Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలువలతో కూడిన రాజకీయాల కోసమే 'ఫ్రంట్'
- బీఎల్ఎఫ్ ఆవిర్భావ సన్నాహక సమావేశాల్లో నాయకులు
నవతెలంగాణ-యంత్రాంగం
కారల్మార్క్స్, ఫూలే, అంబేద్కర్ ఆశయాలతోనే బహుజన వామపక్ష ఫ్రంట్(బీఎల్ఎఫ్) ఏర్పాటు చేస్తున్నామని నాయకులు అన్నారు. బుధవారం నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, సిరిసిల్ల జిల్లాల్లో జరిగిన ఫ్రంట్ ఆవిర్భావ సన్నాహక సమావేశాల్లో పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బహుజన రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నల్లా సూర్యప్రకాశ్, ఇతర పార్టీల రాష్ట్ర నాయకులు ప్రసంగించారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్లు పార్టీలు వేరైనా విధానాలు మాత్రం ఒక్కటేనన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతూ వాగ్దానాలను విస్మరిస్తోందన్నారు. జనాభాలో 93శాతం ఉన్న వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే సామాజిక తెలంగాణ సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసే దమ్ము కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు ఉందా అని ప్రశ్నించారు. విలువలతో కూడిన రాజకీయాల కోసం, సామాజిక తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం రానున్న ఎన్నికల్లో ఫ్రంట్ ఆధ్వర్యంలో 119 స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. అణగారిన వర్గాలకు విద్య, వైద్యం, సేద్యం లేకుండా టీఆర్ఎస్ చేస్తోందని, ఈ పోకడలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను కదిలిస్తామని అన్నారు. ఈనెల 25న హైదరాబాద్లో బీఎల్ఎఫ్ ఆవిర్భావ సభ జరుగుతుందని, ప్రజలు, సామాజిక సంఘాల నాయకులు, మేధావులు, అభ్యుదయవాదులు జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్రంలో నిరంతరం అణగారిన వర్గాల సమస్యలపై పోరాడే అన్ని పార్టీలు ఈ ఫ్రంట్లోకి రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాల్లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నాగయ్య, జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, ఎంసీపీఐ రాష్ట్ర నాయకులు వస్కుల మట్టయ్య, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు తలమల హుస్సేన్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బోడ జనార్దన్, యాతాకుల రాజయ్య, తెలంగాణ మేధావుల ఫోరం చైర్మెన్ బి.వి.రాఘవులు, యాదవ సంఘం నాయకులు మీగడ రామారావు, తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేష్, ఎంబీటీ రాష్ట్ర నాయకులు షాబాద్ అలీఖాన్, టీమాస్ రాష్ట్ర నాయకులు శ్రీరాంనాయక్, కూరపాటి రమేష్, ఎంసీపీఐయూ, సీపీఐ(ఎంఎల్) నాయకులు పాల్గొన్నారు.