Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి జోగు రామన్నకు చేదు అనుభవం
- తెలంగాణ భవన్లో అధికారుల అలసత్వం
- ప్రోటోకాల్ పట్టించుకోని వైనం
- అధికారుల తీరుపై సీఎస్కు, ఆర్సీకి మంత్రి లేఖ
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
ఢిల్లీలోని తెలంగాణ భవన్లో అధికారుల అలసత్వం మంత్రులను, రాష్ట్ర అధికారులను ఇక్కట్ల పాల్జేస్తోంది. రాష్ట్ర అంశాలపై కేంద్రానికి విన్నవించేందుకు వచ్చే మంత్రులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్రోటోకాల్ విభాగంలోని అధికారుల అలసత్వం వల్ల రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న ఇటీవల తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ఢిల్లీకి వచ్చిన మంత్రి జోగురామన్నకు భోజన సదుపాయం చూసే వారు కూడా కరువయ్యారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ప్రధాన కార్యదర్శికి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్కు లేఖ రాశారు. అయితే అధికారులు మాత్రం ఢిల్లీలో కాంట్రాక్టు విధానంలో పని చేసే స్థానిక రూమ్బారులను బలి చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే.. ఈ నెల 15వ తేదీన మంత్రి జోగురామన్న ఢిల్లీకి వచ్చారు. రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఢిల్లీ తెలంగాణ భవన్కు వచ్చిన మంత్రిని ఎవరూ పట్టించుకోలేదు. కారులోంచి ఆయన సామానును సైతం గదిలో పెట్టేవారు లేనిపరిస్థితి. పైగా భోజన వసతి కూడా కల్పించలేదు. భవన్లోని క్యాంటిన్ సిబ్బందికి సైతం మంత్రి వస్తున్న సమాచారం ఇవ్వలేదని తెలిసింది. మంత్రి పరిస్థితి చూసి 11.30 నిమిషాలకు క్యాంటీన్కు చెందిన ఏపీ సిబ్బంది భోజనం సమకూర్చారు. గతంలోనూ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రాంచందర్రావుకూ ఇదే పరిస్థితి తలెత్తింది. సుప్రీంకోర్టులో ఓ కేసు నిమిత్తం ఢిల్లీకి వచ్చిన ఏడీజీకి వాహనం సైతం సమకూర్చలేని దుస్థితి. దీంతో ఆయన సుప్రీంకోర్టులో కేసుకు సకాలంలో హాజరుకాలేకపోయారు. కాగా మంత్రి వ్యవహారంపై తెలంగాణ భవన్ అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహన్ను ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదన్నారు. సమయానికి రూమ్బారు లేకపోవడంతోనే మంత్రి కొంత ఇబ్బంది పడ్డారని చెప్పారు. అయితే ఈ విషయంపై మంత్రికి క్షమాపణ చెప్పినట్టు తెలిపారు. కాగా సీఎస్కు, రెసిడెంట్ కమిషనర్కు లేఖ రాసినట్టు తనకు సమాచారం లేదని అన్నారు.