Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం నుంచి అధికారిక సమాచారం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి లభించింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అధికారిక సమాచారాన్ని సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ఈ నెల 5న ఢిల్లీలో సమావేశమైన పర్యావరణ నిపుణుల కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయి పర్యావరణ అనుమతి ఇవ్వటానికి అంగీకరించిందని కేంద్రం తెలిపింది. ప్రాజెక్టు అనుమతుల్లో పర్యావరణ అనుమతి ఎంతో కీలకం కావటంతో ఇది రావటంతో నిర్మాణ పరంగా అన్ని అవరోధాలు తొలగిపోయాయని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఇటీవల అటవీ అనుమతి లభించింది. కేంద్ర జల సంఘం నుంచి నీటి లభ్యతకు సంబంధించిన అనుమతితో పాటూ అంతరాష్ట్ర అనుమతి ఇటీవల ఇవ్వగా భూగర్భ జల అనుమతి, కనస్ట్రక్షన్ మిషినరీ డైరెక్టరేట్ అనుమతి కూడా లభించాయి. వివిధ డైరెక్టరేట్ల నుంచి రావాల్సిన ఇతర అనుమతులు కూడా మరో నెలరోజుల్లో వస్తాయని నీటిపారుదల శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం తర్వాత పరీవాహక ప్రాంతంలో పర్యావరణాన్ని కాపాడటానికి సూక్ష్మ ప్రణాళికను తయారు చేయాలని, జీవవైవిధ్యాన్ని కాపాడాలని, భూనిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం అందించాలని, వారి నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని పర్యావరణ అనుమతుల నిబంధనల్లో కేంద్రం పేర్కొన్నది. నష్టపరిహారం పూర్తిగా చెల్లించటం, పునరావాస కార్యక్రమాల్ని అమలు చేసిన తర్వాతే నిర్వాసితులను వారి ప్రదేశం నుంచి ఖాళీ చేయించాలనే నిబంధన కూడా అనుమతుల పత్రంలో పొందుపరచింది. 180 టీఎంసీల గోదావరి నీటిని వినియోగించుకుని దాదాపు 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించటం, మరో 18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించటానికి ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నట్టు కేంద్ర పర్యావరణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనల్లో తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 80,499 కోట్లు ఖర్చవుతాయని పేర్కొన్నది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ నిర్వహణ , పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలు తయారు చేయటానికి 2017 మార్చి 31 న కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ సూత్రప్రాయమైన అంగీకారం తెలిపింది. ఈ నివేదికలు తయారు చేయటంలో భాగంగా రాష్ట్రంలోని 15 ప్రాంతాల్లోనూ, మహారాష్ట్రలోని సిరొంచ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సేకరిస్తున్న అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా 5,333 హెక్టార్లలో ప్రత్యామ్నాయ అడవి పెంచటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వన్యప్రాణుల సంరక్షణ కోసం తీసుకునే చర్యల గురించి కూడా వివరించింది. 110 కిలోమీటర్ల దూరం కాల్వల వద్ద 'గ్రీన్ బెల్ట్' నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. నదీ పరీవాహక ప్రాంతంతో పాటూ రిజర్వాయర్లలో రూ. 485 కోట్లతో వివిధ రకాల చేపలు పెంచే ప్రణాళికను కూడా కేంద్రానికి పంపించింది.