Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్లు సహకరించాలని గవర్నర్ నరసింహన్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పసిపిల్లల్లో సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, సంగీతం వంటి నైపుణ్యం అందించడం కోసం ఆరంభ్ అనే కార్యక్రమం ప్రారంభమవుతున్నది. 31 జిల్లాల వారీగా జిల్లాకో పాఠశాలను ఎంపిక చేసి వాటిలో ఉండే 2 నుంచి 4 ఏండ్ల పిల్లలకు ఈ రంగాల్లో ప్రావీణ్యం అందించాలని స్పిక్ మెకే స్వచ్ఛంద సంస్థ ప్రతిపాదించింది. దీనికి 31 జిల్లాల కలెక్టర్లూ సహకరించాలని గవర్నర్ నరసింహన్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్లోని రాజ్భవన్లో స్పిక్ మెకే సలహామండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ ఎంపిక చేసిన పిల్లలకు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్, నృత్యం, సంగీతంలో శిక్షణ ఇస్తారని చెప్పారు. జిల్లాల కలెక్టర్లు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులూ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు సంస్కృతిలో విశేష ప్రావీణ్యం ఉందన్నారు. విద్యార్థుల్లో ఉండే ప్రతిభను వెలికితీయాలని ఉపాధ్యాయులకు సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యార్థులకు ప్రతిభ కనబరిచే అవకాశాలు కల్పించాలని కోరారు. విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లోనూ సాంస్కృతిక వేడుకలను నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్పిక్ మెకే వ్యవస్థాపకులు కిరణ్సేథ్, గవర్నర్ సతీమణి విమలా నరసింహన్, రాజ్భవన్ కార్యదర్శి హరిప్రీత్సింగ్, ఉన్నత విద్యామండలి చైర్మెన్ తుమ్మల పాపిరెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ డైరెక్టర్ జనరల్ అజిత్ రంగేకర్, ఇంటర్ విద్యా కమిషనర్ ఎ అశోక్, ఎన్ఐటీ వరంగల్ డైరెక్టర్ ఎన్వి రమణారావు, ప్రముఖ శాస్త్రవేత్త డి బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.