Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వపథకాలకు తూట్లు..కోట్లు మింగేశారు
- అధికారుల కొరత అంటూ.. సర్కారు సైలెంట్ !
నవ తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన కొన్ని కుంభకోణాలపై దర్యాప్తు జరిపిన సీఐడీ విభాగం వాటిపై చార్జిషీట్లు వేయడంలో చేస్తున్న జాప్యం పలు అనుమానాలకు దారి తీస్తున్నది. ఒక్కటి కాదు రెండు మొత్తం నాలుగైదు కీలక కుంభకోణాలు ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లలో అక్రమాలు, ఎంసెట్ మెడికల్ పేపర్, సీఎం రిలీప్ఫండ్, ఆరోగ్యశ్రీ, వాణిజ్యపు పన్నుల శాఖలలో వెలుగు చూసిన కోట్ల రూపాయల చేతివాటాలపై సీఐడీ విభాగం దర్యాప్తులు సాగించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా గోల్మాల్ జరిగిందని, దానిపై సమగ్ర విచారణ జరిపిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించి సీఐడీకి అప్పగించారు. మొదట్లో అత్యంత వేగంగా ఈ స్కాం దర్యాప్తును సాగించిన సీఐడీ అధికారులు ప్రాథమిక దర్యాప్తులోనే దాదాపు ఏడు వందల మంది ఈ అక్రమాల్లో పాలు పంచుకున్నట్టు తేల్చింది. తర్వాత దర్యాప్తును ముందుకు సాగించిన సీఐడీ అధికారులు రాను రాను మెత్తబడి పోయారు. ఇక రాష్ట్రంలోనే గాక జాతీయ స్థాయిలో సంచనం రేపిన మరో కుంభకోణం ఎంసెట్ 2 పేపర్ లీక్ స్కాం. జేఎన్టీయూ నేతృత్వం వహించిన ఎంసెట్ మెడికల్ పేపర్ ప్రింటింగ్ జరిగిన ఢిల్లీలోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్లోనే ఈ స్కాంకు బీజం పడిందని దర్యాప్తు జరిపిన సీఐడీ నిర్ధారించింది. ఇందుకు బాధ్యులుగా బీహార్కు చెందిన ఎస్బీ సింగ్ను తేల్చిన సీఐడీ అరవై మంది వరకు మెడికల్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, బ్రోకర్లు, ప్రొఫెసర్లు, న్యాయవాదులు తదితరులను అరెస్టు చేసింది. దాదాపు రెండు వందల మంది వరకు విద్యార్థులు, వారి తల్లి దండ్రులకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నట్టుగా నిర్ధారణకు వచ్చింది. గత సంవత్సరం ఆగస్టులో మొదలైన ఈ కేసు దర్యాప్తు ఏడాది దాటాక కొలిక్కి వచ్చిందని తెలిపిన సీఐడీ విభాగం దానిపై ఇంకా చార్జిషీట్ వేయక పోవడం విస్మయాన్ని కలిగిస్తుంది. ఇక మూడో కుంభకోణం సీఆర్పీఎఫ్ కోట్ల రూపాయల వైద్య బిల్లుల చెల్లింపులది. దీనిపై ఉప్పందడంతో ఇందులో నిగ్గు తేల్చాని ప్రభుత్వం సీఐడీని ఆదేశించింది.దీంతో రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు ప్రత్యేక టీమ్లను రూపొందించి దర్యాప్తును సాగించారు. రాష్ట్రంలోని కార్పొరేట్ తో పాటు మిగతావి కలుపుకుని మొత్తం ఏడు వందల ఆస్పత్రులలో విచారణ జరిపారు. ఇందులో ముంబాయి, బెంగుళూరు, చెన్నై, ఏపీలకు చెందిన ఆస్పత్రులు కూడా ఉన్నాయి. చేయని ఆపరేషన్లను చేసినట్టుగా సృష్టించి లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ నిధులను సదరు ఆస్పత్రుల యాజమాన్యాలు కొల్లగొట్టినట్టుగా సీఐడీ విచారణలో తేల్చింది. ఇందుకు రోగులు కూడా ప్రలోభానికి గురై సహకరించినట్టు తేల్చింది. ఈ దర్యాప్తు సాగుతుండగానే ఆరోగ్యశ్రీ ద్వారా లభ్దిపొందిన రోగులు సైతం పత్రాలను తారుమారు చేసి వాటికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా డబ్బులు దండుకున్నట్టు వచ్చిన ఆరోపణలపైనా దర్యాప్తును సాగించారు. మొత్తం మీద దర్యాప్తును పూర్తి చేసినట్టుగా అధికార వర్గాలు లీక్లు కూడా ఇచ్చాయి. ఇందుకు బాధ్యులుగా యాజమాన్యాలను దిలి మధ్యలో అక్కౌంట్స్ విభాగాలలో పనిచేసే సిబ్బందిపైనే కేసులు నమోదు చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ స్కాంపైనా ఇంకా చార్జిషీట్ దాఖలు కాలేదని సమాచారం. ఇక వాణిజ్యపన్నుల శాఖ పన్ను వసూళ్లలోను కోట్ల రూపాయలు దారి మళ్లి కొందరు అధికారులు, ప్రయివేటు బ్రోకర్ల జేబుల్లోకి చేరిన వైనం కూడా రాష్ట్రంలో సంచలనం రేపింది. నిజామాబాద్ కమర్షియల్టాక్స్ రీజినల్ కార్యాలయంలో చోటు చేసుకున్న ఈ పన్నుల కుంభకోణం కేవలం ఈ జిల్లాకు మాత్రమే పరిమితం కాలేదు. మిగతా జిల్లాల్లోనూ చోటు చేసుకున్నట్టు సమాచారం ఉందని ఆ సమయంలో సీఐడీ చీఫ్ ప్రభుత్వానికి నివేదికను కూడా ఇచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర దర్యాప్తు జరిపి ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన కోట్లాది రూపాయల పన్ను కొందరు అధికారులు, ప్రయివేటు బ్రోకర్లు ఏ విధంగా దండుకున్నది బయటపెడతారని అందరు ఆశించారు. కాని ఈ స్కాం దర్యాప్తు నిజామాబాద్ పరిధిని దాటి వెళ్లలేదు. కొందరు ఉన్నతాధికారుల పాత్ర ఇందులో ఉందని దర్యాప్తు అధికారుల తేల్చినప్పటికి వారిపైనా చర్యలు చోటు చేసుకోలేదు. కొందరు అధికారులను, ప్రయివేటు బ్రోకర్ను మాత్రమే అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా ఈ కేసుపైనా ఇంకా చార్జిషీట్ ను సీఐడీ వేయలేదని తెలుస్తోంది. అయితే తమ వద్ద తగినంత మంది అధికారులు లేక పోవడం వల్లనే ఈ కేసులపై చార్జిషీట్లను వేయలేకపోయామని త్వరలోనే వేస్తామని సీఐడీ అధికార వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఒక విధంగా సీఐడీ విభాగం వీటిపై చార్జిషీట్లను వేసి, ట్రయల్ను త్వరితగతంగా నడిపించి నిందితులకు శిక్షలు పడేలా చేయాలని భావిస్తున్నప్పటికి ప్రభుత్వం నుంచి అందుకు తగిన సంకేతాలు అందక పోవడం వల్లనే జాప్యం జరుగుతున్నదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లలో చోటు చేసుకున్న కోట్లాది రూపాయల స్కాం నిగ్గు తేల్చకుండా అడ్డుకున్నది టీఆర్ఎస్కు చెందిన నాయకులే అనే వాదన ఉంది. కారణం ఇందులో అక్రమార్కులుగా తేలిన ఛోటా నాయకులలో చాలా మంది టీఆర్ఎస్ కండువాను కప్పుకోవడమేనని చెబుతున్నారు. ఏ కేసు దర్యాప్తు జరిగినా వెంటనే నిందితులను అరెస్టు చేసి వారిపై సకాలంలో కోర్టులలో చార్జిషీట్లను దాఖలు చేసి శిక్షలు పడేలా చేసినప్పుడే చేసే దర్యాప్తులకు సార్థకత ఏర్పడుతుంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీజీపీ మహేందర్రెడ్డి ఈ స్కాంల విషయంలో మునుముందు ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తారో వేచి చూడాలి.