Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు రైల్వే జీఎం ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సరుకు రవాణాలో డిమాండ్కు అనుగుణంగా సిమెంట్, ఇసుక, సున్నపు రాయి, బొగ్గు తదితర ఖనిజ రవాణా, నిత్యావసర సరుకుల ఎగుమతికి అవసరమైన వ్యాగన్లను అందుబాటులో ఉంచాలని, ఆయా సమయాల్లో ఇంజన్లు, వ్యాగన్ల కొరత రాకుండా చూసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ ఉన్నతాధికారులను ఆదేశించారు. సరుకు రవాణాలతో పాటు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు నిరంతరం పట్టాలపై పరుగులు పెడుతాయి కాబట్టి ఆయా రైళ్లు పట్టాలు తప్పకుండా, సిగలింగ్ వైఫల్యాలు లేకుండా, కాపలాలేని లెవెల్ క్రాసింగ్ల వద్ద ఎలాంటి ఘటనలు జరుగకుండా, లోకో వైఫల్యాలు జరుగకుండా అనుక్షణం నిఘా పెట్టాలని ఆదేశించారు. సోమవారం సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో రైల్వేలోని వివిధ విభాగాల ఉననతాధికారులు, అధికారులతో జీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాలం ముగిసింది కాబట్టి ఇనుము, రాగి, ఇత్తడి తదితర ఖనిజం, సిమెంట్, బొగ్గు, సున్నపురాయి, నిత్యావసర సరుకులను సరఫరా చేసేందుకు వ్యాపారులు సిద్ధంగా ఉంటారన్నారు. సీజన్ ప్రారంభం అయ్యింది కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సీజన్ ప్రారంభమైన దృష్ట్యా బ్రాంచ్ ఆఫీసర్లు, జోనల్ ఆఫీసర్లు సమన్వయంతో పని చేసి ఇంజన్ల కొరత, వ్యాగన్ల కొతర రాకుండా సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. అవసరమైతే రిటైర్డ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలో పునర్ నియామకం చేసుకుని అవసరమైన కమర్షియల్ విభాగంలో టికెట్ తనిఖీ కోసం వినియోగించుకోవాలన్నారు. రైల్వేలో భద్రతను భంగపరిచే కారణాల్లో ముఖ్యంగా రైలు పట్టాలు తప్పడం, సిగల్ వైఫల్యాలు, కాపలాలేని లెవెల్ క్రాసింగ్ల వద్ద సంఘటనలు, లోకో వైఫల్యాలు తదితర విషయాలపై జీఎం అధికారులతో చర్చించారు. పెండింగ్ ప్రాజెక్టులు, ప్రయాణీకులకు సౌకర్యాలు, వంతెనల నిర్మాణం తదితర అంశాలపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో రైల్వే ఉన్నతాధికారులతో పాటు సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్, నాందేడ్ డివిజన్ల డీఆర్ఎంలు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.