Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25న హైదరాబాద్లో 'బీఎల్ఎఫ్' ఆవిర్భావ సభ
- హాజరుకానున్న సీతారాం ఏచూరి, ప్రకాష్ అంబేద్కర్, గౌస్, గద్దర్
- విలేకరుల సమావేశంలో సూర్య ప్రకాష్
నవతెలంగాణ- ఖమ్మం/విలేకరులు
రాయితీలు కాదు.. రాజ్యాధికారమే ధ్యేయంగా బీఎల్ఎఫ్తో ముందుకు పోతామని నల్లా సూర్యప్రకాష్ అన్నారు. మంగళవారం ఖమ్మం సుందరయ్య భవన్లో, కొత్తగూడెం, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్ జిల్లాల్లో విలేకరుల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా ఫ్రంట్ ఆవిర్భావ పోస్టర్ను ఆవిష్కరించారు. ఖమ్మం, కొత్తగూడెంలో సూర్యప్రకాష్ మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా 28పార్టీలతో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్)ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. జనాభా 50శాతం ఉన్న మహిళలకు కేసీఆర్ మంత్రివర్గంలో చోటులేకుండా పోయిందన్నారు. సమస్యలపై పోరాడుతున్న కమ్యూనిస్టులను అణచివేస్తురని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 40వేల ఓట్లు ఉన్న వెలమ సామాజికవర్గానికి సీఎం, నాలుగు మంత్రి పదవులా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనే సాగుతోందని విమర్శించారు. కాంగ్రెస్వి సైతం అన్ని బూటకపు వాగ్దానాలే అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక విలవిల్లాడుతున్నారన్నారు. 24గంటల విద్యుత్ ప్రజలపై అధిక భారం వేసేందుకే అన్నారు. విద్య, వైద్యం అంతా వ్యాపారమయమే అయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు విలువలతో కూడిన రాజకీయాలకు పేరున్న ఖమ్మం జిల్లాలోనూ కలుషితమ య్యాయని అన్నారు. ఈ వ్యవస్థను రూపుమాపేందుకే ఈనెల 25న హైదరాబాద్లో 28పార్టీలతో 'బీఎల్ఎఫ్' ఆవిర్బావ సభ జరగనుందని తెలిపారు. దీనికి సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సామాజిక ఉద్యమ జాతీయ నేత, అంబేద్కర్ మనువడు ప్రకాష్ అంబేద్కర్, ఎంసీపీఐ(యూ) జాతీయ కార్యదర్శి ఎండీ.గౌస్, ప్రజాగాయకులు గద్దర్, సామాజిక ఉద్యమ నాయకులు కంచ ఐలయ్య, ఎంబీటీ రాష్ట్ర అధ్యక్షులు మజీదుల్లా ఖాన్ హాజరవుతారని అన్నారు.
మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. మూడో ప్రత్యామ్నాయం కోసమే ప్రజల్లోకి వెళ్తున్నామని అన్నారు. దోపిడీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు మాట్లాడుతూ.. బీఎల్ఎఫ్తో నూతన అధ్యాయానికి తెరతీశామన్నారు. విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బత్తుల హైమావతి, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
18న లెఫ్ట్ఫ్రంట్ జిల్లా సన్నాహక సమావేశం
నిజామాబాద్ నగరంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో బీఎల్ఎఫ్పై వామపక్ష పార్టీల నాయకులు సమావేశమాయ్యరు. ఈనెల 18న నాందేవాడలో బహుజన లెఫ్ట్ఫ్రంట్ జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్టు ప్రకటించారు.
టీఆర్ఎస్, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీఎల్ఎఫ్
ఆప్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు
రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్ఎఫ్) నిలుస్తుందని ఆమాద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫిలింభవన్లో టీ-మాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 'తెలంగాణ సామాజిక న్యాయం- సమగ్రాభివృద్ధి' కోసం లెఫ్ట్ఫ్రంట్ ఆవిర్భవించను న్నట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీవర్గాల అభివృద్ధి, రాజకీయ ఎదుగుదలకు ఇది వేదికగా నిలువనుందన్నారు.
ఫ్రంట్ ఆవిర్భావ పోస్టర్ ఆవిష్కరణ
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బీఎల్ఎఫ్ (బహుజన లెఫ్ట్ ఫ్రంట్) ఆవిర్భావ సభ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.రాములు, నవతెలంగాణ ప్రజాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిరి యాదవ్ మాట్లాడారు. రాజ్యాధికారమే లక్ష్మంగా బీఎల్ఎఫ్ రాష్ట్రంలో కొత్త చరిత్రను సృష్టించనుందన్నారు. సమావేశంలో సోషల్జస్టిస్ ప్రధాన కార్యదర్శి డా|| రాంనర్సయ్య, ఎంసీపీఐ(యూ) కేంద్ర కమిటీ సభ్యులు అశోక్ ఓంకార్, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు సాయిబాబు, బండారు రవికుమార్, భిక్షమయ్య, టీమాస్ ఫోరం జిల్లాల కన్వీనర్లు బండి దత్తాత్రి, కిషన్కుమార్ పాల్గొన్నారు.