Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాము చెప్పిన రేటుకే కటింగ్ చేయాలని హుకుం
- గిట్టుబాటు కాదన్నందుకు నాయీబ్రాహ్మణుల బహిష్కరణ
- ఎవరైనా సహకరిస్తే భారీ జరిమానా అంటూఆదేశాలు
- అసిస్టెంట్ కమిషనర్కు ఫిర్యాదు
- చర్చల్లోనూ ఒప్పుకోని వీడీసీ ?
నవతెలంగాణ-నిజామాబాద్
నిజామాబాద్ జిల్లాలో వీడీసీ మరో ఆకృత్యం వెలుగుచూసింది. కూలీ చేసుకుని బతుకున్న నాయీబ్రాహ్మణులపై దౌర్జన్యానికి దిగింది. తాము చెప్పిన రేటుకే పనిచేసుకోవాలని, లేదంటే వేరే మంగళోల్లని పెట్టి చేయించుకుంటామని బెదిరింపులకు దిగింది. పాత ధరలు తమకు గిట్టుబాటు కావడం లేదని వేడుకున్నా కనికరించకుండా నాయీబ్రాహ్మణులను గ్రామం నుంచి బహిష్కరించింది.
నిజామాబాద్ జిల్లా మెండోర మండలం చాకిర్యాల్ గ్రామంలో 500 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇందులో రెండు కుటుంబాలు నాయీబ్రాహ్మణులవి. చెక్కతో చేసిన టేల (డబ్బా) ఏర్పాటు చేసుకుని 30 ఏండ్లుగా గ్రామంలో నాయీబ్రాహ్మణులు కటింగ్, గడ్డం చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే, సెప్టెంబర్లో ధరలు పెంచారు. గతంలో గడ్డం తీసినందుకు రూ.20, కటింగ్ చేసినందుకు రూ.30 తీసుకునేవారు. పెరుగుతున్న ధరలతో గిట్టుబాటుకావడం లేదని పాత ధరకు రూ.10 చొప్పున పెంచారు. గ్రామస్తులు కూడా చెల్లిస్తూ వచ్చారు. కానీ వీడీసీ సభ్యులు దీన్ని ఓర్వలేదు. టేలను నడిపే ఇద్దరు నాయీబ్రాహ్మణులను పిలిపించి పాత ధరలకే టేల నడపాలని ఆదేశించారు. పాత ధర గిట్టుబాటు కావడం లేదని, రూ.10 మాత్రమే పెంచామని, తమకు సహకరించాలని వారు వీడీసీ సభ్యులను వేడుకున్నారు. రెండు రోజుల తర్వాత వీడీసీ సభ్యులు నాయీబ్రాహ్మణులను మళ్లీ పిలించి ''చెప్పింది ఏం చేశారు. పాత రేటే అందరూ ఇస్తారు.. లేదంటే టేలను తీసేయండి.. వేరే మంగళివాళ్లను పిలించి ఇక్కడ పెడతాం' అని బెదిరించారు. పాత ధరలతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా ఉండటం వల్ల, ఏదైనా పని చేసుకుని బతుకుతామని నాయీబ్రాహ్మణులు టేలను తొలగించుకున్నారు. దీన్ని సహించని వీడీసీ సభ్యులు తమ మాటనే కాదన్నారని వారిపై కక్షగట్టారు. నాయీబ్రాహ్ముణుడు మహేందర్ ఇంటి వద్ద కిరాణ దుకాణం నడుపుతున్నాడు. 20రోజుల కిందట మహేందర్ భార్య ఓ వ్యక్తికి కూల్ డ్రింక్ ఎంఆర్పీ రూ.30 ఉండగా, రూ.33కు అమ్మింది. అంతే దీన్ని అదునుగా తీసుకున్న వీడీసీ సభ్యులు ఆ కుటుంబంపై రూ.8వేల జరిమానా విధించారు. అది పోలీసుల దృష్టికి వెళ్లడంతో మెండోరా ఎస్ఐ రాఘవేందర్ వీడీసీ సభ్యులు, నాయీబ్రాహ్మణులను పిలించి మాట్లాడారు. మళ్లీ టేల ఏర్పాటు చేసుకుని, పెంచిన రూ.70 కాకుండా రూ.60 తీసుకోవాలని వీడీసీ సూచించింది. దీనికి నాయీబ్రాహ్మణులు సైతం ఒపుకున్నారు. కానీ, టేల తీసేసే సమయంలో చెక్క పూర్తిగా విరిగిపోయిందని, తమరే ఏర్పాటు చేస్తే పనిచేస్తామని అన్నారు. కుదరదు.. టేల మీరే చేసుకోవాలంది. అంత ఆర్థిక స్తోమత తమకు లేదనడంతో నాయీబ్రాహ్మణులైన ఓడ్నాల చిన్న గంగాధర్, ఓడ్నాల మహేందర్ను గ్రామం నుంచి బహిష్కరింది. గ్రామంలో వారితో ఎవరూ మాట్లాడొద్దని, సాయం చేయొద్దని, వారి కిరాణా దుకాణంలో ఏమీ కొనొద్దని గత మంగళవారం చాటింపు వేయించారు. ఎవరైనా సాయం చేస్తే భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. తమపై కక్ష పెట్టుకోవద్దని, టేల ఏర్పాటు చేస్తే పనిచేస్తామని బాధితులు కోరినా పట్టించుకోవడం లేదు. దాంతో నాయీబ్రాహ్మణులు శుక్రవారం అసిస్టెంట్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. శనివారం బాల్కొండ ఎస్ఐ స్వామిగౌడ్, మెండోరా ఎస్ఐ రాఘవేందర్ వీడీసీ సభ్యులు, నాయీబ్రాహ్మణులతో చర్చలు జరిపారు. అయినప్పటికీ తాము నాయీబ్రాహ్మణులకు సహకరింబోమని తెలిపినట్టు సమాచారం.