Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సభలపై ఆ రెండూ ఆధిపత్యం చెలాయిస్తున్నారు
- సీఎం పద్యం పాడితే జనానికేం ఒరుగుతుంది?
- 'పత్రికలు-ప్రసార మాధ్యమాల్లో తెలుగు' సమావేశంలో ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీనివాస్
- భాషా శాస్త్రవేత్తల భాగస్వామ్యం ఎక్కడీ
- ఉద్వేగపూరిత సభలు కాదు.. శాస్త్రీయమైన పరిష్కారాలు చూపాలన్న సీనియర్ పాత్రికేయులు
ప్రపంచ తెలుగు మహాసభలంటే కేవలం పద్యాలు, అవధానాలు కాదని ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ అన్నారు. ఈ రెండూ ప్రస్తుత మహాసభలపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయని వ్యాఖ్యానించారు. భాషంటే ప్రజలు, వారి జీవన సరళి అని తెలిపారు. ఈ రెండింటితోనే భాష ఎప్పుడూ ముడిపడి ఉంటుందని, తద్వారానే అది మనుగడ సాధిస్తుందని వ్యాఖ్యానించారు.
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా సోమవారం రవీంద్రభారతిలో 'పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో తెలుగు' అనే అంశంపై సంపాదకులతో చర్చాగోష్టి నిర్వహించారు. మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉత్పత్తితో ఎలాంటి సంబంధమూ లేని కొంతమంది అకాడమీల్లో కూర్చుని తెలుగు పదాలను, పదకోశాలను తయారు చేస్తున్నారని చెప్పారు. అది వారి భాషే తప్ప జనం భాష కాదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పద్యం పాడటం సంతోషదాయకమేనని.. అయితే దాని వల్ల సామాన్య జనానికి ఏం ఒరిగిందని ప్రశ్నించారు. 'మన పాలకులకు కవులు, కళాకారులను, భాషా వేత్తలను పోషించటమంటే ఇష్టం. కానీ భాషకు కావాల్సింది పోషించటం కాదు.. దాన్ని పరిపుష్టం చేయటం...' అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తెలుగును బతికించాలంటే కావాల్సింది ఉద్వేగపూరితమైన సభలు కాదు.. దీర్ఘకాలికమైన, శాస్త్రీయమైన పరిష్కారాలని స్పష్టం చేశారు. సభలు మనలో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపుతాయ నటంలో ఎలాంటి సందేహం లేదు, కానీ అదే సమయంలో మహాసభలకు అయిన ఖర్చులో పదిశాతాన్ని వెచ్చిస్తే.. తెలుగును బ్రహ్మాండంగా ఉద్ధరించొచ్చని తెలిపారు. ఏ పని చేసే వాడిని ఆ పని చేయనివ్వాలని సూచించారు. అంతేతప్ప ప్రాజెక్టుల్ని మేమే డిజైన్ చేస్తాం, ఐటీని మేమే నిర్దేశిస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. వివిధ అకాడమీల పదవుల్లో రాజకీయ నాయకుల్ని కాకుండా భాషా శాస్త్రవేత్తల్ని కూర్చోబెట్టాలని సూచించారు. ఇలా శ్రీనివాస్ మాట్లాడుతున్నంత సేపు ఆ ప్రాంగణమంతా చప్పట్లతో మార్మోగింది. సీనియర్ పాత్రికేయులు ఉడయవర్లు మాట్లా డుతూ.. కొత్త పదాల సృష్టి పేరిట కొన్ని పత్రికలు తాము రూపొందించిన పదాలను జనం నెత్తిన రుద్దుతున్నాయని చెప్పారు. బాహ్య వలయ రహదారి, గుత్తేదారు, గరిష్ట, కనిష్ట, శూన్యగంట తదితర పదాలను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. ఇవి జనానికి అర్థంగా కపోగా వారిని మరింత గందరగోళంలో పడేస్తాయని చెప్పా రు. ఇతర భాషల నుంచి వచ్చిన పదాలైనా సరే.. అవి ప్రజ లకు అర్థమయ్యేవిగా, వినసొంపుగా ఉంటే వాడుకోవచ్చని తెలిపారు. అంతేతప్ప ఇలాంటి అర్థంపర్థం లేని పదాలను రుద్దటం సరికాదని చెప్పారు. ఇలాంటి సమస్యలన్నింటి పరిష్కారానికి భాషావేత్తలతో కమిటీ వేయాలని సూచించారు. తెలుగు, మీడియా అకాడమీలు ఈ అంశంలో క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. కేంద్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ.. అన్ని విషయాల (సబ్జెక్టులు)ను తెలుగులో బోధించే బడులు రానంతవరకూ మన మాతృభాష పరిస్థితి మెరుగుపడదని చెప్పారు. ప్రస్తుతం తెలుగును కాపాడు తున్నది పత్రికలు.. దాన్ని బతికిస్తున్నది విలేకరులేనని తెలిపారు. భాషోద్ధరణకు సాహితీవేత్తలు, భాషా వేత్తలు వ్యక్తులుగా అనేక సలహాలనిస్తున్నారు.. వీటన్నింటినీ కలిపి వ్యవస్థీకృతం చేసినప్పుడే భాష నిలబడుతుందని అన్నారు. ఆర్భాటంగా, అట్టహాసంగా సభలు నిర్వహిస్తున్న ప్రభుత్వం వద్ద.. తెలుగును రక్షించేందుకు అవసరమైన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఉందా? అని ప్రశ్నించారు. ఈ ప్రణాళిక లేకపోతే తెలుగును బతికించటం సాధ్యం కాదని చెప్పారు. సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పల్లె ప్రజలు, సాధారణ జనం వాడే సహజమైన పదాలను వాడుకలోకి తీసుకురావటానికి గట్టి ప్రయత్నం, అధ్యయనం జరగాలని అన్నారు. గ్రామీణ విలేకరులు రాసే వార్తల ఆధారంగా పల్లెల్లో జనం నాలుకల మీద దొర్లే అసలు సిసలు తెలుగు పదాలను ఒడిసి పట్టుకోవాలని సూచించారు. మీడియా అకాడమీ ఇందులో కీలకపాత్ర పోషించాలని సూచించారు. కార్యక్రమంలో లోక్సభలో టీఆర్ఎస్ నేత జితేందర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, సీనియర్ పాత్రికేయులు జీఎస్ వరదాచారి, నమస్తే తెలంగాణ సంపాదకులు కట్టా శేఖర్రెడ్డి, సీఎం పీఆర్వో వనం జ్వాలా నర్సింహారావు, ఆకాశవాణి ప్రతినిధి నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.