Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
- భర్త మృతి, భార్య పరిస్థితి విషమం
- మరో ఇద్దరు రైతుల ఆత్మహత్య
నవతెలంగాణ-రాయికల్/సారంగపూర్/టేకులపల్లి
దోమపోటు నష్టాన్ని భరించలేక... మార్కెట్లో పంటలకు మద్దతు ధర దక్కక...సాగుకోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక.. రైతు దంపతులు క్రిమీసంహారక మందు తాగారు. భర్త మృతి చెందగా...భార్య పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరు రైతులు కూడా అప్పుల బాధతోనే పురుగులు మందు తాగి చనిపోయారు. ఈ ఘటనలు జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గురువారం జరిగాయి. కుటుంబసభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం...సారంగాపూర్ మండలం రేచపెల్లి గ్రామానికి చెందిన కలికోట జగన్(36) వికలాంగుడు. తన భార్య శోభ(32)తో కలిసి తన రెండెకరాలు సాగుచేస్తున్నాడు. ఈసారి వరిపంట దిగుబడి అంతంత మాత్రమే కనిపించడంతో మనస్తాపానికి గురయ్యారు. రూ.3 లక్షల అప్పులు కావడంతో వాటిని తీర్చేమార్గం లేక వారిద్దరూ కలిసి పురుగుల మందు తాగారు. గమనించిన జగన్ తల్లి కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కలవాళ్లు హుటాహుటిన జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి వారిని తరలించారు. అప్పటికే జగన్ మృతిచెందాడు. శోభ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సారంగాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. రాయికల్ మండల కేంద్రానికి చెందిన పాతూరి రాజరెడ్డి తన రెండున్నరెకరాల్లో వరి సాగుచేశాడు. పంటను కాపాడుకునేందుకు రూ.2 లక్షలు అప్పు చేసి బావి పూడిక తీయించాడు. వరిపంట మంచిగా ఎదుగుతున్న దశలో దోమపోటు సోకింది. ఎంత ప్రయత్నించినా దానిని అరికట్టలేకపోయాడు. దీంతో పంటదిగుబడి సరిగారాలేదు. అప్పులు ఎలా తీర్చాలో అర్థంకాక...కష్టనష్టాలకోర్చి పండించిన పంట చేతికొచ్చే దశలో పాడైపోవటంతో తట్టుకోలేక బుధవారం రాత్రి క్రిమీసంహారక మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు జగిత్యాల ఏరియాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి అదేరాత్రి మరణించాడు. మృతుని కొడుకు నరేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు హెడ్కానిస్టేబుల్ అశోక్ తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం తొమ్మిదో మైలుతండాకు చెందిన నూనావత్ భావ్సింగ్ (48) తన నాలుగెకరాలతో పాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశాడు. పత్తి చేను ఏపుగా పెరిగి, పూత, కాత లేకుండా పోయింది. గత నెల కురిసిన అకాల వర్షాలకు కాసిన కొద్దిపాటి కాయలు కూడా పాడయ్యాయి. అప్పులు తీర్చలేమోనన్న అప్పులు తీరేలా లేదని మనస్తాపంతో బుధవారం పత్తిచేనులో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో భార్యా, పిల్లలు పొలం దగ్గరకు వెళ్లి చూసే సరికి బావ్సింగ్ విగతజీవిగా పడి ఉన్నాడు. రూ. 4లక్షల 50 వేల రూపాయల అప్పు ఉన్నట్టు మృతుని భార్య నూనావత్ బోడి తెలిపింది. సాగుకోసం రూ.50 వేల పుస్తెలతాడు కూడా అమ్మినట్టు, బ్యాంకులో కూడా రుణం ఉన్నట్టు చెప్పింది. తన భర్త ఆత్మహత్య చేసుకోవటంతో ముగ్గురు ఆడపిల్లలు, కొడుకు, నేనూ రోడ్డున పడ్డామని విలపించింది.