Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపముఖ్యమంత్రి కడియం విమర్శలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
విద్యాభివృద్ధిపై కేంద్ర సర్కారుకు చిత్తశుద్ధిలేదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, బాలికల విద్యాభివృద్ధి సబ్కమిటీ చైర్మెన్ కడియం శ్రీహరి విమర్శలు చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో రెండు రోజుల పాటు 65వ కేంద్ర విద్యా సలహా సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశాలకు కడియం శ్రీహరి హాజరయ్యారు. కాగా సలహా సంఘం సమావేశాలను తూతూమంత్రంగా నిర్వహించారని కడియం పెదవి విరిచారు. ప్రాథమిక, ఉన్నత విద్యా ప్రమాణాల అభివృద్ధిపై ఉపసంఘాలు ఇచ్చిన ప్రతిపాదనలపై కేంద్రం ఎలాంటి నిర్ణయమూ తీసుకోవడం లేదని విమర్శించారు. విద్యాప్రమాణాలు పెంచేందుకు కేంద్రం ఏర్పాటు చేస్తున్న కేబ్ సమావేశాలు ఉపయోగపడటం లేదని అన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించడం, విద్యాప్రమాణాలు పెంచడంపై కేంద్రం చర్యలు చేపట్టడం లేదని అన్నారు. పైగా బాలికా విద్యాభివృద్ధిపై సబ్కమిటీ చైర్మెన్గా తాను సమర్పించిన మధ్యంతర నివేదికపై సైతం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు. ఫిబ్రవరి చివరినాటికి పూర్తి నివేదికను అందజేస్తామని తెలిపారు. రెండు రోజుల పాటు జరిగిన సలహా సంఘం సమావేశాల్లో భారత్లో బాలికల విద్యా నిష్పత్తిపై కడియం శ్రీహరి ప్రజంటేషన్ ఇచ్చారు. అయితే విభజన చట్టంలో పొందుపరిచిన గిరిజన యూనివర్సిటీలో ఏర్పాటులో జాప్యం జరుగుతోందని చెప్పారు. పైగా తెలంగాణపై కేంద్రం పక్షపాత ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. గడిచిన మూడున్నరేండ్లలో తెలంగాణకు ఒక్క విద్యాసంస్థనూ కేటాయించలేదని అన్నారు.