Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రహ్మోత్సవాల లోపు 'గర్భగుడి' కష్టమే
- బిల్లుల చెల్లింపుల్లో జాప్యమే కారణమా..?
- భక్తులకు సౌకర్యాల లేమి..
'యాదాద్రి ప్రధానాలయం సివిల్ పనులు 2017 మార్చి 31నాటికి పూర్తి చేయాలి. ఆగస్టు 31నాటికి శిల్పాల పనులు పూర్తవ్వాలి. దసరా నాటికి గర్భగుడిని పునరుద్ధరించాలి'' అని అక్టోబర్ 19, 2016న యాదగిరిగు ట్టలో నిర్వహించిన సమీక్షలో వైటీడీఏ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆలయం దసరాకు ప్రారంభం కాలేదు. అధికారులు ఎంతో వేగంగా చేస్తున్నామని చెబుతున్నప్పటికీ... క్షేత్రస్థాయిలో యాదాద్రి అభివృద్ధి పనులు నత్తనడకను తలపిస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్న పనులను బట్టి చూస్తే వచ్చే మార్చి నాటికి కూడా పూర్తయ్యేటట్టు కనిపించట్లేదు. నిధులను విడుదల చేయడంలో వైటీడీఏ చేసిన జాప్యమే పనుల్లో వేగం మందగించడానికి కారణమని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ శుక్రవారం యాదాద్రికి వస్తున్న నేపథ్యంలో యాదాద్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై నవతెలంగాణ కథనం...
నవతెలంగాణ-యాదాద్రిభువనగిరి ప్రతినిధి
యాదాద్రి అభివృద్ధికి సుమారు రూ.734.7 కోట్లతో తొలి విడత పనులకు అంచనాలు రూపొందించిన వైటీడీఏ ఇప్పటి వరకు రూ.350 కోట్ల మేర పనులను చేసింది. అయితే ప్రభుత్వం ఏటా రూ.100 కోట్లు బడ్జెట్ మంజూరు చేస్తూ వచ్చింది. వీటికి అదనంగా మరో రూ.350 కోట్ల అవసరం అవుతాయని సాంకేతిక కమిటీ ఇటీవల పంపిన నివేదికకు ప్రభుత్వం గ్రీన్సిగల్ ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కేటాయించిన రూ.100 కోట్లలో పెండింగ్లో ఉన్న బిల్లుల కోసం కేవలం రూ.25 కోట్లను మాత్రమే విడుదల చేసింది. పనులను వేగవంతంగా చేసి నిర్ణీత సమయంలో భక్తులకు నిజ దర్శనాలు కల్పించడానికి అవసరమైన రూ.350 కోట్లకు గాను రూ.200 కోట్లను మంజూరు చేసినట్టు తెలిసింది.
బ్రహ్మోత్సవాలకు కష్టమే..
యాదాద్రి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, వచ్చే మార్చి నాటికి స్వామి వారి దర్శనం ప్రధాన గర్భగుడిలోనే అని అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ప్రధాన ఆలయ గోపురాలు ఏడింటిలో రెండు మాత్రమే చివరిదశలో ఉన్నాయి. నాలుగు గోపురాలు పది శాతం పూర్తయ్యాయి. దక్షిణ దిశలో ఉన్న గోపుర నిర్మాణం పనులు అసలు మొదలే పెట్టలేదు. ఈ గోపురాలను పూర్తిగా కృష్ణశిలతో నిర్మిస్తున్నా రు. ఇంకా ఆలయంలోని ప్రాకారాలు, మాడవీధుల పనులు ప్రారంభం కావాల్సి ఉంది. జిల్లాలోని రాయగిరి, రంగారెడ్డి జిల్లాలోని కొహెడ, కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ ప్రాంతాల నుంచి వచ్చిన రెండు వందల మంది శిల్పులు చెక్కుతున్నారు. చిత్రవనం, ఉపపీడం, పైనాఫిల్లర్, పొదిల్, కొంగై, యాలవేరి వంటి భంగిమలలో శిల్పాలను చెక్కాలి. అత్యంత సూక్ష్మమైన పని కావడంతో సీఎం పెట్టిన డెడ్లైన్లో అవి పూర్తయ్యే అవకాశం లేదని తేలింది. ఆలయ నిర్మాణంలో ప్రధాన భూమిక అయిన రిటైనింగ్ వాల్ ఇంకా 40శాతం పూర్తి కావల్సి ఉంది. ఇది పూర్తయితేనే ప్రధాన ఆలయంపై స్లాబ్ వేస్తారు. అనంతరం గోపురం నిర్మించి దివ్యవిమాన రథం కడుతారు. ముమ్మరంగా పనులు జరిగితే వీటి నిర్మాణాలకు ఆరు నెలలకు పైగా పడుతుందని నిపుణుల అంచనా. పెద్దగుట్టపై నిర్మిస్తున్న టెంపుల్ సిటీలో రోడ్ల నిర్మాణం నిదానంగా సాగుతున్నాయి. యాదాద్రికి వచ్చే నాలుగు రోడ్లలో భువనగిరి మండలం రాయగిరి నుంచి మాత్రమే నాలుగు లైన్ల రోడ్డు ముగింపు దశలో ఉంది. రాయిగిరి రైల్వేస్టేషన్ వద్ద కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి జాప్యం కావడంతో ఫ్లై ఓవర్ పనులు నిలిచిపోయాయి. మిగతా మూడు ప్రాంతాల నుంచి వచ్చే రోడ్లు విస్తరణ చేయడానికి భూసేకరణ నత్తనడకన సాగుతోంది. కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ రోడ్డు పనులకు అడ్డుగా ఉన్న వంద గృహాలకు ఇప్పటి వరకు పరిహారం తేల్చలేదు. వీరికి పరిహారంతో పాటు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్ మాట ఏడాదిగా నీటి మూటగానే నిలిచిపోయింది.
నిలిచిపోయిన చెల్లింపులు
యాదాద్రి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. 4 నెలలుగా వైటీడీఏ నుంచి బిల్లులు ఇవ్వడం లేదని కాంట్రాక్టర్ సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. సుమారు రూ.40 కోట్ల వరకు చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో కాంట్రాక్టర్ ఆరు నెలలుగా వర్కర్లకు వేతనాలు ఇవ్వలేదు. జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు పనులు బంద్ పెట్టారు. దీంతో కాంక్రీట్ నిర్మాణ పనుల్లో వేగం మందగించింది. ప్రధాన ఆలయ నిర్మాణ పనులపై ప్రభావం పడింది. ఈ పనులను అధికారులు మరో కాంట్రాక్టర్కు అప్పగించినట్టు తెలిసింది. అప్పటి నుంచి మిగతా బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేసే విషయంలో ఆ సంస్థ ఆ శ్రద్ధ వహిస్తున్నట్టు సమాచారం. కాగా పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావం, వర్షాలు ఇలా పలు రకాల కారణాలతో పనుల్లో వేగం తగ్గిందన్న సాకులను అధికారులు చూపెడుతున్నారు.
అటకెక్కిన కొత్త నిర్మాణ పనులు
ఆలయం పూర్తయిన తర్వాత గుట్టకు రోజు లక్ష మంది భక్తులు వస్తారని ఓ అంచనా. కానీ, అందుకు తగ్గట్టుగా గుట్టపై వసతి, రహదారులు, క్యూలైన్ల వ్యవస్థ ఏర్పాటుకు చేసిన ప్రణాళికలు అమలు కావట్లేదు. గుట్టపై పాత కట్టడాలను కూల్చివేశారు. షాపులు, పాత భవనాలు తొలగించారు. వాటి స్థానంలో కొత్త నిర్మాణ పనులు అటకెక్కాయి. గర్భగుడితోపాటు ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో దర్శనం కోసం వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గుట్టపైకి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేదు. తాత్కాలిక షామియానాలు, మంచినీటి సౌకర్యం కల్పించలేదు.
చకచకా.. సాధ్యం కాదు
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చకాచకా చేయడం సాధ్యం కాదు. అన్నీ చూసుకుని ముందుకు సాగుతున్నాం. అందుకే ముందుగా అనుకున్నట్టు దసరా నాటికి గర్భాలయంలో దర్శనాలు ప్రారంభించలేమని స్పష్టం చేస్తున్నా. ఎలాంటి అవాంతరాలు లేకుండా పనులను బ్రహ్మోత్సవాలకు పూర్తి చేస్తాం. లేకుంటే జయంతి ఉత్సవాలకు సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తాం.
- కిషన్రావు, వైటీడీఏ ఉపాధ్యక్షులు