Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ మాస్ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో ధర్నాలు
నవతెలంగాణ -హైదరాబాద్
ప్రజా సమస్యలను పరిష్కరించాలని టీమాస్ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట బుధవారం రిలేదీక్షలు చేపట్టారు. హైదరాబాద్లో ముసారాంబాగ్ డివిజన్లోని సైదాబాద్లో, మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని అడ్డగుట్టలో చేపట్టిన రిలే దీక్షలకు టీమాస్ రాష్ట్ర కన్వీనర్ జాన్వెస్లీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...హైదరాబాద్లోని కాలనీల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించకుండా పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తోందన్నారు. ప్రజాసమస్యలపై నిరంతం టీమాస్ పోరాడుతుందన్నారు. హైదరాబాద్లో మొత్తం ఐదు కేంద్రాల్లో దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు అరుణజ్యోతి, అబ్బాస్, రాములు, తదితరులు పాల్గొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో దీక్షలను ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరిస్తూ సీఎం కేసీఆర్ గారడీతో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి, మేళ్లచెర్వు మండలాల్లో నిర్వహించిన దీక్షల్లో వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొప్పని పద్మ మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట దీక్షలను రాష్ట్ర నాయకులు పి.రాజారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ అంటూనే..బడుగుల జీవితాలను నాశనం చేసేలా నూతన మద్యం పాలసీని తీసుకొచ్చారని విమర్శించారు. టీమాస్ ఫోరం జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గంటా నారాయణ, ఏలేశ్వరం వెంకటేశ్వర్లు, ఉమామహేశ్వర్లు, టీ-మాస్ ఫోరం జిల్లా కన్వీనర్ కుమారస్వామి, ఎంసీపీఐ(యూ) నాయకులు ఎంఏ గౌస్ మద్దతుగా మాట్లాడారు. టీడీపీ నాయకులు పాపయ్య, జమ్మిబాబు, చంద్రయ్య, షరీఫ్ సంఘీభావం తెలిపారు. మహబూబాబాద్లో దీక్షలకు టీ ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి కొండ్ర ఎల్లయ్యతోపాటు ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. రంగారెడ్డి జిల్లా యాచారంలో టీమాస్ జిల్లా స్టీరింగ్ కమిటీ కన్వీనర్ సామేల్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు బి.మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. మంచాలలో టీమాస్ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పగడాల యాదయ్య ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయం ఎదుట దీక్ష చేశారు. ఇబ్రహీంపట్నంలో బి.సామెల్ రిలే నిరహారదీక్షలను ప్రారంభించారు. నల్లగొండ, ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం,ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట దీక్షలు చేపట్టారు.