Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నీటి కేేటాయింపులపై వీడని చిక్కుముడి
- 70 టీఎంసీలతో 12 లక్షల ఎకరాల సాగు సాధ్యమా
- రంగారెడ్డి జిల్లాలో పనులపై నీలినీడలు
- అధికార పార్టీ నేతల్లోనూ అంతర్మథనం
- ముఖ్యమంత్రికి లేఖ రాసినా పట్టించుకోని వైనం
* కొండూరి రమేశ్బాబు
న్యాయమైన నీటి వాటాకోసం పాలమూరు రైతులు మళ్లీ ఉద్యమబాట పట్టనున్నారు. నీటి కేటాయింపుల్లోనూ, ప్రాజెక్టుల నిర్మాణంలోనూ ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన ఈ ప్రాంత వాసులు స్వరాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా తమ భూములకు నీరందుతుందని ఆశించిన రైతులు ప్రస్తుత నీటి కేటాయింపులపై పెదవి విరుస్తున్నారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఉమ్మడి రాష్ట్రంలోనే 2013లో అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని తీసుకోవటం ద్వారా 35 రోజుల్లో 70 టీఎంసీలు వినియోగించుకుని మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని మెట్టప్రాంతాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరందించటానికి నిర్ణయించిన ప్రభుత్వం జీఓ ఎమ్ఎస్ నంబర్ 72 జారీ చేసింది. తెలంగాఱ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రీడిజైన్ పేరుతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం స్వరూపాన్ని పూర్తిగా మార్చి వేసింది. జూరాల నుంచి కాకుండా శ్రీశైలం ప్రాజెక్టు ఫోర్షోర్ నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని తీసుకోవటం ద్వారా 60 రోజుల్లో 120 టీఎంసీల నీటిని తీసుకోవటానికి టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2015 జూన్ 10న జీఓ ఎమ్ఎస్ నంబర్ 105 జారీ చేసింది. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని ప్రకటించింది. నీటి పంపింగ్ ప్రదేశాన్ని జూరాల నుంచి శ్రీశైలం వద్దకు మార్చినప్పుడే పాలమూరు జిల్లా వాసులు నిరసన వ్యక్తం చేశారు. జూరాలలో పూర్తిగా నీటి లభ్యత ఉన్నందువల్ల అక్కడి నుంచి జిల్లాలోని కొంత భాగానికి నీరు తీసుకుని మిగతా ప్రాంతానికి కల్వకుర్తి ద్వారా నీరందించాలని జిల్లా వాసులు డిమాండ్ చేశారు. దీనిని ప్రభుత్వం పట్టించుకోలేదు. శ్రీశైలం నుంచి తీసుకునే నీటి ద్వారా పాలమూరు జిల్లాలో 7 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 2.70 లక్షలు, నల్లగొండ జిల్లాలో 30 వేల ఎకరాలకు సాగునీరందిస్తామని, మరో 20 టీఎంసీల నీటిని హైదరాబాద్ తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తామని ప్రకటించింది.
పాలమూరుతో డిండికి ముడిపెట్టడంతోనే వివాదం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ముడిపెట్టకుండా శ్రీశైలం నుంచే 0.5 టీఎంసీ నీటిని డిండికి తీసుకుంటామని, ఈ నీటితో నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతానికి తాగునీరు సాగునీరందిస్తామని ప్రభుత్వం ముందుగా ప్రకటించింది. దీనికోసం 2015 జూన్ 6 న జీఓ ఎంఎస్ నంబర్ 107ను కూడా జారీ చేసింది. దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండకుండా ప్రభుత్వం గత సంవత్సరం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. డిండి ఎత్తిపోతల పథకానికి నేరుగా శ్రీశైలం నుంచి కాకుండా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేటాయించిన నీటి నుంచే 0.5 టీఎంసీ వాటా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం 2016 సెప్టెంబర్ 24 న 806 జీఓను జారీ చేసింది. సవరించిన నీటి వాటా ప్రకారం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 60 రోజుల్లో తీసుకునే 120 టీఎంసీల్లో 30 టీఎంసీలు డిండికి నార్లాపూర్ నుంచి తరలిస్తారు. మిగిలిన 90 టీఎంసీల్లో 20 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తారు. ఇక మిగిలిన 70 టీఎంసీల నీరు మాత్రమే ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు వినియోగించాలని నిర్ణయించారు. ఒకవైపు నీటి వాటాను తగ్గించిన ప్రభుత్వం మరో వైపు ఆయకట్టును పెంచటం మరొక సంశయానికి దారి తీసింది. మొదట నిర్ణయించిన విధంగా కాకుండా రంగారెడ్డి జిల్లాలో 2.70 లక్షల ఎకరాలకు కాకుండా మొత్తం ఐదు లక్షల ఎకరాలకు నీరందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వికారాబాద్ ప్రాంతంలో అదనపు ఆయకట్టు కోసం ఇప్పుడు సర్వే చేస్తున్నది. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా 12 లక్షల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. ఒక టీఎంసీ నీటిని 10 వేల ఎకరాలకు వినియోగిం చుకునే విధానం ప్రస్తుతం అమల్లో ఉండగా తాజా ప్రతిపాదన ప్రకారం 120 టీఎంసీల నీరు 12 లక్షల ఎకరాలకు కావాల్సి ఉంది. డిండి, హైదరాబాద్ తాగునీటికి కేటాయింపులు పోనూ ఇక మిగిలిన 70 టీఎంసీలతో 12 లక్షల ఎకరాలకు ఏవిధంగా నీరందిస్తారని రెండు జిల్లాల రైతులు ప్రశ్నిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలోనూ ఇదే పరిస్థితి...
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీటి కేటాయింపుల వ్యవహారం రంగారెడ్డి జిల్లాలోనూ చిచ్చు పెట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 18 ప్యాకేజీల కోసం టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా రంగారెడ్డి జిల్లాలోని అతి పెద్ద రిజర్వాయర్గా భావిస్తున్న కేసీ లక్ష్మీదేవిపల్లి వద్ద పనులు ప్రారంభం కాక పోవటంతో జిల్లా వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల ప్రాంతంలో ఆయకట్టుకు ప్రాణహిత చేవెళ్ల పథకం ద్వారా నీరందించాలని గత ప్రభుత్వం నిర్ణయించగా టీఆర్ఎస్ ప్రభుత్వం దీనిని ప్రాణహిత నుంచి తప్పించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని తాజాగా ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ఇప్పటికీ సర్వే కూడా పూర్తి కాలేదు. ఒకవైపు కేటాయించిన నీరు చాలదని జిల్లా వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాకు నీరు ఎలా అందిస్తారో ప్రభుత్వమే చెప్పాలని జిల్లాకు చెందిన ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.
పాలమూరు ఎత్తిపోతల పథకంలో మలుపులు, మైలురాళ్లు
- 8.8.2013 - పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం సమగ్ర సర్వే, డీపీఆర్ తయారీ కోసం జీఓ నంబర్ 72 జారీ చేసిన ప్రభుత్వం.
- 10.6.2015 - 60 రోజుల్లో 90 టీఎంసీల వరద నీటిని తరలించటం ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించుకునేందుకు జీఓ 105 జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.
- 11.6.2015 - శ్రీశైలం ఫోర్షోర్ నుంచి రోజుకు 0.5 టీఎంసీ, 60 రోజుల్లో 30 టీఎంసీలు డిండి పథకానికి మళ్లించేందుకు జీఓ జారీ.
- 22.2.2016 - పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం రోజుకు 3 టీఎంసీల నీరు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరుతూ మహబూబ్నగర్ జిల్లా ప్రజాప్రతినిధుల లేఖ.
- 31.3.2016 - పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం రోజుకు 2 టీఎంసీల నీరు తీసుకోవటం ద్వారా 12 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన.
- 24.9.2016 - నార్లాపూర్ నుంచి డిండి ఎత్తిపోతలకు నీరు తరలించటానికి సర్వే కోసం ఉత్తర్వుల జారీ.
టీఆర్ఎస్లో అంతర్మథనం..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా డిండికి కానీ మరే ఇతర ప్రాజెక్టుకు కానీ నీరు తరలించవద్దని టీఆర్ఎస్ నేతలు సీఎం వద్ద మొరపెట్టుకున్నారు. హైదరాబాద్ తాగునీటికి కూడా అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నందువల్ల పాలమూరు పథకం నుంచి మినహాయించాలని కోరారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా ప్రతిపాదించిన 7 లక్షల ఎకరాలకే కాకుండా అదనంగా మరో తొమ్మిది లక్షల ఎకరాలకు సాగునీరందించాలని కోరారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు 2016 ఫిబ్రవరి 22న సీఎంకు లేఖ కూడా రాశారు. మహబూబ్నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ చైర్మెన్ ఈ లేఖపై సంతకా లు చేశారు. ఈ లేఖ తర్వాత కూడా సీఎం తన నిర్ణయం మార్చుకోలేదు. ఫలితంగా అధికార పార్టీలోనే అంతర్మథనం జరుగుతున్నది. పాలమూరు నీటి కేటాయింపుల వ్యవహారం అధికార పార్టీ నేతల కంటికి కునుకు రాకుం డా చేస్తున్నది. వచ్చే ఎన్నికల్లో నీటి అంశమే ప్రధాన ఎజెండా కానున్నది. పాలమూరు జిల్లాలో పూర్తిస్థాయి అయకట్టుకు నీరందించేందుకు ప్రణాళిక రూపొందించాలని ప్రజాసంఘాలు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు.