Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమ్యూనిస్టు, ప్రజాతంత్ర పార్టీల ఏకాభిప్రాయం : సన్నాహక సమావేశంలో నేతల సుదీర్ఘ సమాలోచనలు
- టీఆర్ఎస్, కాంగ్రెస్తో సోషల్ జస్టిస్ అసాధ్యం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి ఎజెండాగా రాష్ట్రంలో కమ్యూనిస్టు, ఇతర భావసారూప్యతగల పార్టీలు, సామాజిక శక్తులు, సంఘాలు, సంస్థలు, వ్యక్తులు కలిసి ఒక రాజకీయ ఐక్య సంఘటన (పొలిటికల్ ఫ్రంట్)గా ఏర్పడాలని పలువురు రాజకీయ నాయకులు ఆకాంక్షిం చారు. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్తో ప్రజల జీవితాలకు భరోసానిచ్చే విధానాలూ, సోషల్ జస్టిస్ సాధ్యం కాదని వారు స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కొంత రాజకీయ శూన్యత ఉందని.. దాన్ని ఈ ఫ్రంట్ భర్తీ చేయాలని సూచించారు. ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఫ్రంట్ సన్నాహక సమావేశంలో వారు ఈ అంశాలన్నింటిపై ఏకాభిప్రాయానికొచ్చారు. అధికార టీఆర్ఎస్ అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలు, అప్రజాస్వామిక, నియంతృత్వ పోకడలు, ప్రతిపక్ష కాంగ్రెస్ వైఫల్యం, బీజేపీ మతోన్మాద చర్యలు తదితరాంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. త్వరలోనే జిల్లాలన్నింటిలో పర్యటించి.. ఆ తర్వాత ఫ్రంట్ను అధికారికంగా ప్రకటించాలనే సూత్రప్రాయ అంగీకారానికొచ్చారు.
ప్రొఫెసర్ కంచ ఐలయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఫ్రంట్ ఆవశ్యకతను, దాని అజెండాను వివరించారు. అధికార టీఆర్ఎస్తోపాటు గతంలో పరిపాలించిన కాంగ్రెస్ ప్రజలకు సామాజిక సహాయం మాత్రమే చేశాయని.. ఆయా పార్టీలతో సామాజిక న్యాయం సాధ్యం కాదని స్పష్టం చేశారు. తెలంగాణాలో అత్యధికంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీలకు సంబంధించిన రిజర్వేషన్లు, ప్రాతినిధ్యం, సామాజిక హోదా, వారికి గుర్తింపు అనే నాలుగు అంశాలనూ వీరెవరూ పట్టించుకోరనీ, ప్రపంచీకరణ విధానాలే తప్ప ప్రజల జీవితాలు వారికి పట్టవనే చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ విధానాల ప్రాతిపదికన ఫ్రంట్ను ఏర్పాటు చేయాలన్నది తమ సంకల్పమని చెప్పారు. ఈ ప్రతిపాదనలను ఆయన సమావేశం ముందుంచారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈర్ల నర్సింహా, ఆరెస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు, నల్లా సూర్యప్రకాశరావు (బీఆర్పీ), జస్టిస్ (రిటైర్డ్) చంద్రకుమార్, ప్రజా గాయకుడు గద్దర్, మాస్టార్జీ (రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా), పీఎల్ విశ్వేశ్వరరావు (ఆప్), వెంకట్రాములు (బహుజన ముక్తి పార్టీ), షాహాజ్ (మజ్రూమ్ వికాస్ పార్టీ), గంగాధరరావు (లోక్సత్తా), మజీబుల్లాఖాన్ (ఎమ్బీటీ), నారగోని (రాజ్యాధికార పార్టీ), సుభాష్ (ప్రజా స్వరాజ్ పార్టీ), మహ్మద్ రఫీ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా), పర్వతాలు (బహుజన కమ్యూనిస్టు పార్టీ), చంద్రన్న (న్యూ ఇండియా), మన్నారం నాగరాజు (తెలంగాణ లోక్సత్తా), శ్రీరాములు శ్రీనివాస్ (మహాజన సమాజం)తోపాటు సామాజిక వేత్తలు జేబీ రాజు, ఉ.సాంబశివరావు, సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.రాములు, టీ మాస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ జాన్వెస్లీ తదితరులు పాల్గొన్నారు.
బీఎస్పీతో సీపీఐ (ఎం) నేతల భేటీ...
ఫ్రంట్ ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్ర బీఎస్పీ నాయకులు.. సీపీఐ (ఎం) నేతలతో భేటీ అయినట్టు తెలిసింది. ఈ సమా వేశంలో యూపీకి చెందిన బీఎస్పీ ఎంపీ కూడా పాల్గొన్నట్టు సమాచారం. ఎన్నికలకు ముందు పొత్తులు, కూటముల ఏర్పాటనేది తమ పార్టీ విధానం కాదనీ.. అయి తే ఈ విధానాన్ని ఇప్పుడు మార్చుకున్నామని సదరు ఎంపీ సీపీఐ (ఎం) నేతలకు తెలిపారు. ఈ క్రమంలో ఫ్రంట్లో భాగస్వామిగా ఉండేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన చెప్పినట్టు సమాచారం. అయితే ఈ అంశంపై తమ పార్టీ అధినేత్రి మాయావతితో.. సీపీఐ (ఎం) జాతీయ నాయకత్వం చర్చలు జరిపితే బావుం టుందని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి.. త్వరలోనే మాయా వతితో సమావేశమయ్యే అవకాశాలున్నాయని సమాచారం.
కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా పోరు : ఈర్ల నర్సింహా (సీపీఐ)
''అవినీతి కాంగ్రెస్కు, మతోన్మాద బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలన్నదే మా పార్టీ విధానం. సీపీఐ (ఎం) ఆధ్వర్యాన సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం పాదయాత్ర నిర్వహించారు. ఇప్పుడు ఇదే నినాదంతో మా పార్టీ కూడా బస్సుయాత్రను నిర్వహిస్తున్నది. ఇది ముగిసిన తర్వాత ఫ్రంట్పై మా పార్టీలో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటాం...''
మేం సిద్ధం : జానకిరాములు (ఆరెస్పీ)
''ఫ్రంట్లో చేరటానికి మేం సిద్ధంగా ఉన్నాం. బెంగాల్, కేరళ, త్రిపురలో మాదిరిగా ఇప్పుడు తెలంగాణలో వామపక్షాల ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయానికి రంగం సిద్ధమవుతున్నది. ఇది మంచి పరిణామం, భవిష్యత్కు పునాది...''
మన మీద పెద్ద బాధ్యత : ప్రొఫెసర్ కంచ ఐలయ్య
'ఫ్రంట్ ఏర్పాటనేది తెలంగాణకు కీలకం. ఈ క్రమంలో ఇప్పుడు మన మీద పెద్ద బాధ్యత ఉంది. దేశంలో ఉన్న వామపక్ష ప్రభుత్వాలకు ఒక విశిష్టత, ప్రజల్లో విశ్వాసం ఉన్నాయి. అవినీతి రహిత పాలన, మైనారిటీలకు రక్షణ, మతోన్మాదానికి వ్యతిరేకంగా నిరంతరంగా పోరాడటం, పేదల హక్కుల్ని కాపాడటం ద్వారా అవి ఎంతో నమ్మకాన్ని కూడగట్టుకున్నాయి. ఈ క్రమంలో వామపక్షాలతో కూడిన బహుజన ప్రత్యామ్నాయం తెలంగాణలో ఒక కొత్త ప్రయోగం...''
పోరాటాలు ప్రారంభించాలి: జస్టిస్ (రిటైర్డ్) చంద్రకుమార్
''ఏర్పడబోయే ఫ్రంట్ రాష్ట్రస్థాయితోపాటు జిల్లాల్లో స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించాలి. వాటిపై నికరంగా పోరాడటం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందగలగాలి. ముఖ్యంగా ఇన్నాళ్లూ అణచివేతకు గురైన వర్గాలు తలెత్తుకునే విధంగా కార్యాచరణను రూపొందించాలి...''
రాజ్యాంగాన్ని రక్షిద్దాం... : మజీబుల్లా ఖాన్ (ఎంబీటీ)
''రాజ్యాంగాన్ని తిరగరాసేందుకు, తద్వారా లౌకికవాదానికి తిలోదకాలిచ్చేందుకు బీజేపీ శరవేగంగా కుట్రలు పన్నుతున్నది. అందువల్ల ఫ్రంట్ తరపున రాజ్యాంగ రక్షణ కోసం విస్తృత పోరాటాలు నిర్వహించాలి. లేకపోతే సామాజిక న్యాయం సాధ్యం కానేకాదు...''
రాజకీయ మార్పు అవసరం : నారగోని (రాజ్యాధికార పార్టీ)
''తెలంగాణలో రాజకీయ మార్పు అవసరం, అనివార్యం. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయనే ఆశ ప్రజల్లో ఏ విధంగానైతే చిగురించిందో.. అలాంటి ఆశల్నే మనం ఇప్పుడు చిగురింపజేయాలి. ఫ్రంట్కు మద్దతునిస్తే మన బతుకులు బాగుపడతాయనే భరోసాను ప్రజలకివ్వాలి...''
గ్రామ సర్పంచూ కీలకమే...: గద్దర్
''ఫ్రంట్ ఏర్పడిన తర్వాత కేవలం అసెంబ్లీ నియోజ కవర్గాల మీదే కాదు.. క్షేత్రస్థాయిలోని పంచాయతీ సర్పంచ్ నుంచి మొదలుపెట్టి వార్డు మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలపై కూడా కసరత్తు చేయాలి. మార్పు అనేది పై స్థాయితోపాటు కిందిస్థాయిలో కూడా జరగాలి...''
మీ వెంటే మేం..: తమ్మినేని
''ఈ ఫ్రంట్కు సీపీఎమ్మే నాయకత్వం వహిస్తుందా? అంటూ చాలా మంది అనుమా నాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఫ్రంట్కు మా పార్టీ నాయకత్వం వహించబోదు. మిగతా శక్తులన్నీ ముందుంటే మేం వారి వెనకుంటాం. ఫ్రంట్ ఏర్పడిన తర్వాత గ్రామస్థా యిలోని ఆర్ఎమ్పీ నుంచి మేధావుల దాకా అందర్నీ కలుపుకుని పోతాం. ఎన్నికల తర్వాత కూడా ఇది కొనసాగుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రజానుకూల విధానాలు, సామాజిక న్యాయం సాధించేంత వరకూ వదలిపెట్టకుండా పనిచేస్తుంది...''
పూర్తి మద్దతు : మన్నారం నాగరాజు (తెలంగాణ లోక్సత్తా)
''మేం ఈ ఫ్రంట్కు పూర్తి మద్దతునిస్తున్నాం. టీ జేఏసీ కూడా ఇందులోకి రావాలని కోరుతున్నాం. 2,800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే టీఆర్ఎస్ సర్కారుకు పట్టటం లేదు.