Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరంలో ఉన్నత విద్యలో చేరేందుకు నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షలు (సెట్స్)-2018 రాతపరీక్షల తేదీలు మంగళవారం ఖరారయ్యే అవకాశముంది. ప్రవేశ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్సీహెచ్ఈ) కార్యాలయంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మెన్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మెన్లు ఆర్ లింబాద్రి, వి వెంకటరమణ, కార్యదర్శి ఎన్ శ్రీనివాస్రావుతోపాటు ప్రవేశ పరీక్షల పాత కన్వీనర్లు, తెలంగాణ స్టేట్ టెక్నాలాజికల్ సర్వీసెస్ (టీఎస్టీఎస్) అధికారులు హాజరవుతారు.
ఈ సమావేశంలో టీఎస్టీఎస్తో ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఉన్నత విద్యామండలి, ఒప్పందం కుదుర్చుకోనుంది. ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్, లాసెట్, ఎడ్సెట్, ఐసెట్లను ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) మాత్రం ఆఫ్లైన్లో నిర్వహిస్తారు. ఎంసెట్, ఈసెట్ను జేఎన్టీయూహెచ్, ఎడ్సెట్, పీజీఈసెట్, లాసెట్ను ఓయూ, ఐసెట్ను కేయూ, పీఈసెట్ను ఎంజీయూలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించే అవకాశముంది.