Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేలాది పోస్టులు ఖాళీ..కొత్త బాధ్యతల నిర్వహణ కష్టమే
- 28 డివిజన్లల్లో ఆర్డీవోలు... 150 మండలాల్లో తహశీల్దార్లు లేరు
- మూడేండ్లుగా భర్తీకానీ ఉద్యోగాలు
''మార్చి 11న రైతులకు పాసుబుక్కులు ఇస్తాం..సబ్రిజిస్ట్రార్ల బాధ్యతలు తహశీల్దార్లకే..ఫిబ్రవరిలో పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహించేందుకు ఆలోచిస్తున్నాం..కలెక్టర్ల వ్యవస్థను పటిష్టం చేస్తాం...'' అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మంగళవారం ప్రగతిభవన్లో కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు. కలెక్టర్ల సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు హాట్టాపిక్గా మారాయి. ప్రధానంగా రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారుల్లో ఈ తరహా చర్చలు సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ చెప్పినవిధంగా జరుగుతుందా ? అనే అనుమానాలు ఆయా ప్రభుత్వ శాఖల ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, ఆయా ఉద్యోగ సంఘాల స్థాయిలోనే వినిపిస్తున్నాయి.
* బి.బసవపున్నయ్య
రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమైన విభాగాల్లో రెవెన్యూ శాఖ ఒకటి. కీలకం కూడా. భూములు, రికార్డులు, ఇతరాలు ఈ శాఖ పరిధిలోకి వస్తాయి. సాధారణ పరిపాలనలో కూడా రెవెన్యూ శాఖదే ముఖ్యపాత్ర అని చెప్పొచ్చు. అయితే ఇంతటి ప్రాధాన్యత గల శాఖలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీఆర్ఎస్ సర్కారు గత మూడున్నరేండ్లుగా ఈ పోస్టులను భర్తీ చేయ డంలో శ్రద్ధపెట్టలేదు. ఏడాదికాలంలో సాధారణ ఎన్నికలు ఉండ టంతో హడావిడిగా ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు, పథకాలను నెత్తిన ఎత్తుకుంటున్నది. ఈతరుణంలో పరిపాలన వ్యవస్థను గాడిలో పెట్టబోతున్నట్టుగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే వాస్తవంలో రెవెన్యూ శాఖ ఖాయిలాపడిన పరిశ్రమలా తయారైంది. భారీగా పోస్టులు ఖాళీగా ఉండటం, దీర్ఘకాలికంగా ప్రభుత్వం వాటి గురించి పట్టించుకోకపోవడం తెలిసిందే. అంతేగాక తాజాగా నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో సబ్రిజిస్ట్రార్ల బాధ్యతలను సైతం తహశీల్దార్లకు అప్పగిస్తామని ప్రకటించిన విషయం విదితమే. దీంతో రెవెన్యూ శాఖపై పనిభారం మరింత ఎక్కువగా పడనుంది. ఈ శాఖకు ఉన్న సాధారణ విధులను నిర్వర్తించడమే కష్టంగా ఉందని ఒకవైపు ఉద్యోగులు, మరోవైపు రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. ఇప్పుడు స్టాంపులు, రిజస్ట్రేషన్ల శాఖా బాధ్యతలు అదనంగా తోడైతే రెవెన్యూ శాఖ సమస్యల్లో కూరుకుపోతుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఆందోళనా వ్యక్తమవుతున్నది.
రెవెన్యూ శాఖ విధులు
రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో కీలకంగా ఉండేది రెవెన్యూ శాఖ. పుట్టిన సర్టిఫికెట్ నుంచి డెత్ సర్టిఫికెట్ వరకు రెవెన్యూ శాఖ ద్వారా రావాల్సిందే. అంతేగాక ప్రభుత్వ పథకాలైన కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్, పింఛన్లు, డబుల్ బెడ్రూమ్, గొర్రెల లబ్ధిదారుల గుర్తింపు, రైతులకు ఆర్థిక సాయం తదితర పనున్నీ ఇప్పుడు రెవెన్యూ శాఖ చేస్తున్నది. అంతేగాక ఇతర ప్రభుత్వ శాఖలు చేయని పనులు కూడా రెవెన్యూ పరిధిలోకి వచ్చేవే. ఇదిలావుండగా అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిలేక 2014లో అన్యాక్రాంతమైన ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న వారికి క్రమబద్ధీకరణ చేయలేకపోయింది. 125 గజాల స్థలాలను ఉచిత కేటగిరిలో, ఉన్నత వర్గాలకు చెల్లింపు కేటగిరిలో క్రమబద్ధీకరణ చేయాల్సి ఉంది. మూడు నెలల్లో చేయాల్సిన ఈ ప్రక్రియ, రెండేండ్లు దాటినా పని పూర్తికాలేదు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పేద రైతులు తెల్లకాగితాలపై రాసుకున్న భూముల క్రయవిక్రయాలను(సాదాబైనామా) కూడా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం 2016 జూన్లో ఉత్తర్వులు జారీచేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 11.16 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు క్రమబద్ధీకరణ చేసింది మాత్రం 34 వేల మందికే.
అధికారుల కొరత...సిబ్బంది లేమి
రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూశాఖలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంధి కొరత తీవ్రంగా ఉన్నది. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్ల కొరత ఎక్కువగా కనిపిస్తున్నది. క్యాడర్ తక్కువగా ఉన్న అధికారులకు ఆయా జిల్లాల్లో పోస్టింగ్లు ఇచ్చి పనిచేయిస్తున్నారు. అవసరమున్న మేరకు ఉద్యోగులు, సిబ్బంది లేరు. రాష్ట్రవ్యాప్తంగా 28 ఆర్డీవో కార్యాలయాల్లో ఆర్డీవోలు లేరు. 150 మండలాల్లో తహశీల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 485 సర్వేయర్ పోస్టులు భర్తీకాలేదు. 700 వీఆర్వో, 1000 వీఆర్ఏ పోస్టులు సర్కారు భర్తీచేయలేదు. అలాగే 800 జూనియర్ అసిస్టెంట్ పోస్టులనూ నింపలేదు. ఇవన్నీ సర్కారు నోటిఫై చేసినవే. అంతేగాక 443 మండలాల్లో ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేయడానికి ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పనులు చేయడానికి ఒక్కో తహశీల్దార్ కార్యాలయంలో కనీసం నలుగురి చొప్పున జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు అవసరమని రెవెన్యూ ఉద్యోగులు అంటున్నారు. దాదాపు 1600 నుంచి 2000 మంది ఉద్యోగులు కావాల్సి ఉంటుంది. అయితే గత కొంతకాలంగా నియామకాలు చేయకపోవడంతో కొత్త జిల్లాల్లో ప్రస్తుతం పరిస్థితి దారుణంగా ఉంది. వీఆర్వోలకు ఉద్యోగోన్నతులు ఇస్తామని చెప్పి, ఇవ్వలేదు. దీంతో సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడలానే ఉన్నది.
సమీకృత కలెక్టరేట్లు
రాష్ట్రంలోని 29 జిల్లా కేంద్రాల్లో సమీకృత జిల్లా కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాలు(డీపీవో)లు నిర్మించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఈ పని చాలా నెమ్మదిగా సాగుతున్నది. సమీకృత కలెక్టరేట్లు డిజైన్ల రూపకల్పనలో తీవ్ర ఆలస్యం చోటుచేసుకున్నది. స్థలాల సేకరణ ఇంకా పూర్తి కాలేదు. ఏడాదిలోగా పూర్తిచేయాలన్న సర్కారు ఆకాంక్ష నెరవేర లేదు. పూర్తిస్థాయిలో అధికారం యంత్రాంగం లేకపోవడమే దీనికి కారణమని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. అంతా బాగానే ఉన్నా అల్లుడినోట్లో శని అన్నట్టుగా 28 జిల్లాల్లో కొత్త కలెక్టరేట్ల కోసం రూ.600 కోట్లు బడ్జెట్లో కేటాయించినా, అధికారులు, ఉద్యోగుల్లేక కార్యరూపం దాల్చలేదు.
చాలా కష్టం
వి. లచ్చిరెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షులు
తెలంగాణ తహశీల్దార్ల అసోసియేషన్
రెవెన్యూ శాఖకు మరిన్ని పనులు అప్పగించడానికి ప్రభుత్వం పూనుకున్నది. ఇప్పుడున్న సిబ్బందితో ఆ విధులను నిర్వర్తించడం చాలా కష్టం. శాఖలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థులకు సర్టిఫికెట్ల జారీ దగ్గర నుంచి ప్రభుత్వ పథకాల అమలు వరకు రెవెన్యూ శాఖ పర్యవేక్షిస్తున్నది. పనిభారం చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ల శాఖకు చెందిన సబ్రిజిష్ట్రార్ల బాధ్యతలను అప్పగిస్తే శాఖ కుప్పకూలే అవకాశం ఉంది. కొత్తగా వెంటనే నియామకాలు చేయాలి. ఐఏఎస్ అధికారుల దగ్గర నుంచి అన్ని స్థాయిలో ఖాళీలు ఉన్నాయి.
కొత్త పోస్టులు అవసరం
ఎం.శివశంకర్, అధ్యక్షులు
తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్
ప్రభుత్వ కొత్త విధానాన్ని మేము ప్రశ్నించాలని భావించడం లేదు. కాని సర్కారు తాజా నిర్ణయాలతో రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిపై పనిభారం పెరుగుతుంది. కొత్త నియామకాలు తక్షణం చేయకపోతే ఇబ్బందులు తప్పవు. మండలాల్లో ఆయా పోస్టులు చాలా భర్తీకాకుండా ఉన్నాయి. ఇప్పుడున్న వ్యవస్థతో కొత్త విధులను నిర్వర్తించడంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగులు, సిబ్బంది సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.
నోట్: 1. సీసీఎల్ఏ రాష్ట్ర కార్యాలయం ఫోటో కోసం హరి పోల్డర్ను చూడగలరు.
2. లచ్చిరెడ్డి, శివశంకర్ పోటోలను ఐటెమ్స్లో వేశాను, పెట్టుకోగలరు.