Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బదిలీలు లేకపోవడంతో అసంతృప్తి
- డైరీల ఆవిష్కరణలో మంత్రులపై ఒత్తిడి
- సీఎం దృష్టికి తీసుకెళ్లాలని వినతి
- కొత్త జిల్లాల్లో ఆర్డర్ టు సర్వ్ పేరుతోనే పోస్టింగులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు జరగలేదు. సాధారణ బదిలీల కోసం ఉద్యోగులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనూ ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటికోసం ఐదేండ్లుగా నిరీక్షిస్తున్నారు. ఏటా వేసవికాలంలో రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేపడుతుందని ఎదురుచూడ్డం, నిరాశ చెందడం షరామామూలుగా మారిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013, ఏప్రిల్ 25 నుంచి మే 15 వరకు చివరిసారిగా ఉద్యోగుల బదిలీలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం 2017 ఏప్రిల్, మేనెలల్లో చేపడుతుందని ఉద్యోగులు భావించినా వారి ఆశలు ఆశలుగానే మిగిలాయి. 2016, అక్టోబర్ 11న ప్రభుత్వం 10 జిల్లాలను 31 జిల్లాలుగా ఏర్పాటు చేసింది. ఆర్డర్ టు సర్వ్ పేరుతో కొత్త జిల్లాలకు ఉద్యోగులను బదిలీ చేసింది. ఆ తర్వాతైనా శాశ్వత నియామకాలు చేపడుతుందని అందరూ ఆశించారు. కొత్త జిల్లాలు ఆవిర్భవించి ఏడాది దాటినా శాశ్వత బదిలీలు జరగలేదు. దీంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ ఏడాది తమ సంఘానికి సంబంధించి డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరణల సందర్భంగా మంత్రుల ఎదుట ఉద్యోగ సంఘాల నేతలు బదిలీల డిమాండ్లు వినిపించారు. ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్కు తమ విన్నపాన్ని తీసుకెళ్లాలని కోరడం గమనార్హం. కొత్త పీర్సీ పేరుతో సర్దిబుచ్చే ప్రయత్నం చేసినా బదిలీలు కూడా జరపాలని కోరుతున్నారు. కుటుంబాలు ఒకచోట నివాసముంటే, ఉద్యోగులు మరోచోట విధులు నిర్వహించాల్సి వస్తున్నది. పిల్లల చదువుల కోసం, కుటుంబ అవసరాల కోసం ఎంతో ఓపికతో భరిస్తున్నామని ఉద్యోగులు తెలిపారు. ఇంకోవైపు పాత జిల్లా కేంద్రాల్లో పనిచేసిన ఉద్యోగులకు 20 శాతం హెచ్ఆర్ఏ వచ్చేది. కొత్త జిల్లాలకు వెళ్లిన ఉద్యోగులకు కేవలం కొన్ని జిల్లా కేంద్రాల్లో 14.5 శాతం, మరికొన్ని జిల్లా కేంద్రాల్లో పనిచేసే వారికి 12 శాతం హెచ్ఆర్ఏ మాత్రమే వస్తున్నది. ఒకవైపు బదిలీల్లేక, ఇంకోవైపు కొత్త జిల్లాల్లో శాశ్వత నియామకాల్లేక, మరోవైపు హెచ్ఆర్ఏ 20 శాతం అందక ఉద్యోగులు ప్రభుత్వ తీరుపై గుర్రుగా ఉన్నారు. సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నదన్న అభిప్రాయం వినిపిస్తున్నది. ఎంప్లారు ఫ్రెండ్లీ అంటూనే సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సమంజసమని ఉద్యోగుల సంఘం నేతలు తెలిపారు. ప్రభుత్వం తీరు మారకుంటే ఆందోళనకు దారితీసే అవకాశం ఉంటుందని పేరు చెప్పడానికి ఇష్టపడని కొంతమంది నేతలు అభిప్రాయపడ్డారు.
శాశ్వత కేటాయింపులకు స్థానికతే ప్రామాణికం
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగులు ఆర్డర్ టు సర్వ్ (తాత్కాలిక నియామకాలు) పేరుతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. గతంలో పది జిల్లాల్లో ఉన్న 41,816 మంది ఉద్యోగులను ఆర్డర్ టు సర్వ్ పేరుతో తాత్కాలికంగా 31 జిల్లాలకూ సర్దుబాటు చేసింది. ఎలా చేయాలన్న దానిపై హైదరాబాద్ మినహా మిగిలిన తొమ్మిది జిల్లాలకు ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం విభజించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఐదు జిల్లాలుగా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాలుగు జిల్లాలుగా విభజించబడింది. ఉద్యోగుల బదిలీలు, శాశ్వత నియామకాలకు స్థానికతే ప్రామాణికంగా తీసుకునే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తారన్నది ఆప్షన్ అవకాశం ఇచ్చి స్థానికత ఆధారంగా శాశ్వత కేటాయింపులు చేయాలని చూస్తున్నది. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాలుగా విభజన అయ్యింది. ఉమ్మడి జిల్లా రంగారెడ్డికు చెందిన ఓ ఉద్యోగి విద్యార్హత కూకట్పల్లిలో పదో తరగతి వరకు చదివి ఉంటే, ప్రస్తుతం మేడ్చల్-మల్కాజిగిరికి స్థానికులుగా మారుతారు. ఇక ఆ ఉద్యోగి శాశ్వత కేటాయింపు కూడా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు వర్తిస్తుంది. ఇలా ఉద్యోగులకు శాశ్వత కేటాయింపులు చేయాలని ప్రభుత్వం సమాలోచన చేస్తున్నది. ఉద్యోగుల శాశ్వత బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను ముందు విడుదల చేయనుంది. ఆ తర్వాత ఉద్యోగ సంఘాల నుంచి అభ్యంతరాలు స్వీకరించనుంది. అనంతరం ఉద్యోగుల ఆప్షన్లను స్వీకరించి శాశ్వత కేటాయింపులు చేపట్టనుంది. ఈ ప్రక్రియలో ఏడాదిలో ఉద్యోగ విరమణ పొందే వారికి, ఉద్యోగ సంఘాల ప్రధాన నాయకులు, దివ్యాంగులు, భార్యాభర్తలు, దీర్ఘకాలిక వ్యాధి ఉన్న ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చే అవకాశముంది. ఇదంతా చేసే క్రమంలో కావాలని నాన్చివేత ధోరణి అవలంబిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఎన్నికలే లక్ష్యంగా ఉద్యోగులకు వల
రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు వచ్చే ఏడాది 2019లో జరగనున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న అభిప్రాయంతో ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే 11 వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) వేయడంతోపాటు ఆ లోపే ఫిట్మెంట్ ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. పీఆర్సీ ఆలస్యమైతే మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఈలోపే ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బదిలీల ప్రక్రియను చేపట్టాలని సమాలోచన చేస్తున్నట్టు సమాచారం. ఎన్నికలే లక్ష్యంగా ఉద్యోగులకు వల వేయాలని అధికార పార్టీ నేతలు ఇప్పటి నుంచే ప్రణాళిక రచిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది ఏప్రిల్ లేదా మేలో తప్పనిసరిగా ఉద్యోగులకు బదిలీలతోపాటు కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న వారికి శాశ్వత కేటాయింపులుంటాయని బలంగా వినిపిస్తున్నది. ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తే ప్రతిపక్ష పార్టీలకు మేలు కలుగుతుందున్న ప్రమాదాన్ని గ్రహించిన ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో త్వరలోనే సంప్రదింపులు జరపాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. త్వరలోనే ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసే అవకాశమున్నట్టు సమాచారం.