ కొత్త కలెక్టరేట్ భవనాలు లేవని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో అలాంటి పరిస్థితి రావొద్దని అధునాతన సౌకర్యాలతో కొత్త భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 26సమీకృత జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్లు, 13 సమీకృత జిల్లా పోలీస్ కాంప్లెక్స్లు, రెండు పోలీస్ కమిషనరేట్ల నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పూర్తి చేసినట్టు తెలిపారు. వీటి నిర్మాణాల కోసం రూ.1337కోట్ల వ్యయాన్ని ఖర్చు చేస్తున్నామన్నారు. పది నెలలలోపు పూర్తిస్థాయి క్రియాశీల కార్యాలయాలు రూపుదిద్దుకుంటాయని తెలిపారు.
ఎంపీ,ఎమ్మెల్యే స్థానాల విభజన కోసం పోరాటం
కేంద్ర ప్రభుత్వం వెంటనే లోక్సభ, శాసనసభా స్థానాలను పునర్ విభజించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎంపీస్థానాలు దేశంలో 33కోట్ల జనాభా ఉన్నప్పటిదని చెప్పారు. పునర్విభజన చేయాలని ఇప్పటికే కేంద్రానికి లేఖరాశామనీ, అయినా కేంద్రం పట్టించుకోవడం లేదని చెప్పారు. శీతాకాల సమావేశాల్లో ఈ అంశంపై పార్లమెంట్లో పోరాడుతామని చెప్పారు.
కొత్తగా ఐదువేల పంచాయతీలు..
రాష్ట్రంలో కొత్తగా ఐదువేల గ్రామపంచాయతీలను, కొత్తగా మరో 15నుంచి 20 వరకు మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. ఐదువందల జనాభా ఉన్న తండాలు, గూడాలనూ పంచాయతీలుగా మారుస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ మినహా మిగిలిన 30 జిల్లా పరిషత్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు వారి పరిధిలో ఎన్ని కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటు చేయాలనే దానిపై నిర్థిష్టంగా వివరాలను అందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చైర్మెన్లు ఉత్సవవిగ్రహాలుగా మారారనీ, అది బీజేపీ పుణ్యమేనని అన్నారు. జోన్ల సంఖ్య పెంచేందుకు డిప్యూటీసీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో ఉపసంఘం వేశామనీ తెలిపారు. అందరి అభిప్రాయం మేరకు జోన్ల విభజన జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో భూప్రక్షాళన కొనసాగుతున్నదని, ఇప్పటికే 50శాతం పూర్తయిందన్నారు. త్వరలోనే పంచాయతీరాజ్ చట్టం, మున్సిపల్ చట్టాలను తీసుకొస్తామని, దీనిలో పూర్తిస్థాయి విధివిధానాలను ప్రకటిస్తామని తెలిపారు.