Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ రోజు రావాలన్నదే నా ఆకాంక్ష
- తెలంగాణ సాహిత్యంపై లోతైన పరిశోధన జరగాలి: తెలుగు మహాసభల్లో
స్పీకర్ మధుసూదనాచారి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశభాషలందు తెలుగులెస్స అని శ్రీకృష్ణదేవరాయలు అన్నారని, ఏదో ఒకరోజు విశ్వభాషలందు తెలుగులెస్స కావాలన్నదే తన ఆకాంక్ష అని అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి చెప్పారు. తెలుగును విశ్వభాషగా చేసేందుకు అందరం కృషి చేయాలన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా సోమవారం హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణలో సాహితీ విమర్శ-పరిశోధన అంశంపై కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ మహాసభలు విభిన్న కార్యక్రమాలతో ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాయని అన్నారు. వందకుపైగా దేశాల్లోని తెలుగువారు ఆసక్తిగా గమనిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో సాహిత్యంపై లోతైన పరిశోధన జరగాలని సూచించారు. ఇప్పటికి వెలుగులోకి వచ్చిన, వస్తున్న శాసనాల ద్వారా ఆధారాలను బట్టి తెలంగాణలో గొప్ప సాహిత్య శోధన జరిగిందని తెలుస్తోందన్నారు. కందపద్యం తెలుగులో మొదట తెలంగాణలో రాయబడిందని గుర్తు చేశారు. బతుకమ్మ వంటి పండుగ ప్రపంచానికే గొప్ప సమ్మేళనమని అన్నారు.
తెలుగు ప్రజలు మంచికి సాగిలపడతారని, ధిక్కారాన్ని సహించబోరని చెప్పారు. కాకతీయుల సామ్రాజ్యం గురించి పుస్తకం రాస్తానని అన్నారు. కసి, కృషి కలిస్తే సీఎం కేసీఆర్ అని అభివర్ణించారు. క్రియేటర్, ఇమిటేటర్, స్పెక్టేటర్, ఫ్రస్టేటర్ అని జాతుల్లో నాలుగు రకాలుంటాయని చెప్పారు. అనేక రకాల కారణాల వల్ల ఫ్రస్టేటర్స్గా మారుతారని అన్నారు. తెలంగాణ వారు క్రియేటర్లుగా మారాలని ఆకాంక్షించారు. అసాధ్యాలను సాధ్యం సాకారం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ను విశ్వనగరం, తెలుగు భాషను విశ్వభాషగా చేయడమే లక్ష్యమని చెప్పారు. గౌరవ అతిధి రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ సాహిత్య విమర్శకు పరిమితులు, పరిధులుంటాయని అన్నారు. ఉద్యమ నేపథ్యంలో తెలంగాణలో విస్తృతంగా సాహిత్యం వెలుగులోకి వచ్చిందన్నారు. ప్రాంతంతోపాటు భావజాలం సాహిత్యంపై ప్రభావం చూపుతుందని చెప్పారు. సంప్రదాయం, ఆధునిక సాహిత్యం తెలంగాణలో ఉన్నాయని అన్నారు.
సాహిత్య విమర్శకులు ఎస్వీ రామారావు మాట్లాడుతూ విమర్శ లేకపోతే సాహిత్యానికి ప్రకాశం లేదన్నారు. ప్రొఫెసర్ మృణాళిని మాట్లాడుతూ పరిశోధనలకు పెద్దపీట వేయాలని కోరారు. విశ్వవిద్యాలయాల్లో జీతాలకే కాకుండా పరిశోధనలకూ ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత పండితుడు కపిలవాయి లింగమూర్తి, సాహిత్య విమర్శకులు ఎస్వీ రామారావులను సత్కరించారు. వనబండ్ల సుబ్బయ్య రాసిన 'తెలంగాణ తేనెపలుకు', గుడిపల్లి నిరంజన్ రాసిన 'బహుజన కవిత్వం ఎరుక', బన్న ఐలయ్య రాసిన 'తెలంగాణ కథ-పరామర్శ', పెరుమాళ్ల రాజరత్నం రాసిన 'శతకాలు', సృజన్రెడ్డి, కరుణనాయుడు, ఆదిత్య అల్లాడి రాసిన 'బ్రిటీష్ గ్రంథాలయంలో తెలుగు పుస్తకాల పట్టిక', మారోజు దేవేంద్ర రాసిన 'సాహిత్యానుశీలన', కూరెళ్ల విఠలాచారి రాసిన 'దొందూదొందే' పుస్తకాలను ఆవిష్కరించారు. తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లక్ష్మణ చక్రవర్తి, బాల శ్రీనివాసమూర్తి, తంగెడ కిషన్రావు, బన్న ఐలయ్య వివిధ అంశాలపై ప్రసంగించారు. సాహిత్య అకాడమి చైర్మెన్ నందిని సిధారెడ్డి, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ, ప్రవీణ్కుమార్, రాజేశ్వరరావు, రాజచంద్రిక తదితరులు పాల్గొన్నారు.