Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో పోలీస్రాజ్యం : గుజరాత్ ఎమ్మెల్యే జిగేశ్ మేవాని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశవ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని గుజరాత్లోని వగ్దాం ఎమ్మెల్యే జిగేష్ మేవాని తెలిపారు. దళితులపై జరుగుతున్న దాడులు, హింసలకు కేంద్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. రోహిత్ వేముల బతికి ఉంటే.. తనతో కలిసి నడిచేవారని వ్యాఖ్యానించారు. రోహిత్ వేములు రెండో వర్ధంతి సభలో పాల్గొనడానికి వచ్చిన ఆయన బుధవారం హైదరాబాద్లోని చంచల్గూడ జైలులో ఉన్న మందకష్ణ మాదిగను సినీ విమర్శకుడు కత్తి మహేశ్, ఉస్మానియా విశ్వ విద్యాలయ విద్యార్థులు, జైభీమ్ యూత్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీహరితో వెళ్ళి జిగేశ్ కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పోలీస్రాజ్యం నడుస్తున్నదని ఆరోపించారు. మాదిగ సామాజిక వర్గం హక్కుల కోసం పోరాడుతున్న మంద కృష్ణ మాదిగను జైల్లో పెట్టడం ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యా నించారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదనడానికి ఇది నిదర్శనమన్నారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన తీవ్ర స్థాయికి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యమాలను అణచివేస్తూ, ఉద్యమకారులను నిర్బంధిస్తే.. మరింత ఉవ్వెత్తున ఎగిసి పడుతాయని చెప్పారు. తెలంగాణలో దళిత సంఘాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రతి దళిత కుటుంబానికి ఐదెకరాల భూమి ఇవ్వాలన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన మంద కృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.