Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరుకుల రవాణా నుంచి పంపిణీ వరకు ఆన్లైన్
- సాంకేతికతతో అక్రమాలకు అడ్డుకట్ట
పౌరసరఫరాల శాఖ అంటేనే..ఒక దశ,దిశ లేకుండా పనిచేస్తోందని నానుడి. కానీ ఇపుడు దాని అర్థం మారింది. పేదలకు రేషన్ షాపుల ద్వారా ఇచ్చే సరకులు సక్రమంగా అందించటమే లక్ష్యంగా పౌరసరఫరాలశాఖ అడుగులేస్తోంది.ఏడాది కాలంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పౌరసరఫరాలశాఖలో అక్రమాలకు కమిషనర్ సి.వి. ఆనంద్ అడ్డుకట్ట వేశారు. శాఖలో సాంకేతిక విప్లవాన్ని ఉపయోగించి ఎన్నో సంస్కరణలు చేపట్టి ఆయన మరో ముందడుగు వేయబోతున్నారు. ప్రజలకు పౌరసరఫరాల శాఖను మరింత చేరువ చేసేందుకు 'ప్రజల చేతిలో పౌరసరఫరాలు' పేరుతో మొబైల్ యాప్ను రూపొందిస్తున్నారు. ఈ యాప్ ద్వారా ప్రజలు పౌరసరఫరాలకు సంబంధించిన లావాదేవీలన్నీ ఉపయోగించే విధంగా ఉండబోతోంది. అదే విధంగా రాష్ట్రంలో 171 గోదాముల్లో దశలవారీగా సీసీ కేమెరాలను అమర్చి కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయబోతున్నారు.
సరఫరా నుండి పంపిణీ వరకు కంప్యూటరీకరణ, రేషన్దుకాణాల్లో ఈపాస్, ఎలక్ట్రానిక్ తూకాలు, సరుకుల రవాణా వాహనాలకు జీపీఎస్, గోదాముల వద్ద సీసీ కెమెరాలు, రేషన్ లబ్ధిదారులు కోరుకున్న రేషన్ షాపుల నుండి సరుకులు తీసుకునేలా పోర్టబిలిటీ విధానం, ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టం (ఓపిఎంఎస్) ద్వారా రైతుల నుండి ధాన్యం కొనుగోలు, చెల్లింపులు, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ, పర్యవేక్షణ విధానం (ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ - ఎపసెంఎస్), సప్లై చెయిన్ మేనేజ్మెంట్ (ఎస్సీఎం), రేషన్షాపులకు ప్రతీ నెల పంపే సరుకుల వివరాల నమోదుకు ఈపీడీఎస్... ఇలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలైనంత వరకు ఉపయోగించుకుని వందశాతం నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు అడుగులు వేశారు. ఇందులో అత్యుత్తమ ఫలితాలను రాబట్టారు. రూ.8.072 కోట్లు ఆన్లైన్ ద్వారా నేరుగా రైతుల ఖాతాలోకే జమ చేయడం జరిగింది. 2017-18 ఖరీఫ్, రబీలో ప్రతి కోనులోలు కేంద్రాల్లో ట్యాబ్లను ఉపయోగించి పూర్తిగా ఆన్లైన్లోనే ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేశారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పౌరసరఫరాల్లో ముఖ్యంగా రేషన్బియ్యం అక్రమ రవాణకు అడ్డుకట్ట వేశారు. ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిఘాతో కమిషనర్ సిఫారసు మేరకు ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ముగ్గురిపై ఆయా జిల్లా కలెక్టర్లు పీడీ కేసులు నమోదు చేశారు.ఈ విధంగా పీడీ కేసులు నమోదు కావడం పౌరసర ఫరాలశాఖ చరిత్రలో మొదటిసారిగా చెప్పవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి రూ.4.50 కోట్ల విలువచేసే నిత్యావసర సరుకులను స్వాధీనం చేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ బృందాల నిఘా ఫలితంగా ప్రభుత్వానికి దాదాపు రూ.25 కోట్ల ఆదా అయింది.
పౌరసరఫరాల శాఖ, సంస్థ, తూనికలు, కొలతల శాఖ పరిధిలోని అన్ని విభాగాల్లో కార్యకలాపాల నిర్వహణ ప్రక్రియ వినియోగదారుల ప్రయోజనాలకు అనుగుణంగా ఎటువంటి లొసుగులు లేకుండా ఉండే విధంగా కంప్యూటర్లు, ఐటీ వాడకాన్ని విస్తృతంగా చేపట్టారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, రైతులకు ఆన్లైన్ చెల్లింపుల్లో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకంగా నిలిచింది.
ప్రజా పంపిణీ బియ్యం రవాణా, రేషన్ సరుకులు తరలింపు నుండి పంపిణీ వరకు అన్ని లావాదేవీలు కంప్యూటరీకరణ, కస్టమ్ మిల్లింగ్ రైస్, స్టోరేజ్, ఆన్లైన్ లావాదేవీలు, ధాన్యం సేకరణ, ఆన్లైన్ ద్వారా రైతులకు చెల్లింపులు, సన్న బియ్యంలో నాణ్యత, మిల్లర్ల నుండి బియ్యం బకాయిలు వసూలు, గోనె సంచుల రికవరీ, రోడ్డుమార్గాన గోనె సంచుల తరలింపు, గ్రేటర్ హైదరాబాద్లో బినామీ డాలర్ల ఏరివేత, ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు తీసుకునేలా రేషన్ పోర్టబిలిటీ విధానం, రేషన్ బియ్యం తరలించే వాహనాలకు, కిరోసిన్ ట్యాంకర్లకు జీపీఎస్ అమర్చడం, గోదాముల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు, బయోమెట్రిక్ ద్వారా రేషన్ పంపిణీ, రేషన్ సరుకులు తరలించే వాహనాల కదలికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు, సీఎంఆర్కు సంబంధించి మిల్లర్ల లావాదేవీలను సైతం ఆన్లైన్ పరిధిలోకి తీసుకువచ్చారు. పౌరసరఫరాలశాఖ, పౌరసరఫరాల సంస్థ, జిల్లాకు మధ్య ఉన్న సమన్వయ లోపాన్ని వాట్సప్ గ్రూపుల ద్వారా తగ్గించడం జరిగింది. ఇందుకోసం 15 వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు.
రూ.1450 కోట్లు ఆదా
పారదర్శకత, జవాబుదారీతనం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సత్వర ఫలితాలే లక్ష్యంగా చేపట్టిన సంస్కరణలతో ఏకంగా రూ.1450 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదా చేయడమే కాకుండా, శాఖను పూర్తిగా గాడిలో పెట్టారు.సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్న ఆనంద్..కమిషనర్గా పలు సంస్కరణలు, వినూత్న చర్యలు, విప్లవాత్మకమైన నిర్ణయాలు, రికవరీలు, ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు చర్యలు సత్ఫలితాలనిచ్చాయి.
మిల్లర్ల నుంచి 2015-16 రావాల్సిన పాత బకాయిలను సైతం వసూలు చేశారు.
పౌరసరఫరాల సంస్థ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించే నాటికి ఆగస్టు 20, 2016 మిల్లర్ల నుండి రూ.480 కోట్లు విలువచేసే లక్షా 80వేల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉంది. 45 రోజుల్లో మిల్లర్ల నుండి ఆ బకాయిలను వసూలు చేశారు. సన్న, దొడ్డు బియ్యం కొనుగోళ్లలో రూ.124 కోట్లు ఆదా చేశారు. ప్రభుత్వ వసతిగృహాలు, మధ్యాహ్న భోజనం అమలు వంటి కార్యక్రమాల కోసం 1.20 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని కొనుగోలు విషయంలో కమిషనర్ సి.వి. ఆనంద్ రైస్మిల్లర్లతో పలుమార్లు జరిపిన చర్చల ఫలితంగా ప్రభుత్వానికి సన్నబియ్యం ద్వారా రూ.44 కోట్లు, పీడీఎస్ (దొడ్డు) బియ్యం ద్వారా రూ.80 కోట్లు, మొత్తం రూ.124 కోట్లు ఆదా అయింది.
ప్రశంసలుపొందుతున్న కమాండ్ కంట్రోల్ సెంటర్:
దశాబ్దాలుగా సాగుతున్న రేషన్ బియ్యం అక్రమరవాణా కట్టడి లక్ష్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్ పౌరసరఫరాల భవన్ కేంద్రంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. 1337 స్టేజ్ 1, స్టేజ్ 2 వాహనాలకు జీపీఎస్ అమర్చడం, అలాగే 46 కిరోసిన్ ట్యాంకర్లకు కూడా జీపీఎస్, హైదరాబాద్లోని మండలస్థాయి నిల్వ కేంద్రాలు (ఎంఎల్ఎస్ పాయింట్లు) సీసీ కెమెరాలను అమర్చి వీటన్నిటినీ కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. గోవా, జమ్మూకాశ్మీర్ రాష్ట్ర మంత్రులు, కేంద్ర ఆహార సంయుక్త కార్యదర్శి, జార్ఖండ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి.. ఇలా పలువురు కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును పరిశీలించి ప్రశంసించారు.
సీఎంఆర్ అక్రమాలకు అడ్డుకట్ట:
సర్కారు బియ్యాన్ని సకాలంలో అందించకుండా ఏండ్ల తరబడి జాప్యం చేస్తున్న మిల్లర్లకు మూకుతాడు వేశారు. ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యాన్ని కొంత మంది మిల్లర్లు స్వ ప్రయోజనాల కోసం వాడుకునేవారు. మరికొంత మంది రీసైక్లింగ్ చేసిన బియ్యాన్ని అప్పగించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పౌరసరఫరాల సంస్థ చరిత్రలో మొదటిసారిగా ఈ ఏడాది ఖరీఫ్లోమిల్లర్ల నుంచి వందశాతం బియ్యాన్ని సేకరించారు. జిల్లా రైస్ మిల్లర్లను సంప్రదించి, మిల్లుల సామర్థ్యం మేరకు ధాన్యం కేటాయించడం, వారిని బాధ్యులను చేయడం తదితర చర్యల వల్ల ఇది సాధ్యమైంది.
సన్నబియ్యం అక్రమాలకు చెక్
రేషన్డీలర్లు, పాఠశాలలు, వసతి గృహాల నిర్వాహకులు సన్నబియ్యాన్ని బ్లాక్మార్కెట్కు తరలిస్తే సలువుగా గుర్తించేలా విద్యార్థులకు సరఫురా చేసే సన్నరకం బియ్యం సంచులను మార్చివేశారు. కొత్తగా తెల్ల సంచుల్లో (ఎస్డీపీఈ) తెల్లని ప్లాస్టిక్ సంచుల్లో 50 కేజీలను సరఫరా చేస్తుండటం, అంతేకాక ఈ సంచులపై రైస్ మిల్లర్ పేరు, ఏరోజు నింపారు, మిల్లు ప్రాంతం, బియ్యం రకం వంటి వివరాలను ముద్రించారు. ఆయా సంచులపై తెలంగాణ పౌరసరఫరాల సంస్థ అని రాయడం, దీంతోపాటు మండల విద్యాధికారి (ఎంఇవో) పాఠశాల హెడ్మాస్టర్, హాస్టల్ వార్డెన్తో పాటు తాహసీల్దార్, పౌరసఫరాలశాఖ అధికారులను బాధ్యులను చేసి సన్నబియ్యం అక్రమాలకు చెక్ వేశారు.
సంస్థ బలోపేతానికి విభాగాల ఏర్పాటు
పౌర సరఫరాల సంస్థ బలోపేతానికి ఐటీ, ఎన్ఫోర్స్మెంట్, ఫైనాన్స్ వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి ఫలితాలను రాబట్టగలిగారు. అలాగే అవుట్సోర్సింగ్ పద్ధతిలో 50 మంది అకౌంటెట్లను, సాంకేతిక సిబ్బందిని సెంటర్ ఫర్ గుడ్గవర్నెన్స్ ద్వారా నియమించారు. 2011 నుండి పెండింగ్లో ఉన్న అకౌంట్లన్నీ రాష్ట్రంలో జిల్లాల్లో ఆడిట్ చేయించడంతో పాటు రోజు జరిగే లావాదేవీలపై నిఘా ఉంచడానికి లలిత్ప్రసాద్ అండ్ కో చార్టర్డ్ అకౌంటింగ్ ఏజెన్సీని నియమించారు. ప్రతి ఒక్క లావాదేవీలను ఆన్లైన్లో సంబంధిత సిబ్బంది అందరూ ఉమ్మడిగా చూడడానికి వీలుగా, అలాగే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం (ఎఫ్ఎంఎస్)ను రూపొందించారు.
ఆన్లైన్ద్వారా రైతు ఖాతాలో రూ.8067 కోట్లు జమ
దళారుల ప్రమేయం ఉండకూడదన్న ప్రధాన ఉద్దేశంతో ఆన్లైన్ చెల్లింపులకు శ్రీకారం చుట్టారు. రికార్డు స్థాయిలో కనీస మద్దతు ధరకు సంబంధించిన చెల్లింపులను ఈ ఏడాది రూ.8067.43 వేల కోట్లను తొలిసారి ఆన్లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేసి దేశానికి ఆదర్శంగా నిలిచింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇందుకోసం ప్రత్యేకంగా ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టం (ఒపీఎంఎస్) సాఫ్ట్వేర్ను రూపొందించారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచింది.
రేషన్ పోర్టబిలిటీకి అన్యూహ స్పందన
డీలర్ల మధ్య పోటీతత్వం పెంచి లబ్దిదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలన్న ప్రధాన ఉద్దేశంతో జూన్ ఒకటవ తేదీ నుండి గ్రేటర్ హైదరాబాద్లోని 1545 షాపుల్లో ఎక్కడి నుంచైనా చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకులు తీసుకునే (రేషన్ పోర్టబిలిటీ) విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానానికి లబ్ధిదారుల నుండి అన్యూహ స్పందన లభిస్తోంది. హైదరాబాద్లోని తొమ్మిది సర్కిల్స్లో జూన్ నెలలో 1,02,000 మంది, జూలైలో 1,52,000 మంది పోర్టబిలిటీని ఉపయోగించుకున్నారు.
బినామీ డీలర్ల తొలగింపు
స్పెషల్ డ్రైవ్ ద్వారా గ్రేటర్ హైదరాబాద్లో బినామీ పేర్లతోకొనసాగుతున్న రేషన్ డీలర్లను గుర్తించారు. 1545 షాపుల్లో 25 రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో దాదాపు 250 మంది బినామీలను గుర్తించి వారిని తొలగించారు.
టీ రేషన్ మొబైల్ యాప్
పారదర్శకతకు పెద్దపీట వేస్తూ పేద ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి పౌరసరఫరాల కార్యకలాపాలను ప్రజలకు మరింత చేరువచేసింది. రేషన్ లావాదేవీలను సామన్య ప్రజలు సైతం ప్రత్యక్షంగా తెలుసుకునేలా 'టీ-రేషన్' మొబైల్ యాప్ను రూపొందించింది. ప్రజలు పౌరసఱపరాలకు సంబంధించిన అన్ని లావాదేవీలను ఈ యాప్ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. పౌరసరఫరాల శాఖ అధికారులు సైతం ఎక్కడి నుంచైనా ఈ యాప్ ద్వారా తమ రోజువారీ కార్యక్రమాలను నిర్వహించుకునేలా 13 అప్లికేషన్స్తో ప్రభుత్వ సేవలను రూపొందించారు. సరుకుల సరఫరా నుండి పంపిణీ వరకు జరిగే అన్ని వివరాలు ఇందులో పొందుపరిచారు. ఈ మొబైల్ యాప్ ద్వారా సమీపంలోని రేషన్షాప్ లొకేషన్ను గుర్తించే వీలుగా, ఆ షాపులో జరిగే లావాదేవీలను ప్రత్యక్షంగా (లైవ్) తెలుసుకోవడమే కాకుండా, అందులోని సరుకులకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పుడైనా, ఎక్కడైనా తెలుసుకునే అవకాశం ఉంటుంది. గోదాముల్లో సరుకుల నిల్వలు, లోడింగ్, అన్లోడింగ్, రవాణా నుండి పంపిణీ వరకు జరిగే ప్రతి లావాదేవీని సామాన్య ప్రజలు సైతం సులభంగా తెలుసుకునేలా యాప్ రూపొందించారు. అన్నిటికంటే మించి దేశంలో ఎక్కడలేని విధంగా లబ్ధిదారుడుకి సమీపంలోని ఉన్న రేషన్షాపు లొకేషన్ చూపించేలా అప్లికేషన్ను తయారు చేసింది. పౌరసేవలు (జీ2సీ) ఏడు అప్లికేషన్స్, ప్రభుత్వ సేవలు 13 అప్లికేషన్స్ కలిపి మొత్తం 20 అప్లికేషన్స్తో యాప్ను రూపొందించడం జరిగింది.
వాట్సాప్ 7330774444
అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజల భాగస్వామ్యంతో రేషన్ అక్రమాల నిరోధానికి పౌరసరఫరాల శాఖ మరో అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా ప్రజలకు ప్రయోజనం కలిగేలా వాట్సప్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఇందుకోసం పౌరసఫరాల భవన్లో వాట్సప్ సెంటర్ను ఏర్పాటు చేసింది.పౌరసరఫరాల శాఖ వాట్సప్ 7330774444 నంబర్ ద్వారా ప్రజల నుంచి సులువుగా సంక్షిప్త సందేశాలు, చిత్రలు, అడియో, వీడియో క్లిప్పింగుల ద్వారా వాట్సప్ కంట్రోల్ రూంకు సమాచారాన్ని తెలియజేయవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా 171 గోదాములో 1715 సీసీ కెమెరాలు
రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాల సంస్థకు సంబంధించిన మొత్తం 171 గోదాముల్లో 1715 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నది. గోదాముల్లో జరిగే లోడింగ్, అన్లోడింగ్ తదితర లావాదేవీలతో పాటు గోదాముల్లో ప్రతి వ్యక్తి కదలికలను, అతని వద్ద ఉన్న వస్తువులను సైతం పౌరసరఫరాల భవన్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాటు చేసింది.ముప్పై రోజుల పాటు వాటి రికార్డింగ్ను బ్యాకప్ ఉంటుంది. అపరిచితులు గోదాముల్లోకి ప్రవేశించినప్పుడు గుర్తించే వీలుంటుంది. అన్నిటి కంటే ముఖ్యంగా ఈ సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల అక్కడ ఉన్న అధికారులు, హమాలీలు ఏదైనా తప్పు చేయడానికి భయపడతారు.
సమిష్టికృషితో అత్యుత్తమ ఫలితాలు : సి.వి. ఆనంద్
''నేను 2016, ఆగస్టు 20న పౌరసరఫరాలశాఖ కమిషనర్గా పౌరసరఫరాల సంస్థ వైస్ చెర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్గా, తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్గా బాధ్యతలు చేపట్టాను. ఇది నాకు పూర్తిగా కొత్త రకం బాధ్యత. అయినా నేర్చుకోవడానికి గొప్ప అవకాశం, మంచి అనుభవం కూడా. ఈ విభాగంతో లావాదేవీలు జరిపేవారిని, అధికారులను వినూత్నంగా ఆలోచించేటట్టు చేయగలిగాను. వారిలో చైతన్యాన్ని, సంస్థలో మార్పులను తీసుకురాగలిగాను. అవినీతి నిర్మూలన, పారదర్శకత, వినియోగదారులకు మెరుగైన సేవలు, ఉద్యోగుల్లో నిబద్ధత, సమయపాలనతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంతో పౌరసరఫరాలశాఖలో మార్పులు తీసుకురాగలిగాను. ప్రతి ఒక్కరూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కిందిస్థాయి నుండి పైస్థాయి వరకు బాగా పనిచేయడం వల్లే ఇది సాధ్యమైంది. ఏడాది కాలంలో రూ.1450 కోట్ల వరకు ఆదా చేయగలిగాం. ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటే పాలనలో పారదర్శకత ఏర్పడంతోపాటు, అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు మార్గం సుగమమవుతుంది. సాంకేతిక విధానాలను అమలు చేయడం ద్వారా అందరిలోనూ జవాబుదారీతనం ఉంటుంది. ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే స్పందించేందుకు అవకాశం ఉంటుంది. అందుకే ఏడాదికాలంలో సాంకేతికతను విరివిగా వాడుకుని మంచి ఫలితాలను రాబట్టడం జరిగింది. ఈ ఫలితాల వెనుక మంత్రి ఈటల రాజేందర్ సహకారం, ప్రోత్సాహం ఎంతో ఉంది. ఈ ఏడాది కాలంలో పౌరసరఫ రాలశాఖలో తీసుకువచ్చిన మార్పులు, విధాననిర్ణయాలు, వాటి ఫలితాలను గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎక్స్లెన్స్ అవార్డు ప్రకటించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇంకా బాగా పనిచేయడానికి ప్రేరణను ఇచ్చింది. 'ఎక్సలెన్స్' అవార్డు బాధ్యతను మరింత పెంచింది. పౌరసరఫ రాలశాఖలో ప్రక్షాళన దిశగా చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇచ్చాయి'' అని సి.వి. ఆనంద్ అన్నారు.