Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇక్కడే మెరుగైన వైద్యమందిస్తాం
- మరో ఎంసీహెచ్ నిర్మిస్తాం: సీఎం కేసీఆర్
నవతెలంగాణ-గజ్వేల్
ఉత్తర తెలంగాణ నుంచి ప్రజలు వైద్యం కోసం గజ్వేల్ దాటి హైదరాబాద్లోని గాంధీకి పోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. గజ్వేల్లోనే అందరికీ మెరుగైన వైద్యం అందించనున్నట్టు చెప్పారు. బుధవారం మెదక్ జిల్లా తూఫ్రాన్, సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం పర్యటించారు. పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. తూప్రాన్లో రూ.11.50 కోట్లతో నిర్మించిన 50పడకల ఆస్పత్రిని ప్రారంభించారు. పట్టణంలోని సీసీ రోడ్లకు రూ.5కోట్లు, మండలానికి డిగ్రీ కళాశాల, 500 డబుల్ బెడ్ రూం ఇండ్లు, కమ్యూనిటీ హాల్కు రూ.కోటి మంజూరు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లతో పాటు, సిద్దిపేట జిల్లా ప్రజలకు గజ్వేల్లోనే మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుందని తెలిపారు. త్వరలోనే గజ్వేల్ నియోజకవర్గంలో బస్సు యాత్ర చేపడతానని, తూప్రాన్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. గజ్వేల్లోని వంద పడకల ఆస్పత్రి పనులు పూర్తికావొస్తున్నాయని చెప్పారు. మరో మహిళా శిశు సంక్షేమ ఆస్పత్రి నిర్మాణం గజ్వేల్లోనే చేపడుతున్నట్టు వివరించారు. అనంతరం వెజ్, నాన్-వెజ్ మార్కెట్ను సందర్శించిన సీఎం కలెక్టర్తో పలు విషయాలను చర్చించారు. అక్కడి నుంచి గజ్వేల్లో నిర్మాణంలో ఉన్న సీఎం మినీ క్యాంపు కార్యాలయానికి చేరుకుని పనులను పరిశీలించారు. అక్కడా కాన్ఫరెన్సు హాల్ నిర్మించాలని అధికారులకు సూచించారు. సంగాపూర్లో 1200 డబుల్ బెడ్రూం ఇండ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆ తర్వాత సీఎం బస్సులో ప్రయాణిస్తూ ఆడిటోరియం, సమీకృత భవనం, విద్యాహబ్ భవనాలను పరిశీలించారు. జర్నలిస్టుల కాలనీ ఎంతవరకు వచ్చిందని, ప్రజాప్రతినిధులను, కార్పొరేషన్ చైర్మెన్ను సీఎం అడిగారు. సంగాపూర్, ముట్రాజ్పల్లి రోడ్డులో జర్నలిస్టు కాలనీ అవుతోందని, అక్కడే మల్లన్నసాగర్ నిర్వాసితులకు పునరావాసం కోసం స్థల సేకరణ పూర్తైందని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సీఎంకు వివరించారు. నాచారం దేవస్థానాన్ని టూరిజం స్పాట్గా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా సీఎం హామీనిచ్చారు.
ఇంటెలిజెన్స్ సమాచారంతో..
గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కుక్ గ్రామంలో గ్రామసభ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేయగా, కొండపోచమ్మ జలాశయం భూనిర్వాసితులు ఆందోళన చేసే అవకాశముందని ఇంటెలిజెన్స్ సమాచారంతో సభను రద్దు చేశారు. సీఎం మినీ బస్సులో వస్తున్నట్టు తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు గజ్వేల్ పట్టణంలో అడ్డగించే ప్రయత్నం చేయగా, పోలీసులు వారిని అరెస్టు చేశారు. సీఎం పర్యటనలో ఉపసభాపతి పద్మాదేవేందర్రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడి, సీఎంఓ అధికారిణి చిత్ర రాంచంద్రన్, కలెక్టర్లు వెంకట్రామిరెడ్డి, మాణిక్రాజ్ కణ్ణన్, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామలిం గారెడ్డి, బాబూమోహన్, మదన్రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, పల్ల రాజేశ్వర్రెడ్డి, పాతూరి సుధాకర్రెడ్డి ఉన్నారు.