Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ యోచన!
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రస్తుతమున్న గ్రామ పంచా యతీలకు అదనంగా మరో నాలుగువేల పంచాయతీల ఏర్పాటు చేసే అవకాశ ముందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అన్నింటికీ కలిపి ఫిబ్రవరిలో ఎన్నికలు జరిపేందుకు యోచిస్తున్నామని చెప్పారు. ఇందుకుగల అవకాశాలను పరిశీలిస్తున్నా మన్నారు. పంచాయతీల ఏర్పాటుకు వీలుగా జిల్లా పంచాయతీ అధికారులు పంపిన ప్రతిపాదనల ప్రకారం హద్దులను ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. రాజ్యాం గం ఇదే విషయాన్ని చెబుతున్నదని ఆయన గుర్తుచేశారు. న్యాయస్థానాల లిటిగేషన్లకు తావు లేకుండా వీటిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శాసన ప్రక్రియ ద్వారా పంచాయతీలను ఏర్పాటు చేయబోతున్నా మని సీఎం తెలిపారు.
మంగళవారం హైదరాబాద్లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, భూ రికార్డుల ప్రక్షాళన, పంచాయతీ ఎన్నికలు, అందుకోసం నిర్వర్తించాల్సిన పనులు, పురపాలక చట్టం సవరణ తదితరాంశాలపై సీఎం ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చాలా విషయాల్లో విజయం సాధించిందని తెలిపారు. ఇదే సమయంలో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచలేకపోయామని చెప్పారు. ఈ నేపథ్యంలో 'పనిచేసే పంచాయతీరాజ్ వ్యవస్థ'ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సర్పంచ్ను ప్రత్యక్షంగా ఎన్నికోవాలా? లేక పరోక్షంగానా? అనే అంశంపై కూడా చర్చిస్తున్నామని అన్నారు. ఒకప్పుడు జిల్లా కలెక్టర్లకు పంచాయతీల మీద ఎన్నో అధికారాలు ఉండేవి.. ఇప్పుడు వాటి మీద నియంత్రణ లేకుండా పోయిందని చెప్పారు. ఈ నిస్సహాయ స్థితి నుంచి బయటపడాలని అన్నారు. ఇదే సమయంలో మున్సిపల్ చట్టానికి కూడా సవరణలు చేస్తామని సీఎం తెలిపారు.
మార్చి 11న పాస్ పుస్తకాల పంపిణీ...
మార్చి 11న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒకేసారి పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని సీఎం ఈ సందర్భంగా కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకోసం ప్రతిగ్రామంలో ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రుల దగ్గర్నుంచి మండలాధ్యక్షుల వరకు అందర్నీ భాగస్వాములను చేయాలని ఆదేశించారు. ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేయటం ద్వారా పాస్ పుస్తకాలను గ్రామాలకు చేర్చాలని చెప్పారు.
జిల్లా మొత్తానికి ఒకే రెవెన్యూ కోర్టు...
భూ రికార్డుల ప్రక్షాళణలో భాగంగా 93 శాతం భూమి, 92 శాతం ఖాతాలు వివాద రహితమైనవేనన్న విషయం తేలిందని సీఎం అన్నారు. ఈ క్రమంలో వివాదాలు చాలా తక్కువ శాతంలో మాత్రమే ఉన్నాయని వివరించారు. ఆర్డీవో, జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్లు నిర్వహించే రెవెన్యూ కోర్టుల స్థానంలో జిల్లా మొత్తానికి ఒకే ఒక రెవెన్యూ కోర్టు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫిబ్రవరి చివరినాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. మార్చి 12 నుంచి రెవెన్యూ రికార్డుల నిర్వహణలో విప్లవాత్మకమైన మార్పులొస్తాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ శాఖ ఉండాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో రోజువారీగా రెండున్నర వేల నుంచి నాలుగు వేల వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయని.. వీటిలో 60 శాతం పట్టణ ప్రాంతాల్లో, మిగిలినవి గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయని చెప్పారు. ఇప్పుడున్న 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అదనంగా 443 మండల కార్యాలయాలు కూడా రిజిస్ట్రేషన్ వ్యవహారాలను చూస్తుంటాయని వివరించారు. ఈ ప్రకారంగా మొత్తం 584 మండలాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలుంటాయని తెలిపారు. దీంతో రిజిస్ట్రేషన్ తర్వాత మ్యుటేషన్కు నెలలకొద్ది సమ యం వేచి చూడాల్సిన అవసరం ఇకపై ఉండబోదని సీఎం చెప్పారు. దీంతోపాటు 'కోర్ బ్యాంకింగ్ నెట్వర్క్' విధానాన్ని కూడా ప్రవేశపెడుతున్నామని అన్నారు. తద్వారా కొనుగోలు, అమ్మకందార్ల పాస్ పుస్తకాల్లో తక్షణమే ఎంట్రీలు, మార్పులు, చేర్పులు జరిగిపోతాయని తెలిపారు. ఇలాంటి అంశాలన్నింటినీ 'ధరణి వెబ్సైట్'లో పొందుపరుస్తామని అన్నారు. ఈ వెబ్సైట్ను ప్రపంచంలో ఏ మూలనుంచైనా చూడొచ్చని తెలిపారు. భూ రికార్డుల ప్రక్షాళన పూర్తయిన నాటి నుంచి మార్చి 12 వరకు చోటు చేసుకోబోయే క్రయ విక్రయాల వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి, ఆ వెబ్సైట్లో పొందుపరచాలని సీఎం ఈ సందర్భంగా కలెక్టర్లను ఆదేశించారు.