Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతేడాది నుంచే అన్ని వర్సిటీల్లో సీబీసీఎస్ అమలు
- ఓయూ, పీయూ, ఎస్యూలో డిటెన్షన్
- కేయూ, టీయూ, ఎంజీయూలో అమలుకు నో
- అయోమయంలో విద్యార్థులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో డిగ్రీ విద్యలో రెండేండ్లయినా డిటెన్షన్ విధానం అమలుపై ఇంకా స్పష్టత రాలేదు. రాష్ట్రంలోని డిగ్రీ విద్యనందించే ఆరు విశ్వవిద్యాలయాలు తలోదారి పాటిస్తున్నాయి. ఉస్మానియా, పాలమూరు, శాతవాహన విశ్వవిద్యాలయాల్లో డిటెన్షన్ విధానమ అమల్లో ఉంది. కానీ కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల్లో డిటెన్షన్ విధానం అమలు కావడం లేదు. అన్ని విశ్వవిద్యాలయాల్లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) 2016-17 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. కానీ డిటెన్షన్ విధానం అమలుపై మాత్రం ఏకాభిప్రాయం లేదు. ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. సీబీసీఎస్ అమల్లోకి వచ్చి ఏడాది గడిచినా ఈ విద్యాసంవత్సరంలోనైనా అన్ని విశ్వవిద్యాలయాలదీ ఒకే విధానం ఉంటుందా?అంటే అదీ అనుమానమే. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో హడావుడిగా సీబీసీఎస్ అమల్లోకి వచ్చింది. నిధుల కోసమే ఈ విధానం అమలవుతోంది తప్ప విద్యార్థుల ప్రయోజనాలేమీ పాలకులకు, అధికారులకు పట్టడం లేదన్న విమర్శ ఉంది. కొన్ని విశ్వవిద్యాలయాల్లో డిటెన్షన్ లేకపోవడంతో వాటిలో చదివే విద్యార్థులందరూ పరీక్షలకు హాజరైతే చాలు ఉత్తీర్ణులైనా, కాకపోయినా పై తరగతులకు వెళ్తున్నారు. కానీ డిటెన్షన్ విధానం అమల్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఆ విద్యాసంవత్సరంలో ఉన్న సబ్జెక్టుల్లో 50 శాతం ఉత్తీర్ణులైతేనే పై తరగతులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో డిటెన్షన్ విధానం అమల్లో ఉన్న విశ్వవిద్యాలయాల పరిధిలోని విద్యార్థులు నష్టపోవాల్సి వస్తున్నది. రాష్ట్రంలో ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియ, సీబీసీఎస్ కూడా గత విద్యాసంవత్సరమే అమల్లోకి వచ్చాయి. వీటిని పర్యవేక్షించి అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నత విద్యామండలిపైనే ఉంది. అయినా కొన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో డిటెన్షన్ అమలు చేయడం, మరికొన్ని వర్సిటీల పరిధిలో అమలు చేయకపోవడం గందరగోళానికి దారితీస్తున్నది. ఈ విధానం వల్ల కొందరు విద్యార్థులకు లాభం, మరికొందరికి నష్టం కలిగిస్తున్నది.
నష్టపోతున్న గ్రామీణ విద్యార్థులు
రాష్ట్రంలో డిగ్రీ మొదటి సెమిస్టర్లో బీఏ, బీఎస్సీ విద్యార్థులకు 27 క్రెడిట్స్, బీకాం విద్యార్థులకు 30 క్రెడిట్స్ ఉంటాయి. ఎన్ని క్రెడిట్స్ వచ్చినా రెండో సెమిస్టర్కు ప్రమోట్ అవుతారు. రెండో సెమిస్టర్కూ బీఏ, బీఎస్సీ విద్యార్థులకు 27 క్రెడిట్స్ ఉంటాయి. రెండు సెమిస్టర్లకు కలిపి 54 క్రెడిట్స్లో 27 క్రెడిట్స్ అంటే 50 శాతం సాధిస్తేనే డిగ్రీ ద్వితీయ సంవత్సరంలొకి ప్రమోట్ అవుతారు. 50 శాతం కంటే తక్కువ క్రెడిట్స్ సాధించిన విద్యార్థులు డిటెన్షన్కు గురవుతారు. డిటెన్షన్ విధానంతో గ్రామీణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. డిగ్రీ 2016-17 విద్యాసంవత్సరంలో ప్రథమ సంవత్సరం రెండో సెమిస్టర్ ఫలితాల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏలో కలిపి 68,547 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 21,790 (31.79 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 63,940 (93.28 శాతం) మంది విద్యార్థులు ప్రమోట్ అయ్యారు. 4,607 మంది విద్యార్థులు డిటెన్షన్కు గురయ్యారు. ఇక డిటెన్షన్ అమల్లో ఉన్న పాలమూరు విశ్వవిద్యాలయంలో 11,600 మంది పరీక్షలకు హాజరైతే 3,200 మంది డిటెయిన్డ్ అయ్యారు. శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో 40,536 మంది పరీక్షలు రాయగా, 2,300 మంది విద్యార్థులు డిటెన్షన్కు గురయ్యారు. వారు డిటెయిన్డ్ కావడంతో ఓ విద్యాసంవత్సరం కోల్పోవాల్సి వచ్చింది. డిటెన్షన్ విధానం అమల్లో లేని కాకతీయలో 46,500 మంది పరీక్షలు రాస్తే, 7,500 మంది, మహాత్మాగాంధీ పరిధిలో 15,200 మంది పరీక్షలకు హాజరుకాగా, 2,800 మంది, తెలంగాణ పరిధిలో 14,500 మంది పరీక్షలు రాయగా, 5,500 మంది డిటెయిన్డ్ అయ్యారు. ఈ మూడు విశ్వవిద్యాలయాల పరిధిలో మాత్రం డిటెన్షన్కు గురైనా వారు పై తరగతులకు వెళ్లారు. ఇలాంటి విధానాలు అమల్లో ఉండడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ ఒకే విధానం అమలు చేయాలని కోరుతున్నారు.
అన్నింటిలోనూ డిటెన్షన్ అమలు చేస్తాం : ఆర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్
సీబీసీఎస్ నిబంధనల్లోనే డిటెన్షన్ అమలుపై విశ్వవిద్యాలయాలకు వెసులుబాటు ఉంది. అందుకే కేయూలో గత విద్యాసంవత్సరంలో అమలు చేయలేదు. ఉస్మానియాలో గతం నుంచే డిటెన్షన్ విధానం ఉన్నందున అమల్లోకి వచ్చింది. అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ ఒకే విధానం అమలు చేస్తాం. డిటెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఇప్పటికే విశ్వవిద్యాలయాలకు సర్క్యులర్ జారీ చేశాం. రిజిస్ట్రార్లతో కమిటీ వేశాం. విద్యార్థులెవరికీ నష్టం జరగకూడదన్నదే మా ఉద్దేశం.
డిటెన్షన్తో నష్టపోతున్న విద్యార్థులు : గౌరి సతీష్, ప్రయివేటు కాలేజీ యాజమాన్యాల సంఘం నేత
అన్ని విశ్వవిద్యాలయాల్లో ఒకే విధానం అమల్లో లేదు. దీంతో డిటెన్షన్ విధానం అమలు చేస్తున్న విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం స్పందించి ఒకే విధానాన్ని అన్ని విశ్వవిద్యాల యాల్లోనూ అమలు చేయాలి. విద్యార్థుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.