Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం ప్రకటించిన 99 శాతం పూర్తి ఎక్కడా?
- కోర్టు వివాదంలో వేలాది ఎకరాల భూములు
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులే అధికం
- పోడు, అసైన్డ్ భూములపై స్పష్టత కరువు
భూ రికార్డుల ప్రక్షాళనలో అనేక అంశాలపై స్పష్టత కొరవడటమేగాక అధికారులూ ఓ అంచనాకు రాలేకపోతున్నారు. దీంతో వేలాది ఎకరాల భూములను, అనేక భూ సమస్యలను పార్ట్-బీలో చేర్చి చేతులు దులుపుకుంటున్నారు. ఈ సమస్యలు పరిష్కారం అయితేనే సాగుపెట్టుబడి బాధితులకు అందుతుంది. ఈ భూములు మూడోవంతు నిరుపేద సన్నకారు, దళిత, గిరిజన రైతులకు చెందినవే కావడం గమనార్హం.
* జగిత్యాల నుంచి జక్కుల రవీందర్రావు
జగిత్యాల జిల్లా భూరికార్డుల ప్రక్షాళన 99 శాతం పూర్తయి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. జిల్లాలోని 295 రెవెన్యూ గ్రామాలకు 165 గ్రామాల్లో రికార్డుల ప్రక్షాళన సెప్టెంబర్ 15న మొదలు పెట్టారు. జిల్లాలో మొత్తం 2,50,954 సర్వే నెంబర్లకుగానూ 5,10,072 ఎకరాల భూమి ఉంది. అందులో మొత్తం 3,10,643 ఎకరాల రికార్డులను పరిశీలించారు. 1,53,165 ఎకరాల 6 గుంటల భూమి రికార్డులు సవ్యంగా ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. 62,911 ఎకరాల 11 గుంటలకు సంబంధించిన భూ రికార్డులను సరిచేశారు. ఇంకా జిల్లాలో లక్షా 57వేల 478 ఎకరాల 52 గుంటల భూమికి సంబంధించిన రికార్డులను సరిచేయాల్సి ఉంది. 2014లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా ఉన్నప్పుడు సాదాబైనామాలు, జమీన్బందీ కింద రైతులు దరఖాస్తు చేసుకుంటే సరిచేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ భూక్రమబద్ధీకరణ పథకం ప్రకటించారు. అప్పటి జగిత్యాల డివిజన్ నుంచి 67వేల మంది సాదాబైనామాకు దరఖాస్తులు చేసుకున్నారు. దాదాపు 46 వేలపైగా సాదాబైనామాలు, జమీన్ బందీ కింద దరఖాస్తులకు పరిష్కారం దొరికింది. కానీ, ప్రస్తుతం భూసమస్యలపై అధికారులకు స్పష్టత లేక వాయిదా వేశారు.
అసైన్డ్ భూముల సంగతేంది?
జిల్లాలో 40వేల156 ఎకరాల 4 గుంటల ప్రభుత్వ భూములు 37,750 మంది రైతుల చేతుల్లో ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. 14,967 మంది ఎస్సీలకు, 2,380 మంది ఎస్టీలకు, 18,380 మంది బీసీలకు, 377 మంది మైనార్టీలకు కేటాయించినట్టు రెవెన్యూ రికార్డుల్లో పొందుపర్చారు. క్షేత్రస్థాయిలో మాత్రం బినామీలుగా కొంతమంది, పట్టాలిచ్చి భూములు చూపని వారు కొంతమంది, భూములిచ్చి పాసుబుక్కులు ఇవ్వకుండా ఉన్న వారుకొంతమంది ఇలా గందరగోళంగా ఉంది. కొన్ని మండలాల్లో రికార్డుల ప్రకారం అక్కడ భూమే లేదు. జగిత్యాల మండలం బీబీరాజుపల్లి గ్రామంలో 80 మంది రైతులకు పట్టాలిచ్చి భూములు చూపలేదు. కానీ, 292 రెవెన్యూ గ్రామాలకు 187 గ్రామాల్లో రికార్డుల ప్రక్షాళన పూర్తయినట్టు చెబుతున్నారు. 51 గ్రామాల్లో సర్వే కొనసాగుతుండగా.. 1,99,094 సర్వే నెంబర్లను పరిశీలిం చి 1,94,317 సర్వే నెంబర్లలో సరిచేశారు. పార్టు-బీలో 4,777 సర్వే నెంబర్లను చేర్చినా ప్రభుత్వ, పోడు భూముల వివరాలు పూర్తిగా లేవు. దళితుల భూ పంపిణీ వివరాలనూ పార్ట్-బీలోనే చేర్చడంతో పెట్టుబడి అందకుండా పోనుంది.
అనేక అనుమానాలు..!
గతంలో భూస్వాముల నుంచి కొనుగోలు చేసిన రైతుల పేర ఇంకా పట్టాల్లేకపోవడంతో ఇప్పుడు పెత్తందార్లు తమవే అంటూ కోర్టుకెళ్తున్నారు. అసైన్డ్ భూముల్లోనూ గందరగో ళం నెలకొంది. ఇందుకు ఉదాహరణ.. జగిత్యాల మండలం బిబిరాజుపల్లిలో 80 ఎకరాల అసైన్డ్ భూములకు పట్టాలు పంపిణీ చేశారు. ఏటి కాల్వ ఆవల ఉండడం, వంతెన సౌకర్యం లేక బీడుగానే ఉన్నది. ఇదే గ్రామంలో సామూహిక అవసరాల కోసం భూస్వాముల భూముల్లో చెరువులు తవ్వారు. కానీ ఈ చెరువు శిఖం భూమి ఇప్పటికీ భూస్వాముల పేరునే రికార్డుల్లో ఉంది. గ్రామంలో చెరువున్నట్టు రెవెన్యూ రికార్డుల్లో లేకపోవడం గమనార్హం. ఇలా జిల్లాలో దాదాపు 100 చెరువుల శిఖం భూములకూ ఇదే సమస్య. వర్షాభావం మూలంగా ఇవి ఫుల్ట్యాంక్ లెవల్లో లేవు. వీటిపైనా రికార్డుల ప్రక్షాళనలో స్పష్టత లేదు. సారంగాపూర్, కొడిమ్యాల తదితర మండలాల్లో జంగల్ భూములను గిరిజనులకు ఏక్సాల్ పట్టా కింద పంపిణీ చేయగా, రైతుల జాబితా మాత్రం రికార్డుల్లో లేదు. వివరాలడిగితే పార్ట్-బీలో చేర్చి పరిష్కరిస్తామని అధికారులు దాటవేస్తున్నారు. జగిత్యాల రైతాంగ పోరాటం సందర్భంగా భూస్వాములు వేలాది ఎకరాలు వదిలేసి పట్టణాలకు వెళ్లిపోయారు. మద్దునూరు, లొత్తునూరు లాంటి వివిధ గ్రామాల్లో 20 ఏండ్లుగా ఆ భూములను రైతులు సాగు చేసుకుంటున్నారు. వారికి పట్టాల్లేవు. తిప్పన్నపేటలో మూడెకరాల భూమిని దళితుల శ్మశాన వాటికకు ఉపయోగించుకోవాలని 30 ఏండ్ల కిందట ఓ భూస్వామి ఇచ్చారు. కానీ అది ఆయన పేరుపైనే ఉన్నది. దీంతో అతని కొడుకు కోర్టుకెక్కడంతో రికార్డులను చూసి వారికే చెందుతుందని న్యాయస్థానం తీర్పిచ్చింది. ఇలా వందలాది ఎకరాల భూమి ఇప్పుడు భూరికార్డుల పరిశీల నతో తిరిగి భూస్వాములకే కట్టబెట్టే ప్రయత్నం జరుగు తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పైసలు, భూమి మునిగేటట్టుంది..: భూక్య రవి, రేచపల్లి, సారంగాపూర్
'అప్పట్లో పైసా పైసా కూడబెట్టుకుని ఎకరం, రెండెక రాల భూమి దొరల దగ్గర కొనుక్కున్నం. దొర తెల్లకాగితం గూడా ఇయ్యలే. ఇప్పుడు భూమి నాదేనని కోర్టుల పెట్టే. ఈ రికార్డుల పరిశీలన వల్ల మాకేం అర్కటి లేదు. కొనుక్కున్న భూమి దొరలకే పోయేటట్టుంది.'
భూస్వాములకే లాభం: సీఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్రెడ్డి
'చిన్న, సన్నకారు రైతుల భూములు ఇప్పటికీ భూస్వాముల గుప్పిట్లోనే ఉన్నాయి. వాటిని పరిష్కరిం చుకునే స్తోమత లేక ఏండ్ల తరబడి కబ్జాలో రైతులున్నా హక్కులు భూస్వాముల పేరుపై ఉన్నాయి. ప్రభుత్వం సాగు పెట్టుబడి ఇస్తామని ప్రకటించడంతో భూములు తమవేనం టూ భూస్వాములు కోర్టుకెక్కుతున్నారు. వాటిని పరిష్కరించే వీల్లేదంటూ ప్రభుత్వం వారిని పరోక్షంగా ఉసికోల్పుతోంది.'
పోడు, ప్రభుత్వ భూములపై ఫిజికల్ సర్వే చేయాలి: రాజేశం, జేసీ, జగిత్యాల జిల్లా
'అసైన్డ్, పోడు భూములు, సాదాబైనామా కింద దరఖాస్తు చేసుకోని వారి వివరాలను పార్ట్-బీలో చేర్చాం. పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజను లకు పెట్టుబడి అందడానికి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిం చాలి. అటవీ భూములకు సాగు పెట్టుబడి ఇవ్వరు. ప్రభుత్వ భూముల్లో బినామీల లెక్క తేల్చాకే పార్ట్-ఏలో పొందుపరుస్తాం'
భూస్వాములకు కట్టబెట్టడానికే ప్రక్షాళన: భూతం సారంగపాణి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
'రెవెన్యూ ఆధారాల్లేని నిరుపేదల భూములన్నీ తిరిగి భూస్వాములకు కట్టబెట్టేందుకే ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన ముందుకు తెచ్చింది. జిల్లాలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న వందలాది మంది గిరిజనులకు ఈ రికార్డుల ప్రక్షాళన మేలు ఒనగూర్చడం లేదు. దళిత, బీసీ, మైనార్టీ వర్గాలైన చిన్న, సన్నకారు రైతులు ఏక్సాల్ పట్టా, అసైన్డ్ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. వీటిపై సర్కారుకుగానీ, అధికారులకుగానీ స్పష్టత లేదు. భూస్వాములు మరో అడుగు ముందుకేసి ఆధారాల్లేకుండా ఉన్న భూములు తమవేనంటూ రైతులను కోర్టు మెట్లెక్కిస్తున్నారు. భూస్వాముల నుంచి చేజారిన భూములను కోర్టు ద్వారా స్వాధీనం చేసుకోమని ప్రభుత్వం పరోక్షంగా భూరికార్డుల ప్రక్షాళన చేపట్టింది.'