Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ప్రారంభోత్సవంలో డీజీపీ
నవతెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయో గించడం ద్వారానే నేరాలకు అడ్డుకట్ట వేయగలమని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి అన్నారు. శనివారం బేగంపేట్లో నూతనంగా నిర్మించిన సెంటర్ఫర్ ఎక్స్లెన్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఫోరెన్సిక్ ల్యాబ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు విధి నిర్వహణలో టెక్నాలజీ ని వినియోగిస్తూ రాష్ట్ర పోలీసులే ముందు భాగంలో ఉన్నారని అన్నారు. నేర పరిశోధనలో ఫోరెన్సిక్ పరిశోధనాలయాల పాత్ర ఎంతో కీలకమైందని, ఈ ల్యాబ్లలో నిర్ధారిత అంశాలు నిందితుడిపై కోర్టులలో నేర నిరూపణకు కీలక ఆధారాలు అవుతున్నాయని మహేందర్రెడ్డి తెలిపారు. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ విభాగంలో ఫోరెన్సిక్ నిపుణులు మరింతగా పరిణితి చెందాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో హోంగార్డులు కలుపుకుని పోలీసు సిబ్బంది, అధికారుల సంఖ్య లక్ష వరకు ఉందని, పోలీసు విధినిర్వహణ సక్రమంగా సాగడానికి అవసరమైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నదని తెలిపారు. శాంతి భద్రత పరిరక్షణ, నేరాల నిరోధంలో ప్రభుత్వం పోలీసు శాఖపై ఉంచిన బాధ్యతను పోలీసులందరూ గుర్తెరిగి పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీసు టెక్నాలజీ అదనపు డీజీ రవిగుప్తా నగర ఇన్చార్జి కమిషనర్ వివి శ్రీనివాసరావు, పోలీసు కమ్యూనికేషన్ ఎస్పీ శ్రీనివాస్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.