Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భిక్కనూరు/దుబ్బాక/ రేగోడ్
అప్పులకు తాళలేక సోమవారం మరో ముగ్గురు రైతులు తనువు చాలించారు. పంటల దిగుబడి లేక, చేతికందిన పంటకు ధర లేక.. కండ్ల ముందు అప్పులు కదలాడుతుంటే.. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బాగిర్థిపల్లి గ్రామానికి చెందిన మామిడి శ్రీశైలం(43) తన నాలుగెకరాల భూమిలో వ్యవసాయం చేశాడు. గతంలో రూ. రెండు లక్షలు ఖర్చు చేసి రెండు బోర్లు వేసినా నీళ్లు పడలేదు. ఆదివారం మళ్లీ బోరు వేస్తే చుక్క నీరు రాలేదు. పంట కోసం, బోర్ల కోసం చేసిన రూ.2లకల అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం రాత్రి తన పూరిగుడిసెలో ఉరేసుకున్నాడు. సోమవారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని పెద్దగుండవెళ్లి గ్రామానికి చెందిన కుమ్మరి ప్రవీణ్ (27)కు మూడెకరాల భూమి ఉంది. ఈ ఏడాది అప్పు చేసి మూడు బోర్లు తవ్వించాడు. కానీ చుక్క నీరు రాలేదు. సాగు చేసిన పత్తి చేనూ దిగుబడి సరిగా రాలేదు. పంటసాగు, బోర్లకు కలిపి అప్పు రూ. 4 లక్షల వరకు అయింది. ఇటీవల అప్పుల వారి ఒత్తిడీ పెరిగింది. ఈ విషయమై కుటుం బ సభ్యులతో రోజూ చర్చిస్తూ బాధపడేవాడు. ఈ క్రమంలో సోమవారం బావి వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానిక రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. రైతుకు భార్య వసంత, కొడుకు, కుమార్తె ఉన్నారు.
మెదక్ జిల్లా రేగోడ్ మండల పరిధిలోని మర్పల్లి గ్రామానికి చెందిన రజనీ కాంత్(32)కు రెండెకరాల భూమి ఉంది. పంట సాగు, కుటుంబ పోషణ కోసం నారాయణఖేడ్ బ్యాంకులో అప్పు చేశాడు. ఇటీవల పంట సాగుకు మళ్లీ అప్పు తెచ్చాడు. కానీ, పంట దిగుబడి సరిగా రాక, వచ్చిన పంటకూ మద్దతు ధర అందక అప్పులు తీర్చేదారి కనిపించలేదు. దీంతో ఆదివారం సాయంత్రం బావి దగ్గర పురుగుల మందు తాగాడు. పక్క రైతులు గమనించి నారాయ ణఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి అదే రాత్రి మృతిచెందాడు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.