Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవీకే - ఈఎంఆర్ నిర్వాహకం
- బైక్ అంబులెన్స్ల ఎఫ్ఆర్లకు శిక్షణ పేరుతో వసూళ్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జీవీకే-ఈఎంఆర్ అవినీతి భాగోతం మరోసారి వెలుగులోకి వచ్చింది. 108 అత్యవసర వాహనాలను పర్యవేక్షిస్తున్న ఆ సంస్థపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. తాజాగా బైక్ అంబులెన్స్ల్లోనూ వైద్య శిక్షణ పేరుతో అభ్యర్థుల నుండి లక్షల్లో వసూలు చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల 17న ప్రభుత్వం 50 అత్యవసర ద్విచక్ర వాహనాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఎమర్జెన్సీ సేవలు అందని మారుమూల గల్లీ ప్రాంతాల ప్రజల కోసం వీటిని వినియోగిస్తున్నారు. అత్యంత రద్దీ ఇరుకైన ప్రాంతాలలో ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సేవలను ఉచితంగా అందజేస్తున్నారు. ఈ వాహనాల పర్యవేక్షణ బాధ్యతను కూడా ప్రభుత్వం జీవీకే-ఈఎంఆర్ఐకే అప్పగించింది. ఈ నేపథ్యంలో వాహనాలను నడిపే ఫస్ట్ రెస్పాండర్ల (ఎఫ్ఆర్)కు ఆక్సిజన్ సిలిండర్ ఎలా వినియోగించాలి, తేలికపాటు గాయాలకు ప్రాథమిక చికిత్స, పరికరాలను ఏవిధంగా వినియోగించాలి అనే తదితర అంశాలపై అభ్యర్థులకు కొన్ని రోజులపాటు శిక్షణ ఇచ్చింది. శిక్షణను ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సంస్థ ఒక్కోక్కరి నుండి రూ.16 వేలు వసూలు చేసిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. కాగా, శిక్షణ కోసం 50 మంది అభ్యర్థులను నాలుగు బ్యాచ్ల చొప్పున ఎంపిక చేసింది. వీరందరి నుండి ఒక్కొక్కరి వద్ద రూ.16 వేల ఫీజు కట్టించుకుంది. కొన్నాళ్లకు మరికొంత మంది అభ్యర్థులను ఎంపిక చేసి వారిని ఐదో బ్యాచ్గా నియమించింది. అయితే వీరి నుంచి శిక్షణకు ఎలాంటి ఫీజు వసూలు చేయకపోవడం గమనార్హం. అభ్యర్థుల నుంచి వసూలు చేసిన సొమ్మును వెంటనే తిరిగి ఇవ్వాలని తెలంగాణ 108 సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె అశోక్ డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇలా ఉండగా, రెండు రోజుల క్రితం అందుబాటులోకి వచ్చిన అత్యవసర ద్విచక్ర వాహనాలు స్టార్టింగ్ ట్రబుల్ను ఎదుర్కొంటున్నట్టు సమాచారం. కొత్త వాహనాల్లో ఇలాంటి సమస్యలేమిటని ఎఫ్ఆర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.