Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంటులో వర్గీకరణ బిల్లు పెట్టాలంటూ ఎమ్మార్పీఎస్ హల్చల్
- భారతి సంస్మరణ సభ అనంతరం ట్యాంక్బండ్ ముట్టడికి పిలుపు
- అడ్డుకున్న పోలీసులు
- పోలీసు వాహనాల ధ్వంసం
- మందకృష్ణ సహా వందలాది మంది అరెస్టు
- ఆందోళనకారులపై లాఠీల మోత
- సృహతప్పిన ఐదుగురు మహిళలు
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్ సిటీలో మెరుపుదాడి జరిగింది. వేలాది మంది పోలీసుల బలగాలతో నిండివున్న హైదరాబాద్లో ఎవరూ ఊహించని రీతిలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు హల్చల్ సృష్టించారు. పోలీసులకు నిద్రపట్టనీయలేదు. ప్రజలు భయబ్రాంతులకు గుర య్యారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి సంస్మరణ సభ ఆదివారం రాత్రి సికింద్రాబాద్ సిక్కీ విలేజ్లోని ఇంపీరియల్ గార్డెన్లో జరిగింది. దీనికి వంద లాది మంది హాజరయ్యారు. సభ అనంతరం రాత్రి పదకొండుగంటల సమయ ంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ట్యాంక్బండ్ ముట్టడికి పిలుపునిచ్చారు. సభా వేదిక నుంచి ట్యాంక్బండ్కు బయల్దేరారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసుకుంటూ ప్రదర్శనగా బయలు దేరారు. సీఎం కేసీఆర్ కాల్పులు జరిపించినా వెనక్కి తగ్గేదిలేదని మందకృష్ణ చెప్పారు. దీనిపై ప్రభుత్వం ప్రకటన చేసేవరకు తమ పోరాటం ఆగదన్నారు. ఈ హఠాత్తు పరిణామంతో పోలీసులు ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. వెంటనే పోలీసులు ర్యాలీని అడ్డుకునేందుకు యత్నించారు. హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాసరావు, హైదరాబాద్లో ఉన్న డీసీపీలంతా రోడ్డుపైకి వచ్చారు. పరిస్థితిని సమీక్షించారు. ట్యాంక్బండ్ వరకు భారీగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రదర్శన ప్రారంభం నుండే పోలీసులపై కుర్చీలు, కర్రలతో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు దాడి చేశారు. తెలుగు మహాసభల హౌర్డింగ్స్, బ్యానర్లను ధ్వంసం చేశారు. ఆగ్రహించిన పోలీసులు కూడా వారిపైనా లాఠీచార్జీ చేశారు. దొరికినవారిని దొరికినట్టుగా అరెస్టు చేశారు. లాఠీలను ప్రయోగించారు. పారడైజ్ దగ్గర ట్యాంక్ బండ్ రోడ్డుకు లారీలను అడ్దుగా నిలిపి మందకృష్ణతో పాటు వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు. మందకృష్ణతో పాటు ప్రదీప్, రవిలతో పాటు మరికొందరిని అరెస్టు చేసి మొదట రాంగోపాల్పేట పోలీసు స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత కామాటిపురం పోలీసుసేషన్కు తీసుకెళ్లారు. అరెస్టు చేసిన మరికొందరిని కంచన్బాగ్ పోలీసుస్టేషన్లో ఉంచారు. పోలీసుల లాఠీచార్జీలో ఐదుగురు ఎమ్మార్పీఎస్ మహిళా కార్యకర్తలకు గాయాలయ్యాయి. సొమ్మసిల్లి పడిపోవడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రయివేటు వాహనాలతో పాటు పోలీస్ పెట్రోలింగ్ బైక్లను ఆందోళనాకారులు ధ్వంసం చేశారు. ప్యారడైజ్ దగ్గర భారీగా ట్రాఫిక్ జాం కావడంతో ప్రజలు ఇబ్బందులకు గరయ్యారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సెంట్రల్ జోన్ డిఎస్పీ జోహాల్ డేవిస్ తెలిపారు. పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు. ఇతర జిల్లాల నుండి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు హైదరాబాద్లో అడుగుపెట్టనీయకుండా అన్ని జాతీయ రహదారుల వద్ద శివారు వద్ద భారీగా పోలీసులను మోహరింప చేశారు. రోడ్లపైనే ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు మరికొందరు ఉండడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని బస్టాండ్లనుండి బస్సులను బయటకు రానీయకుండా పోలీసులు నిలుపుదల చేశారు. రోడ్లపై ఆందోళనకారులు రాకుండా ముళ్లకంచెలు, పెద్ద పెద్ద బారీకేడ్లను ఏర్పాటు చేశారు. తెలుగు మహాసభల వేదికల వద్ద బందోబస్తు ఉంచారు. అరెస్టు చేసిన మందకృష్ణను మెజిస్ట్రేట్ ముందు ఉంచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 19న తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు రాష్ట్రపతి కోవింద్ హాజరవుతున్న నేపథ్యంలో తమ నిరసనను తెలయిజేసేందుకు మందకృష్ణ మాదిగ ఈ అకస్మాత్తు నిరసనకు పిలుపుఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో పోలీసు ఇంటిలజెన్సీ వైఫల్యం ఉంది. గతంలో మందకృష్ణ వైఖరి తెలిసిన పోలీసులు జాగ్రత్తలు తీసుకోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిల్లల గుండెజబ్బులు విషయంలోనూ, ఎస్సీ వర్గీకరణ సమయంలోనూ అర్ధరాత్రి సమయంలోనే ఆందోళనలకు పిలుపునిచ్చి హైదరాబాద్లో పోలీసులకు మూడు చెరువులు నీళ్లు తాగించారు. ఆ తర్వాత మూడు రోజుల పాటు ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయాన్ని పోలీసులు భారతి సంస్మరణ సభను తేలిగ్గా తీసుసకున్నారని తెలిసింది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా, విధ్వంస చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.