Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ ఫిర్యాదును పక్కనపెట్టిన అధికారులు
- ఏబీవీపీ ఆరోపణలపై విచారణ
- వర్సిటీ ప్రొక్టోరల్బోర్డు తీరుపై విమర్శలు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) లో అధికారులు రివర్స్గేమ్ మొదలుపెట్టారు. విద్యార్థి బూతులు తిట్టాడు...అతనిపై చర్యలు తీసుకోండని ప్రొఫెసర్ ఫిర్యాదు చేస్తే పట్టించుకోని వర్సిటీ అధికారులు, ఆ ప్రొఫెసర్ పాఠ్యాంశంలో లేని అంశం బోధించారని ఓ సంఘం చేసిన ఫిర్యాదుపై మాత్రం విచారణ చేపట్టారు. ఇలా వ్యవహరించింది మాములు అధికారులు కాదు.. వర్సిటీ అత్యున్నత కమిటీగా చెబుతున్న ప్రొక్టోరల్బోర్డు ప్రతినిధులు. రెండు నెలలుగా ఒక ఫిర్యాదుపై చర్యలు తీసుకోకుండా నాన్చివేత ధోరణిలో వెళ్తున్న వర్సిటీపై అనేక ఆరోపణలు ఎక్కువయ్యాయి. కావాలనే ఆ విద్యార్థి సంఘం నేతను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
హెచ్సీయూలో అర్థశాస్త్రం విభాగంలో టీచర్గా పనిచేస్తున్న ప్రొఫెసర్ లక్ష్మీనారాయణపై గతేడాది నవంబర్ 25న ఏబీవీపీ జాతీయ నేత కరన్ కల్సానియా అనే విద్యార్థి సోషల్మీడియాలో బూతులతో కూడిన పోస్టింగ్పెట్టాడు. దీనిపై అదే నెలాఖరులో ఆ ప్రొఫెసర్ వర్సిటీ వీసీ అప్పారావు, ప్రొక్టోరల్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు మాత్రం వర్సిటీకి సెలవులు అంటూ విచారణ పక్కన పెట్టారు. డీన్ అభిప్రాయమనీ, ప్రొక్టోరల్ బోర్డుకు పంపామని చెప్పుకుంటూ కాలయాపన చేశారు. 'లెఫ్ట్, అంబేద్కరిస్ట్ ప్రొఫెసర్లే టార్గెట్' శీర్షికతో నవతెలంగాణ ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో స్పందించిన వర్సిటీ అధికారులు ఈనెల 17న ప్రొక్టోరల్ బోర్డు సమావేశం నిర్వహిస్తున్నామనీ, ఆ కమిటీ ముందు హాజరుకావాలని ఆ విద్యార్థికి ఆదేశించినట్టు వర్సిటీ అధికా రులు ఒక ప్రకటన విడుదల చేశారు. కానీ 17న విద్యార్థిని కాకుండా ప్రొఫెసర్ను మరో అంశంపై విచారించడం గమనార్హం.
విద్యార్థి సంఘం ఫిర్యాదుపై విచారణ !
అర్థశాస్త్రం పేపర్లో ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ విద్యా కాశాయీకరణపై ఒక ప్రశ్న ఇచ్చారు. దీనిపైనే ఏబీవీపీ నేతలు సోషల్మీడియా వేదికపై బూతుల వర్షం కురిపించారు. దీనిపై ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అధికారు లకు ఫిర్యాదు చేసిన కొన్ని రోజులకు, సబ్జెక్టుకు సంబంధం లేని అంశాలు బోధిస్తున్నారని ఏబీవీపీ నేతలూ ప్రొఫెసర్పై వీసీకి ఫిర్యాదు చేశారు. అయితే ఈనెల 17న విద్యార్థిని బోర్డు ముందు హాజరుకావాలనీ పిలిచినా, ఈ అంశంపై అతన్ని ప్రశ్నించలేదు. విచారణ ఈనెల 24కు వాయిదా వేసినట్టు తెలిసింది. కానీ ఏబీవీపీ ఇచ్చిన ఫిర్యాదుపై మా త్రం ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ నుంచి ప్రొక్టోరల్ బోర్డు రాత పూర్వక అభిప్రాయాన్ని తీసుకున్నది. అయితే అర్థశాస్త్రంలో ప్రభుత్వ విధానాలపై చర్చించే క్రమంలో 'కాశాయీకరణ' అంశం వస్తుందనీ, ఇది పాఠ్యాంశంలో ఓ భాగమేనని ప్రొఫెసర్ చెప్పినట్టు తెలిసింది. దీంతోపాటు ఎకనామిక్స్ డిపార్ట్మెంట్తో సంబంధంలేని విద్యార్థి తనకు ఆ సబ్జెక్టులో బేసిక్స్ కూడా తెలియవనీ విమర్శించడం ఏంటని ప్రశ్నించి నట్టు తెలిసింది. బ్లాక్మెయిల్తో ప్రమోషన్ పొందినట్టు ఆరోపణలు చేయడం, బోర్డు చైర్మెన్గా ఉన్న వీసీనీ అవమానించడమేననీ ప్రొఫెసర్ తన వివరణలో పేర్కొనట్టు సమాచారం.
కావాలనే కాలయాపనా..?
దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్ను బూతులు తిట్టిన, ఏబీవీపీ నేతపై చర్యలు తీసుకునేందుకు వర్సిటీ అధికారులు కావాలనే కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణ పేరుతో ఈ అంశాన్ని సాగదీస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ప్రొక్టోరల్బోర్డు చైర్మెన్ విదేశాల్లో ఉండటం, వర్సిటికీ సెలవులు రావడం ఆలస్యానికి కారణంగా చెబుతున్నారు. చిన్న అధికారి సెలవులో పోతేనే ఆ బాధ్యతను వేరే వారికి అప్పగిస్తారు. కానీ వర్సిటి అత్యున్నత కమిటీ చైర్మెన్ బాధ్య తలను మాత్రం ఎవ్వరికీ ఇన్చార్జి బాధ్యతలు అప్పగిం చకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే గతంలో ప్రొఫెసర్లను తిట్టారనే ఆరోపణలతో పది మంది విద్యార్థు లపై కేవలం మూడు రోజుల్లోనే చర్యలు తీసుకు న్నారు. అప్పుడు ఈ ప్రొక్టోరల్ బోర్డు, సెలవులు అనే అంశా లు కనిపించలేవని ప్రొఫెసర్లు ఆరోపిస్తున్నారు. అయితే ఈ అంశంపై విచారణ జరుగుతుందనీ త్వరలో కమిటీ నిర్ణయం ప్రకటిస్తుందనీ, ప్రొఫెసర్పై ఏబీవీపీ ఫిర్యాదు చేసిన అంశం తనకు తెలియదని వర్సిటీ అధికార ప్రతినిధి వినోద్ పావరాల నవతెలంగాణతో చెప్పారు.