Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా ప్రపంచ మహాసభలు: రాష్ట్ర దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వం, న్యాయ పరిపాలనలో తెలుగు భాష కీలకంగా మారాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, న్యాయశాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో 'న్యాయ పరిపాలనా రంగంలో తెలుగు' అనే అంశంపై సదస్సు జరిగింది. దీనికి కేంద్ర సమాచార చీఫ్ కమిషనర్ మాడభూషి శ్రీధర్ అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ..1981లో మలేసియాలో తెలుగు మహాసభలు జరిగాయని, అప్పటి ముఖ్యమంత్రి టి. అంజయ్యతో పాటు తానూ ఆ సభలకు వెళ్లినట్టు వివరించారు. ఆ తరువాత మళ్లీ ఇప్పుడే జరుగుతున్నాయన్నారు. తెలుగుకు ప్రాధాన్యత పెరుగుతున్న దన్నారు. ప్రజల భాషలో పరిపాలన సాగాలని ఆకాంక్షించారు. ఈ సదస్సులో వచ్చిన సలహాలు, సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని ప్రకటించారు. తెలుగుకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. హైకోర్టు తీర్పు కాపీలు తెలుగులో ఇచ్చేలా చూడాలని కోరారు. మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ తెలుగు భాష కోసం ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయడం లేదన్నారు. తెలుగు మనిషి బతుకు సమస్య అని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో కన్నడం, తమిళనాడులో తమిళం కీలకంగా ఉందన్నారు. ఉత్తర భారతంలో హిందీలో ఆర్టీఐ దరఖాస్తులు వస్తాయని, వాటికి సమాధానం తాము కచ్చితంగా హిందీలోనే ఇస్తామని చెప్పారు. దేశంలో మూడు కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయని వివరించారు. సాక్ష్యం చెప్పడానికే రెండు, మూడు సార్లు సమయం తీసుకుంటారన్నారు. కోర్టుల్లో తీర్పులు ఇంగ్లీషులో ఇస్తారన్నారు. చట్టం ఏమిటో తెలియకుండా చట్టబద్ధంగా నడవాలని చెబుతారని, అదెలా సాధ్యమని ప్రశ్నించారు. తెలుగు సాధారణ ప్రజల హక్కుగా అభిప్రాయపడ్డారు. టీఎస్పీఎస్సీ సభ్యులు, మాజీ హైకోర్టు న్యాయమూర్తి మంగారి న్యాయమూర్తి మాట్లాడుతూ 1956లో భాషాప్రయుక్త రాష్ట్రంగా ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిందన్నారు. అయితే తెలుగు భాష అభివృద్ధి జరగలేదని వివరించారు. అసెంబ్లీలో తెలుగు మాట్లాడతారని, ప్రోసీడింగ్స్ మాత్రం ఆంగ్లంలో సాగుతాయని అన్నారు. యాస గోసను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. భాష అదృశ్యమయ్యే ప్రమాదమేర్పడిందన్నారు. తాను న్యాయ మూర్తిగా ఉన్నప్పుడు తెలుగులో తీర్పు ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పి.పార్థసారధి మాట్లాడుతూ తెలుగును కచ్చితంగా అమలుచేయాలంటే ఆజ్ఞ సరిపోదని, మహా ఆజ్ఞ కావాలని అన్నారు. అధికారాల్లేని అధికార భాషా సంఘాలు వచ్చాయన్నారు. ఉన్నతాధికారుల ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా స్పందన వస్తున్నదన్నారు. ఎన్టీఆర్కాలంలో కొంత ప్రయత్నం చేసినా, అది ముందుకు సాగలేదదన్నారు. ప్రమోషన్లు, ప్రోత్సాహాకాలు, బహుమతులు, కఠిన నిబంధనలు ఉండాలని, తెలుగు నేర్చుకోవడానికి ప్రత్యేక కోర్సులు ఉండాలని చెప్పారు. హౌసింగ్ బోర్డు చైర్మన్ బి.మల్లారెడ్డి మాట్లాడుతూ తాను 30 ఏండ్లుగా తెలుగులో సంతకం పెడుతున్నానని చెప్పారు. కోసావో దేశానికి ఐక్యరాజ్యసమితి విధులకు వెళ్లినప్పుడు అక్కడ స్థానిక భాషపై మమకారాన్ని గ్రహించానన్నారు. స్థానిక భాష కాకుండా మరేదైనా భాష మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఉద్యోగులైతే ఉద్యోగాల నుంచి తొలగిస్తారని, ప్రజా ప్రతినిధులైతే వారు తమ పదవులను కోత్పోతారని చెప్పారు. ఈ సందర్భంగా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ జి చంద్రయ్యతోపాటు ఇతరులను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ న్యాయమూర్తి నారాయణ, సాహితీవేత్తలు అమర రంగేశ్వర్రావు, ఎం. వెంకటేశ్వర్రావు, కె.మురళీమోహన్, రాధాకృష్ణ మోహన్, నిజామొద్దీన్, కె.ఎన్ అనంతాచారి, స్వాతి తదితరులు పాల్గొన్నారు.