Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంపై కృష్ణయ్య, సండ్ర విమర్శ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని కాలరాశారని తెలుగుదేశం ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. అధికార పార్టీ ప్రభుత్వ పథకాలను ఉచితంగా ప్రచారం చేసుకుందని ఎద్దేవా చేశారు. ప్రజాసమస్యలను గాలికొదిలేసి ఇష్టానుసారం సభ నిర్వహించారని విమర్శించారు. శనివారం అసెంబ్లీలోని మీడియాపాయింట్లో సంయుక్తంగా విలేకర్లతో మాట్లాడారు. ప్రజాస్వామ్య నిర్వచనం సీఎం కేసీఆర్కు, ఆయన మంత్రులకు తెలియదన్నారు. 50 రోజులని చెప్పి 16 రోజులే నిర్వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. తమకు అనుకూలంగా అసెంబ్లీ సమావేశాలను నడిపించారని వివరించారు. అధికార పక్షానికి ఎక్కువ సమయం కేటాయించడం సరికాదన్నారు. సభ్యులకు కనీస సమయం ఇవ్వాలని, పార్టీలకు సభ్యుల సంఖ్యను బట్టి కాకుండా ఓటింగ్ శాతాన్ని బట్టి సమయం కేటాయించాలని డిమాండ్ చేశారు.
కనీసం సమయం 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు ఇవ్వాలని సూచించారు. గతంలో జైపాల్రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, వెంకయ్యనాయుడు ప్రజాసమస్యలపై గంటలతరబడి చట్టసభల్లో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, అధికార పార్టీ ప్రతిపక్షంలోకి, ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి రావచ్చని అన్నారు. బీసీల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. 69 గంటల సమయంలో ప్రతిపక్షాలకు తగిన సమయం కేటాయించలేదన్నారు. గుర్తించిన సమస్యలను చర్చించడంలో ప్రభుత్వ విఫలమైందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సమస్యలపై చర్చించే అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు. ఫిరాయింపులను స్పీకర్ ప్రొత్సహిస్తున్నారని విమర్శించారు. హైకోర్టు తీర్పును సైతం స్పీకర్ గౌరవించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. డిసెంబరులో టీఆర్ఎస్లో చేరుతున్నానని సోషల్మీడియాలో వస్తున్న పుకార్లను సండ్ర వెంకట వీరయ్య ఖండించారు.