Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీడీఓ కార్యాలయం ముందు బైటాయింపు
- పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంటానని హెచ్చరిక
నవతెలంగాణ-పెద్దశంకరంపేట
'పెద్దశంకరంపేటలోని పలుకాలనీల్లో 2016 వేసవిలో వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేశాం. అధికారులు ఇప్పటి దాకా బిల్లులు చెల్లించలేదు. ఇప్పటికైనా చెల్లించాలి. లేకుంటే పెట్రోల్ పోసుకొని నిప్పంటించకుంటాను' అంటూ మెదక్ జిల్లా పెద్దశంకరంపేట ఎంపీటీసీ విగ్రాం సుభాష్గౌడ్ పెట్రోల్తో ఎంపీడీవో కార్యాలయం ఎదుట సోమవారం బైటాయించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడుతూ 2016 మార్చి నుంచి జూన్ వరకు ప్రజలకు తాగునీరు అందించేందుకు ట్యాంకర్ల ద్వారా 850 ట్రిప్పుల నీటిని సరఫరా చేశానని తెలిపారు. అందులో జూన్ నెలకు సంబంధించి 117 ట్రిప్పుల బిల్లులు మాత్రమే విడుదల చేశారని, మిగతా నెలల బిల్లులు చెల్లించలేదని తెలిపారు. అధికారులను అడిగితే మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన బిల్లులు అగ్రిమెంట్ చేయించుకోలేదని, అందుకే ఆపేశామని చెబుతున్నారన్నారు. తనకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను కోరారు. ఈ విషయాన్ని పలుమార్లు ఎమ్మెల్యే భూపాల్రెడ్డికి విన్నవించానన్నారు. తనకు బిల్లులు రాకుండా సర్పంచ్ అడ్డుకుంటున్నాడని ఆయన ఆరోపించారు. ఈ విషయమై ఎంపీడీవో మాట్లాడుతూ బిల్లులు చెల్లింపులో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఆన్లైన్ చేయకపోవడం వల్ల నిధులు మంజూరు కాలేదన్నారు. ఉన్నతాధికారులకు నివేదిస్తున్నట్టు చెప్పారు. చివరికి ఎంపీపీ రాయిని సంగమేశ్వర్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు విజయరామరావు, రైతు సమితి అధ్యక్షులు సురేశ్గౌడ్ ఎంపీటీసీని సముదాయించారు. బిల్లులు మంజూరయ్యే విధంగా ఎమ్మెల్యేతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీనిచ్చారు. దీంతో సుభాష్గౌడ్ ఆందోళనను విరమించారు.