Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కావడిలోనే గిరిజనుడు మృతి
నవతెలంగాణ-మంగపేట
ఊరికి రోడ్డుసౌకర్యం లేకపోవడంతో సకాలంలో వైద్యం అందక ఓ గొత్తికోయ గిరిజనుడు చనిపోయాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం రేగులగూడెంలో ఆదివారం జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..మడకం జోగయ్య(40) జోగయ్య వారం నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. ఆదివారం జోగయ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆయన ఇద్దరు కుమారులు గూడెంకు చెందిన మరో ఇద్దరి సహాయంతో రోడ్డు మార్గం సరిగా లేని అడవిలో నుంచి మంచాన్ని కావడిలా కట్టుకుని మూడు కిలోమీటర్ల దూరంలోని కమలాపురానికి బయలుదేరారు. ఆస్పత్రికి చేరక ముందే పరిస్థితి విషమించి జోగయ్య మార్గ మధ్యలోనే మృతి చెందాడు. దీంతో గూడెం వాసులు కన్నీటి పర్యంతమయ్యారు. 15 ఏండ్లుగా కమలాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో తాము నివాసముంటున్నా ప్రభుత్వం తమకు సరైన రోడ్డు, విద్య, వైద్యం, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించలేదని గూడెం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఓట్లు వేయించుకుంటున్న నాయకులు తమను పట్టించుకోకపోవడంతోనే ఈ దుస్థితి వచ్చిందని గూడెం వాసులు వాపోయారు.