Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కో సిలిండర్పై అదనంగా రూ.20 నుంచి రూ.40 వసూలు
- ఉచితంగా పంపిణీ చేయాల్సిన సిలిండర్కు రవాణా భారం
- గ్యాస్ ఏజన్సీల మాయాజాలం
- వినియోగదారులపై భారం నెలకు రూ.25 కోట్లపైనే
- పట్టించుకోని పౌరసరఫరాల శాఖ అధికారులు
- తనిఖీ బృందాలు ప్రకటనకే పరిమితం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రం నెలనెల గ్యాస్ ధర పెంచుతూ పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నది. 16 నెలల్లో 19 సార్లు సవరించి ఇప్పటికే కోట్లాది రూపాయల భారం వేసింది. నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటి సామాన్యుడిని ఆగమాగం చేస్తున్నాయి. తామేం తక్కువ కాదని గ్యాస్ ఏజన్సీలు కూడా నిలువుదోపిడీ చేస్తున్నాయి. రవాణా పేరుతో సరఫరాదారుల నుంచి ఒక్కో సిలిండర్కు రూ.20-రూ.40 వరకు వసూలు చేయిస్తూ ఘరానా దోపిడీకి పాల్పడుతున్నాయి. నిబంధనల ప్రకారం సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయాలి. అదనంగా ఎలాంటి రుసుము వసూలు చేయరాదు. కానీ అందుకు విరుద్ధంగా జరుగుతున్నది. రాష్ట్రంలో ఇండెన్కు 35.28 లక్షలు, హెచ్పీ 20.74 లక్షలు, భారత్ గ్యాస్కు 29.50 లక్షల చొప్పున మొత్తం 85.52 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రధాని 'గివ్ ఇట్ అప్' పిలుపునకు రాష్ట్రంలో 3.85 లక్షల కనెక్షన్లు సబ్సిడీని ఉపసంహరించుకోగా, ప్రస్తుతం 81.67 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. రాష్ట్రంలోని 1,186 (హెచ్పీసీ-402, ఐఓసీ-502, బీపీసీ-282) ఏజన్సీలు సిలిండర్లను సరఫరా చేస్తున్నాయి. వినియోగదారుడు నెలకు ఒక్క సిలిండర్ తీసుకున్నా రూ.20 చొప్పున లెక్కేస్తే రూ.16.34 కోట్లు అవుతుంది. 44.79 లక్షల దీపం కనెక్షన్లను కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ భారం రూ.25.30 కోట్లు అవుతుంది. ఈ దోపిడీ బహిరంగ రహస్యమే అయినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. తనిఖీల కోసం ఏర్పాటు చేసిన బృందాలు కేవలం ప్రకటనలకే పరిమితవుతున్నాయి. వినియోగదారులు రాతపూ ర్వకంగా ఫిర్యాదు చేస్తేనే ఏజన్సీపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నాయి. నెలనెల మామూళ్లతో సరిపెట్టుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఒక సిలిం డర్ను సరఫరా చేస్తే ఆయిల్ కంపెనీలు ఏజన్సీలకు రూ.50 వరకు కమీషన్ ఇస్తాయి. అందులో నుండే సరఫరాదారులకూ వేతనం చెల్లించాలి. అయితే సరఫరాదారులకు ఏజన్సీలు చాలా తక్కువ వేతనం చెల్లిస్తున్నాయి. హైదరా బాద్లో నెలకు రూ.5 వేల నుండి రూ.6 వేల వరకు చెల్లిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో దారుణంగా రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఇస్తుండటం గమనార్హం. ఇతర అలవెన్సులు కూడా చెల్లించకుండా అరకొర వేతనమే ఇస్తూ మిగతా మొత్తాన్ని వినియోగదారుల నుంచి తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.
నిబంధనలు బేఖాతరు
పట్టణాల్లో 5 కి.మీ వరకు, హైదరాబాద్లాంటి నగరంలో 15 కి.మీ. వరకు ఉచితంగా సిలిండర్ను సరఫరా చేయాల్సి ఉంటుంది. గ్యాస్తోపాటు తెచ్చే బిల్లుపై ఉండే ధరను మాత్రమే వినియోగదారుల నుంచి తీసుకోవాలి. అదనంగా ఎలాంటి రవాణా చార్జీలు వసూలు చేయరాదు. అయితే, నిర్దేశించిన దూరం కంటే 10 కి.మీ. ఎక్కువైతే రూ.15, మరో 10 కి.మీ. దాటితే రూ.34 అదనంగా తీసుకోవచ్చు. వినియోగదారుడు స్వయంగా ఏజన్సీకి వెళ్లి తీసుకుంటే క్యాష్ అండ్ క్యారీ కింద ధరలో రాయితీ ఇవ్వాల్సి ఉంటుంది. సిలిండర్ ధరలో రూ.18 తగ్గించాలి. కానీ, అలాంటి నిబంధనలేవీ పాటించకుండా ఏజన్సీలు ఘరానా మోసానికి పాల్పడుతున్నాయి. నేరుగా తీసుకుంటే ఇంత ధర, ఇంటికి చేరిస్తే ఇంత ధర అనే బోర్డులు కూడా ఏజన్సీలు ఏర్పాటు చేయాలి. అలాంటివి ఎక్కడా కనిపించడంలేదు. సిలిండర్ సరఫరా చేసిన తరువాత దానికి సంబంధించిన రసీదును వినియోగదారులకు ఇవ్వాలి. రసీదుపై ఎంత ధర ఉంటే అంతే మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. కానీ అలా జరగడం లేదు. సిలిండర్ సరఫరా చేసే ముందు బరువును లెక్కించాలి. బరువు తూగే యంత్రాన్ని సరఫరాదారులు నిరంతరం వెంటనే ఉంచుకోవాలి. వినియోగదారుడు తీసుకోవడానికి అంగీకరించిన తరువాతే సిలిండర్ పంపిణీ చేయాలి. సిలిండర్ పంపిణీ తరువాత దాన్ని రెగ్యులేటర్కు బిగించి డెలివరీ బారు పరీక్షించాలి. ఈ విధంగా పనిచేస్తున్న ఏజన్సీలు రాష్ట్రంలో కనుచూపుమేరలో కూడా కనిపించవు.
బ్లాక్ మార్కెట్కు..
గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వినియోగదారుడికి తెలియకుండానే సిలిండర్లను బ్లాక్మార్కెట్కు తరలిస్తుంటారనే విమర్శలు ఉన్నాయి. ఫోన్ నెంబర్ ఆధారంగా ఆన్లైన్ ప్రక్రియ జరుగుతుంది. ప్రతి వినియోగదారుడు ఏడాదికి 12 సిలిండర్లు తీసుకోవాలి. ఎవరైతే ఈ సదుపాయాన్ని పూర్తిస్థాయిలో వినియోగించకుండా ఉంటారో అలాంటి వారి పేరుపై ఆన్లైన్లో బుక్ చేసి బ్లాక్మార్కెట్కు తరలి స్తారు. నగదు బదిలీ అమలవుతున్నా బ్లాక్మార్కెట్ ఆగడంలేదన్న ఆరోపణలు న్నాయి. సిలిండర్ అయిపోయినప్పుడు ఏజన్సీకి వెళ్తే 'మీ కోటా పూర్తయింది' అంటూ నిర్వాహకులు సమాధానం ఇస్తున్నారని వినియోగదారులు చెబుతు న్నారు. గ్యాస్ బుక్ చేసిన వినియోగదారుడికి సిలిండర్ ఎప్పుడు, ఏ సమయానికి ఇంటికి వస్తోందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. గ్యాస్ వచ్చినప్పుడు ఇంట్లో వినియోగదారుడు లేకపోతే 'డోర్లాక్' అంటూ సిలిండర్ను వెనక్కి పంపిస్తూ బుకింగ్ అక్కడితో రద్దు చేస్తున్నారు. సిలిండర్ బుకింగ్ మొదలుకొని డోర్ డెలవరీ వరకు వినియోగదారులకు పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకువచ్చి మెరుగైన సేవలందించాల్సిన ఉండగా రద్దు చేస్తుండటం విశేషం. అదేమని అడిగితే.. ఇంట్లో లేరని, 48 గంటల గడువు ముగిస్తే డోర్ ల్యాక్ అని చూపించాల్సిందేనని డెలివరీ బార్సు చెబుతుండగా.. సమాచారం పంపించే వ్యవస్థ తమ వద్ద లేదంటూ గ్యాస్ ఎజెన్సీలు బుకాయిస్తున్నాయి.
సిలిండర్ బరువులోనూ అక్రమాలే
ఇదిలా ఉండగా, సిలిండర్ సరఫరాతోపాటు వాటి బరువులోనూ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు లేకపోలేదు. సాధారణంగా సిలిండర్ 14.5 కిలోల బరువు ఉండాలి. అయితే ఏజన్సీలు 13 కిలోల బరువున్న సిలిండర్నే సరఫరా చేస్తుండటం గమనార్హం. ఇదే విషయమై దిల్సుక్నగర్లోని ఓ ఏజన్సీని 'నవతెలంగాణ' సంప్రదించగా ఆయిల్ కంపెనీలు పంపిణీ చేసిన సిలిండర్లను తాము సరఫరా చేస్తున్నామని చెప్పారు. అయితే, నిర్వాహకులు ఖాళీ సిలిండర్లలోకి రీఫిల్లింగ్ చేస్తూ కోతకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.