Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలో హరీశ్రావు మకాం
- కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీతోనూ భేటీ
- అటవీ స్టేజ్-2, పర్యావరణ అనుమతులకు వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
కాళేశ్వరం ప్రాజెక్టు చట్టబద్ధ అనుమతులపై కేంద్ర పెద్దలతో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు మంతనాలు ప్రారంభించారు. రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన ఆయన... కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గడ్కరీతోనూ, ఆ శాఖలోని వివిధ విభాగాల అధికారులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు.కాగా ఈ సారి హస్తిన టూర్లో ఉన్న మంత్రి హరీశ్ మీడియాకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు పనులను నిలిపేస్తూ ఎన్జీటీ మధ్యంతర తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన పర్యావరణ, అటవీ స్టేజ్-2 అనుమతులు వీలైనంత త్వరగా మంజూరు చేయాలని కోరారు. సాధారణంగా హరీశ్రావు ఎప్పుడు ఢిల్లీ వచ్చిన ఒక్క రోజులోనే హైదరాబాద్ తిరుగుపయనమవుతారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల కోసం మంగళవారమే ఢిల్లీకి చేరుకున్నారు. మొదటి రోజు కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కేంద్ర జలవనరుల శాఖ మాజీ మంత్రి ఉమాభారతిని కూడా కలవాలని యత్నించినప్పటికీ అపాయింట్మెంట్ కుదరలేదు. బుధవారం పార్టీ ఎంపీలతో కలిసి గడ్కరీని ఆయన కార్యాలయంలో కలిశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అటవీశాఖ స్టేజ్-1 అనుమతులు మంజూరయ్యాయి. అయితే స్టేజ్-2 అనుమతులు మంజూరయ్యే వరకు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడానికి వీలుండదు. ఈ నేపథ్యంలో అటవీశాఖ స్టేజ్-2తో పాటు పర్యావరణ అనుమతులను కూడా మంజూరు చేయడంలో సహకరించాలని గడ్కరీకి హరీశ్రావు కోరారు. ముఖ్యంగా అటవీశాఖ, పర్యావరణ శాఖలను సమన్వయ పరిచి వీలైనంత త్వరగా అనుమతులు మంజూరయ్యేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి సుజనా చౌదరితోనూ హరీశ్రావు భేటీ అయ్యారు.
- కాళేశ్వరానికి మరో రెండు అనుమతులు..
- కేంద్ర భూగర్భ జలశాఖ, నిర్మాణ యంత్రాల డైరెక్టరేట్ గ్రీన్ సిగల్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో రెండు అనుమతులు లభించాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ విభాగాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం సమాచారం అందింది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర భూగర్భ జల శాఖ, నిర్మాణ యంత్రాల కన్సల్టెన్సీ డైరెక్టరేట్ల నుంచి అనుమతులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అతి కీలకమైన నీటి లభ్యత, అంతరాష్ట్ర అనుమతి, మొదటి దశ అటవీ అనుమతులు లభించాయి. త్వరలోనే మరికొన్ని కీలక అనుమతులు లభించనున్నాయని కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ హరీరాం తెలిపారు. వివిధ శాఖలకు చెందిన 16 డైరెక్టరేట్ల నుంచి అనుమతులు లభించాల్సి ఉంది.