Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ మోడల్ అమలు చేయాలి
- ఉచిత విద్య, వైద్యమందించడమే బీఎల్ఎఫ్ లక్ష్యం
- అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం : నల్లా
నవతెలంగాణ-వరంగల్
సీఎం కేసీఆర్ అభినవ నిజాంగా వ్యవహరి స్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బహుజన లెప్ట్ ఫ్రంట్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తదని నాయకులు నల్లా సూర్యప్రకాశ్ తెలిపారు. శుక్రవారం హన్మకొండలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా బీఎల్ఎఫ్ ఏర్పడనుందన్నారు. రాబోయే రోజుల్లో దళిత, గిరిజన, బలహీనవర్గాలు, మైనార్టీలకే అధికారం రావాలన్నారు. ఈనెల 25న హైదరాబాద్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆవిర్భావ సభ జరగనుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అన్ని పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు బీఎల్ఎఫ్ పోటీ చేస్తుందన్నారు. అంబేద్కర్, పూలే, మార్క్స్ విధానాలతో ప్రజల ముందుకు వెళ్తున్నామన్నారు. బీఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే ఉచితంగా విద్య, వైద్యం అందించనున్నట్టు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని కాపాడతామన్నారు. టీడీపీ పాలనలో ప్రారంభమైన రైతుల ఆత్మహత్యలు, కాంగ్రెస్, టీఆర్ఎస్ పాలనలోనూ కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాలో 50 శాతం మహిళలున్నా ఒక్కరికీ మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. ఎన్కౌంటర్లు లేని రాష్ట్రంగా చేస్తానని చెప్పారని, కేసీఆర్ అధికారంలోకి రాగానే ఎన్కౌంటర్లు మొదలుపెట్టారని విమర్శించారు. గుజరాత్ మోడల్ అంటే గోరక్ష పేరిట దాడులు చేయడం, చంపడమేనన్నారు. అందువల్ల కేరళ మోడల్ను అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో ఆలేరు నియోజకవర్గంలో గోవును దళితులు కోసుకున్నారని హిందూత్వవాదులు దాడి చేసి గాయపరిచారన్నారు. అక్కడ ఎమ్మెల్యే కూడా వారినే ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి రాములు మాట్లాడుతూ.. జనాభాలో ఏడు శాతం ఉన్న పెత్తందారులే 70 ఏండ్లుగా పాలిస్తున్నారని, ఇదేనా సామాజిక న్యాయమని ప్రశ్నించారు. ఎంసీపీఐ(యు) కేంద్ర కమిటీ సభ్యులు మద్దికాయల అశోక్ మాట్లాడుతూ.. సామాజిక శక్తులు, శ్రామిక శక్తులు ఐక్య పోరాటాలు చేస్తేనే సామాజిక న్యాయం సాధ్యమన్నారు.మహాజన్ సమాజ్ పార్టీ నాయకులు పటేల్ వనజ మాట్లాడుతూ.. బీఎల్ఎఫ్ మరో చరిత్ర సృష్టించనుందన్నారు.ఈ సమావేశంలో సీపీఐ(ఎం) వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి, టీమాస్ రాష్ట్ర నాయకులు స్కైలాబ్బాబు, నాయకులు సాయిని నరేందర్, మాలి బాబురావు, ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి శివాజీ, మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి నాగేందర్, బుల్లెట్ వెంకన్న, బుంగా జ్యోతిరాణి, ఈశ్వర్సింగ్ పాల్గొన్నారు.