Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్ధరాత్రి పూజలు నిర్వహించి ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ
నవతెలంగాణ - ఇంద్రవెల్లి
రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా జాతర మంగళవారం అర్ధ రాత్రి ఆరంభమైంది. కలెక్టర్ డి.దివ్యతోపాటు ఎస్పీ విష్ణు వారి యార్, ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, ఐటీడీఏ చైర్మెన్ కనక లక్కేరావు, మెస్రం వంశీయులు పూజలు చేశారు. జాతర ఆరు రోజులపాటు కొనసాగనుంది. అంతకుముందు మెస్రం వంశీయులు నాగోబా ఆలయం వెనుక పూజకు తెచ్చిన కొత్త కుండలకు పటేల్ వెంకట్రావు ఆధ్వర్యంలో పూజలు చేసి భద్రపరిచారు. ఆలయాన్ని మంచినీటితో కడిగి శుభ్రపరిచారు. వట వృక్షం వద్ద బస చేసిన మెస్రం వంశీయులు తెల్లవస్త్రాన్ని ధరించి మెస్రం కటోట(పూజరి) హన్మంత్, పటేల్ వెంకట్రావు, మెస్రం కోసు, మెస్రం తిరుపతి పూజకు తెచ్చిన పవిత్ర కలశాన్ని కట్టుకొని భాజాభజంత్రీల మధ్య కాగడాలతో ఆలయంలోకి ప్రవేశించారు. వారి సంప్రదాయం ప్రకారం రాగి చెంబులో పాలు తెచ్చి తెల్లటి వస్త్రాన్ని కప్పి ఉంచారు. తెల్లటి వస్త్రం పైకి కదిలే వరకు పూజలు చేస్తారు. తెల్లటి వస్త్రం కదిలితే పూజ సఫలమైనట్టు మెస్రం వంశీయులు భావిస్తారు. ఇటీవల వివాహాలు చేసుకున్న జంటలు నాగోబా ఆవరణలో తయారు చేసిన పుట్టను బోధన్ సబ్కలెక్టర్ అనురాగ్ జయంత్, ట్రైనీ కలెక్టర్ డాక్టర్ గోపి తిలకించారు. జాతరలో భాగంగా 19న దర్బార్ నిర్వహించనున్నారు. నిజాం సర్కార్ హయాంలో గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి మానవ పరిణామ శాస్త్రవేత్త హైమన్డార్ఫ్ను నియమించింది. డార్ఫ్ తన అధ్యయన నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. అప్పటి నుంచి దర్బార్ కొనసాగుతూనే ఉంది. జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలేకాక మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి జనం తరలివస్తారు.