Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'బయ్యారం' మాట నిలబెట్టుకోండి : కేంద్రమంత్రికి కేటీఆర్ వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యారం స్టీల్ఫ్లాంట్పై కేంద్రం మాట నిలబెట్టుకోవాలని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్రసింగ్ను కేటీఆర్ కోరారు. బయ్యారం స్టీల్ప్లాంట్ సాధ్యాసాధ్యాలపై ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్, ఎంపీ బాల్క సుమన్, తెలంగాణ అధికారులు హాజరయ్యారు. ప్రాథమికంగా బయ్యారంలో 70 మిలియన్ టన్నుల ఐరన్ఓర్ లభించనుందని వివరించారు. బయ్యారానికి సమీపంలోని చత్తీస్గఢ్లోని బైలా జిల్లాలోనూ ఓరన్ఓర్ గనులున్నాయని కేంద్ర అధికారులకు వివరించినట్టు తెలిపారు. బయ్యారం స్టీల్ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర అధికారులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసినట్టు చెప్పారు. అనంతరం విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ను కేటీఆర్ కలిశారు. యూఏఈలో చిక్కుకున్న ఆరుగురు సిరిసిల్ల కార్మికులను విడిపించాలని విజ్ఞప్తి చేశారు. చివరకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హరిదీప్సింగ్పూరిని ఆయన కార్యాలయంలో కలిశారు. నవంబర్ 28న ప్రారంభంకానున్న హైదరాబాద్ మెట్రోపై చర్చించారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలను మంత్రికి వివరించారు. కేటీఆర్ వెంట ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రుడు
తేజావత్, భవన్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్కుమార్ ఉన్నారు.
'నవతెలంగాణ'నా నువ్వు?
నేతన్నలకు బకాయిలపై ప్రశ్నిస్తే మంత్రి కేటీఆర్ ఎదురు ప్రశ్న
'ఆడపోయి అడిగితే తెలుస్తది' అంటూ వ్యాఖ్య
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
'నేతన్న నైరాశ్యం' అంటూ నవతెలంగాణ ప్రచురించిన కథనంపై స్పందించేందుకు చేనేత శాఖ మంత్రి కే తారకరామారావు నిరాకరించారు. కేంద్రమంత్రులతో సమావేశమయ్యేందుకు ఢిల్లీకి వచ్చిన కేటీఆర్ను బతుకమ్మ చీరల బకాయిలపై నవతెలంగాణ ప్రతినిధి ప్రశ్నించారు. 'బతుకమ్మ చీరల బకాయిలు ఇప్పటి వరకు చెల్లించలేదంటా' అని ప్రశ్నిస్తుండగా.. మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుంటూ ''నవతెలంగాణ'నా నువ్వు?'' అంటూ మీడియా మైకుల వద్ద నుంచి వెళ్లిపోయారు. మళ్లీ బకాయిలపై ప్రశ్నించగా.. 'ఆడపోయి అడిగితే తెలుస్తది' అని కారు ఎక్కుతూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలకు బతుకమ్మ చీరల బకాయిలు రూ.26.8 కోట్లు ఉందని గురువారం నాటి సంచికలో నవతెలంగాణ ఓ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. బకాయిలను చెల్లించకపోవడంతో పాటు స్కూల్ యూనిఫాం ఉత్పత్తికి రెండేండ్ల కిందటి ధర కట్టిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించడంతో నేతన్నలు ప్రభుత్వ ఆర్డర్లు వ్యతిరేకించిన విషయాన్ని కథనంలో తెలిపింది. ఇక హైదరాబాద్లో ఇవాంకా ట్రంప్ ప్రయణించనున్న రోడ్లనే ఆధునీకరిస్తున్నారన్న ఆరోపణలపై ప్రశ్నించగా..'అనేవాళ్లు అంటూనే ఉంటారు' అని వ్యాఖ్యానించారు.