Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరిగిపోతున్న కార్మికుల బతుకులు
- కష్టాలకడలిలో కుటుంబాలు
- నేడు చలో హైదరాబాద్
- పంచాయతీరాజ్ కమిషనర్ రాష్ట్ర కార్యాలయం ముట్టడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
''గ్రామ సీమల అభివృద్ధే దేశాభివృద్ధి' అన్నారు జాతిపిత మహాత్మాగాంధీ. కాగా ప్రస్తుతం పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. వాటి ఉనికికే ప్రమాదమేర్పడింది. కేంద్ర ప్రభుత్వమే పంచాయతీలను నిర్వీర్యం చేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు ఇటీవల పదే పదే చెబుతున్నారు. తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లోనూ మరోసారి సెలవిచ్చిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పోటీపడుతున్నాయి. రాజ్యాంగం ప్రకారం నిధులు విడుదల చేస్తూ నిబంధనల చట్రంలో కేంద్రం ఇరికిస్తే, వచ్చిన సొమ్మును సొంత ఖాతాకు మళ్లించుకునే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. తద్వారా రాష్ట్రంలో గ్రామపంచాయతీలు నిర్వీర్యమవుతున్నాయి. ప్రస్తుతం 30 జిల్లాల్లోని 8600కుపైగా పంచాయతీలు ఉన్నాయి. మరో 4000 నుంచి 5000 పంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేయనున్నామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు ప్రతిపాదనలు సిద్దమవుతున్నాయి. తండాలను సైతం పంచాయతీలుగా గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రతి పంచాయతీకి రూ. 10 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు నిధులు ఇస్తామని సర్కారు అంటున్నది. కాగా ప్రస్తుతం ఉన్న జీవోలు పంచాయతీలను కాపాడలేకపోతున్నాయి. వాటి కార్మికులకు అసలు భద్రతే లేకుండా పోతున్నది. కొత్త జీవోల కోసం కార్మికలోకం పోరాడుతున్నది. ఉద్యమాలు చేస్తున్నది. ప్రధానంగా పంచాయతీల్లో కార్మికుల పరిస్థితి దారుణంగా మారుతున్నది. కుటుంబాలు రోడ్డునపడ్డాయి. దాదాపు 40 వేల మంది కార్మికులు ఆయా రకాల విధుల్లో పనిచేస్తున్నారు. వీరికి కనీస వేతనాలు లేవు. జీవో 63ను సవరించినా ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు. గ్రామ పంచాయతీల ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. సాధారణ నిధి(జనరల్ ఫండ్) నుంచి 30 శాతం నిధులను కార్మికుల వేతనాల కోసం గతంలో వాడుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అది జీవో 63 ద్వారా 50 శాతానికి పెంచారు. ఆదాయం లేకపోవడంతో జీవో వచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. జీవో 11 ప్రకారం కనీస వేతనాలు అమలుచేయాలంటూ 2012లో ఆదేశాలు ఇచ్చారు.
అది అమలుకావడం లేదు. 2015లో 44 రోజులపాటు సమ్మె చేశారు. అప్పటి మంత్రి కేటీఆర్తోనూ చర్చలు జరిపారు. అయినా ఫలితాలు శూన్యం. రాష్ట్ర కనీస వేతనాల సలహామండలి ఇచ్చిన సూచనలను సైతం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నివేదికను ముఖ్యమంత్రి చెత్తబుట్టలో పడేశారు. అంతేగాక ఆయా ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన సొమ్మును విడుదల చేయడం లేదు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి రావాల్సిన ఫీజును, మైనింగ్ సీనరేజీని సైతం పంచాయతీలకు ఇవ్వడం లేదు. ఈమేరకు రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు సుమారు రూ.6500 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ చలో హైదరాబాద్కు పిలుపునిచ్చింది. గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ రాష్ట్ర కార్యాలయాన్ని వేలాది మంది గ్రామపంచాయతీ ఉద్యోగులు, కార్మికులతో ముట్టడించనుంది. కమిషనరేట్ ఎదుట చేసే ఆందోళనను విజయవంతం చేయాలని కార్మికులకు విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు పాలడుగు భాస్కర్, అధ్యక్షులు పి.గణపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీపతిరావు ఆదివారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.