Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగు భూముల్లో ఇష్టమొచ్చినట్టు అధికారుల ఏర్పాట్లు
- నాలుగు వేల ఎకరాల్లో రూ.20 కోట్ల నష్టం
- చదును చేసుకునేందుకు అదనపు శ్రమ
- మేడారం జాతర ! భక్తుల మదిలో ఆనందహేల!!
కాని అదే సమయంలో స్థానిక రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్న మోత!!! జౌను ఇది నిజం. ప్రతి ఏడాది మేడారం జాతర ముఖచిత్రమిదే. మేడారం జాతరకు వచ్చే కోటి మందికి పైగా భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం స్థానికుల భూములను ఉపయోగించుకొని పైసా కూడా నష్టపరిహారం ఇవ్వడంలేదు.అదేమని అడిగితే అసలు ఈ భూములు మీవి కావు పొమ్మంటున్నది? కనీసం నాశనం చేసిన భూములను బాగుచేసికూడా ఇవ్వడం లేదు. ఇదేం అన్యాయం!? ఈ వ్యవవహారంపై 'నవతెలంగాణ' ప్రత్యేక కథనం...
* మేడారం నుంచి పార్నంది వెంకటస్వామి
మేడారం జాతర సందర్భంగా ప్రతి యేడాదీ అక్కడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జాతర ఏర్పాట్ల కోసం అధికారులు పొలాలను ఉపయోగిస్తున్నారు. కానీ ఎలాంటి పరిహారం ఇవ్వకపోవడంతో పంట నష్టంతోపాటు, ఆ భూములను మళ్లీ సాగుకు అనువుగా చేసుకునేందుకు రైతులపై అదనపు భారం పడుతోంది.
మేడారం చుట్టూ రెడ్డిగూడెం, నార్లాపూర్, కొత్తూరు, కన్నెపల్లి, ఊరట్టం, ఎలిగడ్డ, పడిగాపూర్, వెంగళాపూర్, ప్రాజెక్టునగర్ గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో సుమారు రెండు వేల మంది రైతులకు చెందిన 6వేల ఎకరాల పొలాలు ఉన్నాయి. అయితే, ప్రతి ఏడాదీ జాతర సందర్భంగా పై గ్రామాల్లోని సుమారు నాలుగు వేల ఎకరాల్లో పంట నష్టం జరుగుతోంది. కొన్నిసార్లు వేసిన పంటలు ధ్వంసం అవుతుండటంతో.. కొందరు ఆ సమయానికి సాగు చేయ కుండా వదిలేస్తున్నారు. ఇక్కడి రైతులు సాగు చేస్తున్న భూముల్లో కొన్ని పట్టా భూములు, ఉండగా కొన్ని ప్రభుత్వ భూములు ఉన్నా యి. ప్రతి రెండేళ్లకోసారి జాతర సందర్భంగా ఒక పంట నష్ట పోతున్నారు. రైతుల భూముల్ని పూర్తిగా ప్రభుత్వం తన ఆధీనం లోకి తీసుకొని కందకాలు తవ్విస్తోంది. నల్లాలు, మరుగుదొడ్ల నిర్మాణం, రోడ్లు వేయడం, ప్రభుత్వ పనులకు వినియోగించు కోవడం జరుగుతోంది. దీనివల్ల రైతులు నష్టపోతున్నందున పరిహారం చెల్లించాలని గతంలో ఎస్వి ఇందిర హైకోర్టులో కేసు వేశారు. కోర్టు రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. పరిహారం ఇవ్వకపోగా, ఈ భూములపై 'మీకు హక్కుల్లేవ్..' అంటూ స్థానిక తహసీల్దార్, వీఆర్ఓలు రైతులను బెదిరిస్తున్న పరిస్థితి.
ఏర్పాట్లు సరే.. పరిహారమేది..
జాతరకు వచ్చిన వారికి ఇబ్బందులు కలుగకుండా ప్రభు త్వం ఏర్పాట్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ, భూముల్లో పంట నష్టపోతున్న రైతులకు మాత్రం పరిహారం ఇవ్వడం లేదు. నాకు జంపన్న వాగు ప్రాంతంలో మూడెకరాల భూమి ఉంది. బోర్లు వేసి పైపులైన్లు వేశాం. జాతర సందర్భంగా అన్నీ ధ్వంసం చేస్తున్నారు. కందకాలు తీస్తున్నారు. పశువులు అందులో పడి చని పోతున్నాయి. పొలాల గట్లను చెడిపేస్తే మళ్లీ గట్లు వేస్తున్నాం. ఇలా అనేక ఇబ్బందులు పడుతున్నాం. అందువల్ల పరిహారం చెల్లించి తమని ఆదుకోవాలి.
- రైతు పారెపల్లి నర్సింహ్మరెడ్డి
ప్రతిసారీ రూ.20 కోట్ల నష్టం
ఇక్కడి పొలాల్లో ఎకరాకు 40బస్తాల ధాన్యం దిగుబడి వస్తుంది. అంటే, జాతర వల్ల ఎకరాకు సుమారు 30 క్వింటాళ్ల ధాన్యానికి రూ.45వేల నష్టపోతున్నారు. దీంతో ప్రతి జాతర సమయంలో నాలుగు వేల ఎకరాలకు దాదాపు రూ.18 కోట్ల పంట నష్టపోతున్నారు. జాతర ముగిసాక ఆ భూముల్ని చదును చేసుకోవడానికి మరో రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇలా మేడారం రైతులు ప్రతి జాతర సందర్భంగా 20 కోట్ల రూపాయలు నష్టపోతున్నారు.
పరిహారం ఇవ్వాలి
కన్నెపల్లి-మేడారం-నార్లాపూర్ మూల ములుపు వద్ద నాకు ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. సర్వే నెంబర్ 42/25, 41/22. ఇది రిజిస్ట్రేషన్ భూమి. జాతర సందర్భంగా ఆభూమంతా పాడవుతున్న ది. పంట వేస్తే సుమారు రెండున్నర లక్షల రూపాయల ఆదాయం వస్తది. పంటలు వేసినా అధికారులు ధ్వంసం చేస్తున్నారు. పరిహారం మాత్రం ఇవ్వడం లేదు.
- రైతు కడారి రామస్వామి