Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్పులపై అఖిలపక్షం : సీపీఐ (ఎం) డిమాండ్
- ఒకే ఒక్క కోర్టు అభ్యంతరకరం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రామ పంచాయతీలు, రెవెన్యూ వ్యవస్థలో మౌలిక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో.. ఆయా అంశాలపై తక్షణం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని సీపీఐ (ఎం) డిమాండ్ చేసింది. ప్రజల సౌకర్యాలు, ప్రయోజనాలకు ఉపయోగపడే ఏ చర్యనైనా తమ పార్టీ సమర్థిస్తుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. అయితే సవరణలపై అందరి అభిప్రాయాలు, ప్రతిపాదనలను తీసుకుంటే మెరుగైన మార్పులు చేయొచ్చని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరారు. తండాలు, ఆదివాసీ ప్రాంతాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసే విషయంలో మొదట స్పందించింది సీపీఎమ్మేనని గుర్తుచేశారు. కొత్త పంచాయతీల కూర్పు ప్రజలకు సౌలభ్యంగా ఉండాలి తప్ప రాజకీయ ప్రయోజనాలు ప్రామాణికం కాకూడదని తెలిపారు. స్థానిక పరిపాలనా కేంద్రాల్లో రాజ్యాంగ స్ఫూర్తిని అమలు జరపాలంటే కేరళలో మాదిరిగా రాష్ట్ర బడ్జెట్లో 50 శాతానికి తగ్గకుండా పంచాయతీలకు నిధులను కేటాయించాలని సూచించారు. టీఆర్ఎస్ సర్కారు అందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించటం లేదని పేర్కొన్నారు. ఇదే సమయంలో సబ్ రిజిస్ట్రార్ విధులను ఎమ్మార్వోలకు బదలాయించటమనేది వికేంద్రీకరణకు తోడ్పడవచ్చని తమ్మినేని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై పార్టీలు, రెవెన్యూ యంత్రాంగంతో లోతుగా చర్చించటం ద్వారా ప్రస్తుతం కొనసాగుతున్న అవకతవకలకు అడ్డుకట్ట వేయాలని కోరారు.
ఇప్పుడున్న ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్ కోర్టులను రద్దు చేసి జిల్లా మొత్తానికి ఒకే ఒక్క కోర్టును ఏర్పాటు చేస్తామనే నిర్ణయంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వికేంద్రీకరణ అంటే ప్రజలకున్న సౌలభ్యతను రద్దు చేయటం కాదని పేర్కొన్నారు. అలాగే కోర్టుల చుట్టూ కాకుండా మండల స్థాయిలో ఉండే అధికారుల వద్దకు వెళ్లటం ఇప్పటి వరకూ ప్రజలకు ఉపయోగపడుతున్నదని తెలిపారు. కాబట్టి ఇప్పుడున్న పద్ధతుల్లోనే ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్ కోర్టులను కొనసాగించటం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించాలని కోరారు. ఇందుకనుగుణంగా తగిన సిబ్బందిని నియమించాలని, తీర్పులు త్వరితగతిన వచ్చేట్టు చూడాలని తమ్మినేని కోరారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతమున్న ప్రత్యక్ష పద్ధతినే కొనసాగించాలంటూ ప్రజలు కోరుతున్నారని వివరించారు. అందువల్ల పరోక్ష పద్ధతికి మార్చొద్దని విజ్ఞప్తి చేశారు.