Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోవును కోస్తున్నారని చితకబాదిన వైనం
- ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బాధితుల పురుగులు
- రాత్రంతా బిక్కు బిక్కుమంటూ ఊరవతలే..!
- వెలుగులోకి రాకుండా అధికారపార్టీ కుట్రలు
- ప్రజాసంఘాల చోరవతో ఆలస్యంగా వెలుగులోకి
నవతెలంగాణ-యాదాద్రిభువనగిరి ప్రతినిధి
గో సంరక్షణ మాటున దళితులపై కాషాయమూకల దాడులు యాదాద్రి జిల్లాకూ పాకాయి. పండుగ పూట మాంసం తినేందుకు గోవును కోసుకుంటున్న దళితులపై అర్ధరాత్రి దాడికి తెగబడ్డారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్న బాధితులను వెంటాడి విచక్షణారహితంగా చితకబాదారు. భయంతో దళితులు ఆ రాత్రంగా ఊరి బయటే చెట్టుకొకరు పుట్టకొకరుగా వ్యవసాయ బావుల వద్దే బిక్కుబిక్కుమంటూ గడిపారు. దీనికితోడు అదే రాత్రి కాషాయమూకకు అండగా పోలీసులు దళితులు నిర్వహిస్తున్న బెల్టుషాపుపైనా దాడి చేశారు. దాంతో ఊర్లోకి వచ్చేందుకే దళితులు బెంబేలెత్తుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బుధవారం ప్రజాసంఘాల నాయకులు బాధితులను పరామర్శించారు. నాయకులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...
చిన్నకందుకూర్ గ్రామంలో 140 దళిత కుటుంబాలున్నాయి. వీరిలో మాల, మాదిగ, బైండ్ల ఉపకులాల వారున్నారు. వీరంతా ఎన్నో ఏండ్ల నుంచి గోవు మాంసం తింటున్నారు. అందులో భాగంగానే సంక్రాంతి పండుగ సందర్భంగా మాంసం కోసం గోవులను కొనుక్కున్నారు. సోమవారం అర్ధరాత్రి దళితవాడకు కొద్ది దూరంలో ఎర్ర చంద్రయ్య, ఎర్ర ఉప్పలయ్య, బొల్లారం యాదయ్య, ఎర్ర పోషయ్య, ఎర్ర మల్లయ్య, నర్సయ్య, ఉప్పలయ్య, సోమయ్య, బడే స్వామి, భూషాపాక ఎల్లయ్య తదితర దళితులు గోవును కోస్తున్నారు. ఈ సమయంలో యాదగిరిగుట్ట మండల కేంద్రం, పెద్దకందుకూర్ గ్రామం నుంచి గోసంరక్షణ పేరిట కోకల సందీప్, కట్టగొమ్ముల రవిందర్రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 30 మంది ఆర్ఎస్ఎస్, భజరంగ్దళ్ కార్యకర్తలు బైక్లపై అక్కడికి చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న కర్రలతో ఒక్కసారిగా దళితులపై విచక్షణారహితంగా దాడి చేశారు. 'మాదిగ లం..' అంటూ పత్రికల్లో రాయలేని విధంగా బూతులు తిడుతూ కొట్టారు. భయంతో దళితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. అయినా వదలకుండా వెంటాడి కొట్టారు.
పరిగెత్తలేక ఎర్ర చంద్రయ్య అక్కడే కుప్పకూలిపోయాడు. ''గోవును కోయొద్దని మాకు తెలియదు. అనాది నుంచి మాంసం తింటున్నాం. తలా ఇంత వేసుకొని తెచ్చి పండుగకు కోసుకుంటున్నాం. మీ కాళ్లు మొక్కుతా కొట్టకండ్రీ.. దెబ్బలకు సచ్చిపోయేతట్టున్నా..'' అని కాళ్ల మీద పడి బతిమిలాడినా వదలకుండా తన్ని, పిడిగుద్దులు గుద్దారని ప్రజాసంఘాల నాయకుల ముందు బోరున విలపించాడు. అక్కడే ఉన్న గోవును కోసే కత్తులతో పొడవబోవడంతో చేతగాకున్నా కిందామీదా పడుతూ పరుగెత్తానని ఆ రోజు జరిగిన ఘటనను వివరించాడు.
చంద్రయ్య బెల్టు దుకాణంపై పోలీసుల దాడి..
హిందూత్వవాదులు దళితులపై దాడి చేసిన అర్ధరాత్రి తర్వాత కొద్దిసేపటికే పోలీసులు ఎర్ర చంద్రయ్య నిర్వహిస్తున్న బెల్టు దుకాణంపై దాడి చేశారు. సుమారు రూ.30 వేల మద్యం సీసాలను సీజ్ చేసి తీసుకెళ్లారు. హిందూత్వవాదుల ఫిర్యాదు మేరకే పోలీసులు దాడులు చేశారని దళితులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని ఇతర బెల్టు దుకాణాలపై ఎందుకు దాడులు చేయలేదని దళితులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కూడా హిందూత్వవాదులకే అండగా నిలిచారని ప్రజాసంఘాల నాయకులు విమర్శించారు.
రాజీ కోసం అధికారపార్టీ యత్నం
దళితులపై జరిగిన దాడిని వెలుగులోకి రానివ్వకుండా అధికారపార్టీ నాయకులు రంగంలోకి దిగారు. దళితులు పోలీస్స్టేషన్కు వెళ్లకుండా ఊర్లోనే మాట్లాడి రాజీ చేసే ప్రయత్నం చేశారు. దాడి విషయాన్ని దళితులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించారు.
బాధితులకు అండగా ప్రజాసంఘాలు
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్పంగి స్వామి, ఆవాజ్ జిల్లా నాయకులు షేక్ ఉస్మాన్ షరీఫ్ బుధవారం గ్రామాన్ని సందర్శించారు. దళితులను కలిసి ఘటన వివరాలు తెలుసుకున్నారు.
ఇరువురిపైనా కేసులు..
చట్టవిరుద్దంగా గోవును కోసారన్న అభియోగంలో దళితులపై, బెల్టు దుకాణం నిర్వహిస్తున్న ఎర్ర చంద్రయ్యపైనా కేసు నమోదు చేసినట్టు భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపారు. అదే విధంగా దళితుల ఫిర్యాదు మేరకు రవిందర్రెడ్డి అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు చెప్పారు.
దాడి చేసే అధికారం ఎవరిచ్చారు? : సీపీఐ(ఎం)
చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దళితులపై దాడి చేసే అధికారం హిందూత్వవాదులకు ఎవరిచ్చారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నల్లా సూర్యప్రకాశ్ ప్రశ్నించారు. దాడిని తీవ్రంగా ఖండించారు. బాధితుల పక్షాన ఉండాల్సిన పోలీసులు హిందూత్వవాదులకు తొత్తులుగా వ్యవహరించడాన్ని ఖండించారు. దాడి జరిగి మూడు రోజులవుతున్నా కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించడాన్ని తప్పు పట్టారు. దళితులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తేసి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.