Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరసనగా రైతుల రాస్తారోకో.. మద్దతు తెలిపిన ఎమ్మెల్యే
- సాగు నీటికోసం పండుగ పూట పెద్దపల్లి ఎమ్మెల్యే ఘెరావ్
నవతెలంగాణ-జగిత్యాల/కాల్వశ్రీరాంపూర్
ఎస్సారెస్పీ కాల్వ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్లకు విద్యుత్ సరఫరా నిలిపి వేయడాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లాలో రైతులు మంగళవారం రాస్తారోకో చేశారు. 24 గంటల విద్యుత్ అని చెప్పి ఇప్పుడు విద్యుత్ సరఫరా నిలిపేయడమేంటని ప్రశ్నించారు. వారి ఆందోళనకు ఎమ్మెల్యే జీవన్రెడ్డి, టీఆర్ఎస్ జగిత్యాల నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ సంజరుకుమార్ మద్దతు తెలిపారు. అధికారులు విద్యుత్ను వెంటనే పునరుద్ధరించడంతో రైతులు ఆందోళన విమరించారు. అలాగే పెద్దపల్లి జిల్లాలో పండుగ పూట గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డిని రైతులు ఘెరావ్ చేశారు. జగిత్యాల రాస్తారోకోలో ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాట్లాడుతూ ఎస్సారెస్పీ కాల్వల సమీపంలోని పంట పొలాలకు విద్యుత్ మోటార్ల ద్వారా నీళ్లు తోడుకోవడం నేరం కాదన్నారు. 20 ఏండ్ల నుంచి రైతులు ఇలానే చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆదేశాలు లేకుండా అధికారులే విద్యుత్ సరఫరా నిలిపేయడం సరికాదన్నారు. ఎస్ఈని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచే విద్యుత్ అధికారులతో మాట్లాడారు. అధికారులు విద్యుత్ను పునరుద్ధరించడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ ధర్నాలో మోతె ఎంపీటీసీ గంగాధర్, వైస్ ఎంపీపీ గంగం మహేష్, సింగిల్ విండో చైర్మన్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
సాగునీటి కోసం ఎమ్మెల్యే నిలదీత
సాగునీరందించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామ రైతులు సోమవారం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డిని నిలదీశారు. కోలాట బృందం మహిళలకు చీరలు పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యే గ్రామానికి వచ్చారు. విషయం తెలుసుకున్న రైతులు ఆయన్ని ఘెరావ్ చేశారు. వాహనాన్ని అడ్డుకుని రోడ్డుపై బైటాయించారు. సాగునీరందించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. నీరందించడం కుదరదని ఎమ్మెల్యే తేల్చిచెప్పడంతో రైతులు ఆగ్రహించారు. నీళ్లిప్పించలేని ఎమ్మెల్యే తమ ఊరికి రావొద్దని, వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే చీరలు పంపిణీ చేయకుండానే పోలీసు బందోబస్తు నడుమ వెనుదిరిగారు. ఈ ఆందోళనలో రైతులు మేడి అశోక్, యాట రాజయ్య, దామ రవి, మేదురు రాజమల్లు, రాజేందర్, ముస్కు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.